రాష్ డ్రైవింగ్! బైక్ ఆపినందుకు ట్రాఫిక్ పోలీసుపై టీనేజర్ దాడి, వీరంగం సృష్టించాడు
హైదరాబాద్: వేగంగా బైక్ నడుపుతూ.. బైక్ ఆపినందుకు.. ట్రాఫిక్ పోలీసులపై ఓ యువకుడు దాడిచేశాడు. ఈ ఘటన రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ప్రత్యక్షసాక్షులు, పోలీసులు తెలిపిన వివరాలప్రకారం.. రాజేంద్రనగర్ ట్రాఫిక్ పీఎస్కు చెందిన పోలీసు అధికారి కేశవులు సిబ్బందితో కలిసి హైదర్గూడ పల్లవిబార్ వద్ద విధులు నిర్వహిస్తున్నాడు.
శుక్రవారం ఉదయం 10.30 సమయంలో హైదర్గూడ నుంచి అత్తాపూర్ వైపు బైక్పై వేగంగా వెళుతున్న యువకుడ్ని(17)ని గుర్తించిన పోలీసులు అతడిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా బైక్ ఆపలేదు. దీంతో పోలీసులు అతడిని ఫొటో తీసేందుకు ప్రయత్నించగా బైక్ దిగిన యువకుడు 'నన్నే ఫొటో తీస్తావా' అంటూ ట్రాఫిక్ పోలీసులపై దాడికి పాల్పడ్డాడు.
అక్కడున్నవారు అతడిని వారించేందుకు యత్నించినా వినకుండా పోలీసులను కాలితో తంతూ దుర్బాషలాడాడు. దీంతో పోలీసులు అతడిని పట్టుకొని వ్యాన్లోకి ఎక్కించినా శాంతించకుండా వారిపై దాడి చేశాడు. దీనిపై సమాచారం అందడంతో రాజేంద్రనగర్ ఎస్సై వెంకటేష్ సిబ్బందితో అక్కడికి చేరుకుని ఆ యువకుడ్ని అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.