భరించలేకపోయా, నీకు పెళ్లైందిగా అని చెప్పా: శిరీష పేరెంట్స్తో తేజస్విని, జాబ్ మానేయమని హెచ్చరిక
బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. గురువారం మధ్యాహ్నం తేజస్విని టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి వచ్చింది. దాదాపు పదిపదిహేను నిమిషాల పాటు శిరీష కుటుంబ సభ్యులతో మాట్లాడారు.
హైదరాబాద్: బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. గురువారం మధ్యాహ్నం తేజస్విని టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి వచ్చింది. దాదాపు పదిపదిహేను నిమిషాల పాటు శిరీష కుటుంబ సభ్యులతో మాట్లాడారు.
చదవండి: శిరీష ఏం చేసిందంటే..: తల్లిదండ్రులకు ఆధారాలు చూపిన పోలీసులు
శిరీషది ఆత్మహత్యేనని, ఆమెపై అత్యాచారం జరిపి చంపేశారని ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. వారి అనుమానాలు నివృత్తి చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం ఆధారాలు కూడా వారి ముందు పెడుతున్నారు.
ఇందులో భాగంగా కుకునూరుపల్లికి కుటుంబ సభ్యులను తీసుకు వెళ్లి అనుమానాలు నివృత్తి చేసే ప్రయత్నం చేశారు. అలాగే, తేజస్వినిని కూడా రప్పించి.. శిరీష ఫ్యామిలీతో మాట్లాడించారు. ఈ సందర్భంగా తేజస్విని కీలక వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది.
రాజీవ్, నేను ప్రేమించుకున్నాం.. శిరీషను భరించలేకపోయా
శిరీష కుటుంబ సభ్యులతో తేజస్విని పలు విషయాలు వెల్లడించారని తెలుస్తోంది. రాజీవ్ తన బాయ్ ఫ్రెండ్ అని తేజస్విని వారికి చెప్పారు. తామిద్దరం ప్రేమించుకున్నామని వివరించారు. త్వరలో పెళ్లి చేసుకోవాలని అనుకున్నామని తెలిపారు. అయితే, తమ మధ్యకు శిరీష రావడాన్ని తాను ఏమాత్రం భరించలేకపోయానని ఆమె చెప్పారు.
గొడవపడ్డా.. పెళ్లైన నీవు రాజీవ్ను కోరుకుంటావా
రాజీవ్ విషయంలో తాను శిరీషతో రెండుమూడుసార్లు గొడవ పడ్డానని తేజస్విని వారితో చెప్పారు. ఆమె వినక పోవడంతో పోలీసులకు కూడా ఫిర్యాదు చేసానని తెలిపారు. పెళ్లైన నీవు రాజీవ్ను కోరుకోవడం ఏమిటి అని శిరీషను నిలదీశానని చెప్పారు. నీకు పెళ్లయిందని, కాబట్టి ఇలాంటి వ్యవహారం సరికాదని చెప్పే ప్రయత్నం చేశానని తెలిపారు.
ఉద్యోగం మానేయమని హెచ్చరించా
శిరీష తీరులో మార్పు రాకపోవడంతో రాజీవ్ వద్ద ఉద్యోగం మానేయాలని హెచ్చరించానని తేజస్విని వారితో చెప్పారు. అప్పుడు కూడా వినకపోవడంతో పరస్పరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసుకున్నామని తెలిపారు.
చిన్న విషయానికి ఆత్మహత్య బాధించింది
శిరీష ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసి తాను ఎంతో బాధపడ్డానని తేజస్విని ఆమె కుటుంబ సభ్యులతో చెప్పారు. ఇంత చిన్న విషయానికి ఆమె ఆత్మహత్య చేసుకుంటుందని భావించలేదని అన్నారు.
10-15 నిమిషాలు బాధను వెళ్లగక్కిన తేజస్విని
తేజస్విని చెప్పిన వివరాలను శిరీష కుటుంబ సభ్యులు పది పదిహేను నిమిషాలు మౌనంగా విన్నారని తెలుస్తోంది. కాసేపు మాట్లాడిన కాసేపు తన బాధను వెళ్లగక్కిన, అనంతరం టాస్క్ ఫోర్స్ కార్యాలయం నుంచి తేజస్విని వెళ్లిపోయారు.
శిరీష పేరెంట్స్ అసంతృప్తి
శిరీష మృతి విషయంలో పోలీసులు ఎన్ని విధాలుగా నచ్చ చెప్పే ప్రయత్నాలు చేసినా ఆమె తల్లిదండ్రులు, బంధువులు సంతృప్తి పడలేదని తెలుస్తోంది. తమ కూతురుది హత్యేనని, అంతకుముందు అత్యాచారం చేశారని పదేపదే పోలీసుల ఎదుట అనుమానాలు వ్యక్తం చేశారని తెలుస్తోంది. కుకురనూరుపల్లి తీసుకువెళ్లి కూడా ఆధారాలను పోలీసులు చూపించారు. అయినప్పటికీ శిరీష తల్లిదండ్రులు పూర్తి సంతృప్తిగా లేరని తెలుస్తోంది.
శిరీష ఎలాగూ బతికిరాదు కాబట్టి..
తేజస్వినితో మాట్లాడించడం, కుకునూరుపల్లి తీసుక వెళ్లిన అనంతరం శిరీష తల్లిదండ్రులు పోలీసులకు ఓ విషయం చెప్పారని తెలుస్తోంది. తన కూతురుపై అత్యాచారం జరిగిందని, ఆ తర్వాతే హత్య జరిగిందని వారికి చెప్పారు. అయితే, చనిపోయిన తమ కూతురు ఎలాగూ తిరిగి రాదని, కనీసం నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని వారు పోలీసులను కోరారు. ఈ మేరకు అవసరమైతే కేసును పునర్విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు.