భవనంపై నుంచి దూకి యువతి ఆత్మహత్య
హైదరాబాద్: నగరంలోని కూకట్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం విషాద ఘటన జరిగింది. మతిస్థిమితం సరిగా లేని ఓ విద్యార్థిని భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.
కూకట్పల్లి శ్రీనిలయం మొదటి అంతస్తులోని జీ2 ఇంటిలో 2007నుంచి చంద్రశేఖర్ కుటుంబం నివాసముంటోంది. ఆయన ఏకైక కుమార్తె వెంకట నాగసాయి రేష్మి(18) స్థానికంగా ఉన్న రావూస్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఈమెకు ఏడాదిన్నర కాలంగా మానసికస్థితి సరిగా లేని కారణంగా చికిత్స అందిస్తున్నారు.
రేష్మి తల్లి రాజరాజశ్రీకి కూడా దీర్ఘకాలికంగా మానసికస్థితి సరిగాలేదు. దీంతో చంద్రశేఖర్ స్థానికంగా ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తూ భార్యాబిడ్డలను చూసుకుంటున్నారు. కాగా, గురువారం ఉదయం అల్పాహారం చేశాక రేష్మి తాముండే భవనం నాలుగో అంతస్తు టెర్రస్ మీదకు చేరి అక్కడినుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.
ఆమె బలవన్మరణానికి గల కారణాలు తెలియరాలేదు. చికిత్స పొందుతున్నందున ఇటీవల ఆమె ఆరోగ్యం కొంత మెరుగుపడిందని, చదువులోనూ చురుగ్గా ఉండే ఆమె ఎందుకు ఇలా చేసుకుందో తెలియడంలేదని ప్రిన్సిపల్ రమేష్ తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.