తెలుగు రాష్ట్రాల్లో వరుస రోడ్డు ప్రమాదాలు: ఆర్టీసీ బస్సు బోల్తా: పలువురికి తీవ్ర గాయాలు
కామారెడ్డి: రెండు తెలుగు రాష్ట్రాల్లో వరుస రోడ్డు ప్రమాదాలు హడలెత్తిస్తోన్నాయి. విశాఖపట్నం జిల్లా అనంతగిరి వద్ద ప్రైవేటు బస్సు లోయలోకి దూసుకెళ్లిన ఘటన విస్మరించకముందే కర్నూలు జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 14 మంది అక్కడికక్కడే మరణించారు. పలువురు గాయపడ్డారు. అదే సమయంలోనే తెలంగాణలో మరో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 17 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.
కర్నూలు జిల్లాలో ఘోరం: 14 మంది అక్కడికక్కడే దుర్మరణం
కామారెడ్డి జిల్లా టేక్రియాల్ వద్ద ఈ ఘటన సంభవించింది. మహారాష్ట్రకు చెందిన ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఆ సమయంలో బస్సులో 34 మంది ప్రయాణికులు ఉన్నారు. నాందెడ్ నుంచి హైదరాబాద్కు బయలుదేరిన ఆర్టీసీ బస్సు మార్గమధ్యలో టేక్రియాల్ వద్దకు చేరుకున్న వెంటనే అదుపు తప్పింది. ఎదురుగా వస్తోన్న వాహనాన్ని తప్పించబోయి బోల్తా పడింది. ఈ ఘటనలో 17 మంది గాయపడ్దారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. తీవ్రగాయాలైన వారిని మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నిద్రమత్తు, అతివేగమే ఈ ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా నిర్దారించారు. అతివేగంతో నియంత్రణ కోల్పోవడం వల్లే బోల్తా కొట్టిందని పేర్కొన్నారు. ఎదురుగా వచ్చిన వాహనాన్ని తప్పించబోయి డ్రైవర్ హఠాత్తుగా బస్సును మళ్లించడానికి ప్రయత్నించడంతో అది బోల్తా పడిందని చెప్పారు.