దిగి రావాల్సిందే.. పెట్రోల్ బాటిళ్లతో ఆందోళన, కేటీఆర్ హామీ (పిక్చర్స్)
హైదరాబాద్: దసరానాటి కల్లా ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగులను తెలంగాణకు తీసుకొస్తామని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఉద్యోగ సంఘాల నేతలకు సోమవారం నాడు హామీ ఇచ్చారు. తెలంగాణ ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
కేటీఆర్ హామీ
నాంపల్లిలోని టీఎన్జీవో భవన్లో ఏపీకి కేటాయించబడిన తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఉద్యోగ సంఘాల నేతలతో కేటీఆర్ చర్చించారు. ఏపీలో ఉన్న తెలంగాణ ఉద్యోగుల కష్టాలు సీఎం కేసీఆర్ దృష్టిలో ఉన్నాయన్నారు.
కేసీఆర్తో చర్చించి..సాంకేతిక కారణావల్లే ఆలస్యమన్న కేటీఆర్
సాంకేతిక కారణాలవల్లే కొద్దిగా ఆలస్యం అవుతోందన్నారు. కేసీఆర్తో చర్చించి, ఏపీలో ఉన్న తెలంగాణ ఉద్యోగులంతా ఇక్కడకు వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన పలువురు ఉద్యోగులతో చర్చలు జరిపారు. అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు ఆందోళన చేస్తున్న వారితో మాట్లాడారు.
తాళాలు పగులగొట్టి
అంతకుముందు, తమను వెంటనే వెనుకకు తీసుకు రావాలని డిమాండ్ చేస్తూ నాంపల్లిలోని టీఎన్జీవో కార్యాలయం పైకి ఎక్కి తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఉదయం ఆరు గంటలకే పెద్ద సంఖ్యలో టీఎన్జీవో కార్యాలయం వద్దకు చేరుకుని గేట్ తాళం.. తర్వాత కార్యాలయం తాళాలు పగులగొట్టి భవనం లోపలికి వెళ్లారు.
కేటీఆర్తో ప్రకటన చేయించాలని డిమాండ్
కార్యాలయంలోకి వెళ్లే గ్రిల్స్, లిఫ్ట్లకు తాళాలు వేశారు. తర్వాత బాల్కానీలోకి వచ్చి వెంటనే తమను తెలంగాణకు తీసుకొస్తున్నట్లు మంత్రి కేటీఆర్తో ప్రకటన చేయించాలని నినదించారు. ఎవరైనా పైకి రావాలని ప్రయత్నిస్తే పెట్రోల్ పోసుకుని చనిపోతామని పెట్రోల్ సీసాలు, అగ్గిపెట్టెలు ప్రదర్శించడంతో ఉద్రిక్త పరిస్థితి కనిపించింది.
సమస్య పరిష్కారానికి సుముఖత
విషయం తెలియగానే పోలీసులు అక్కడికి చేరుకుని బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో టీజీవో ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు ఎంబీ కృష్ణయాదవ్, టీఎన్జీవోస్ ప్రధాన కార్యదర్శి రాజేందర్ తదితరులు అక్కడికి చేరుకుని సమస్య పరిష్కారానికి సర్కార్ సుముఖమని చెప్పారు. అయినా ఆందోళనకారులు తగ్గలేదు.
శ్రీనివాస్ గౌడ్ హామీ
తమకు సంఘీభావం తెలుపాలని రోడ్డుపై ధర్నాచేస్తున్న ఉద్యోగులు పట్టుబట్టారు. కొద్దిసేపు ధర్నాలో కూర్చుకోక తప్పలేదు. కాగా, ఏపీలో ఉన్న తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగులను వెనుకకు తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలమని ఎమ్మెల్యే, టిజీవో వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.