ఓటుకు నోటు ట్విస్ట్: ఆదికేశవులు కొడుకు సహా ముగ్గురికి నోటీసు, అందాయని శ్రీనివాస్
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన ఓటుకు నోటు కేసులో మరో ట్విస్ట్! తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) సోమవారం నాడు మాజీ ఎంపీ ఆదికేశవులు నాయుడు తనయుడు డికె శ్రీనివాసులుకు నోటీసులు ఇచ్చింది.
ఆయనకు ఆదివారం నాడే తెలంగాణ ఎసిబి నోటీసులు ఇచ్చింది. కర్నాటక రాజధాని బెంగళూరులోని ఆయన నివాసానికి వెళ్లి నోటీసులు ఇచ్చారు. మంగళవారం నాడు సాయంత్రం తమ ఎదుట హాజరు కావాలని ఎసిబి నోటీసుల్లో పేర్కొంది.
మాజీ ఎంపీ ఆదికేశవులు నాయుడు తనయుడు శ్రీనివాసులు నాయుడుకు ఓటుకు నోటు కేసులో ఎసిబి నోటీసులు ఇవ్వడం ఏమైనా కొత్త మలుపు తిరుగుతుందా అనే చర్చ సాగుతోంది. శ్రీనివాస్ నాయుడుతో పాటు అతని స్నేహితులు చైతన్య, విష్ణులకు కూడా నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
నోటీసులు అందాయి: శ్రీనివాసులు నాయుడు
ఓటుకు నోటు కేసులో తనకు నోటీసులు అందాయని శ్రీనివాస్ నాయుడు చెప్పారు. అందులో ఏముందో పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు. తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తెలుగు రాష్ట్రాలను ఓటుకు నోటు అంశం కుదిపేసిన విషయం తెలిసిందే.