ఆయన జోక్యం ఏమిటి: ఓటుకు నోటు కేసులో వైసిపి ఎమ్మెల్యేకు టి ఏసీబీ
హైదరాబాద్: ఓటుకు నోటు పైన సోమవారం నాడు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ఏసీబీ తన వాదనలు వినిపించింది. ఈ కేసులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డికి సంబంధం ఏమిటని అభిప్రాయపడింది.
ఓటుకు నోటు కేసు దర్యాఫ్తులో పురోగతి లేదని ఆళ్ల రామకృష్ణా రెడ్డి చెప్పడం సరికాదని తెలంగాణ ఏసీబీ పేర్కొంది. దర్యాఫ్తులో కేసుకు సంబంధం లేని వ్యక్తుల జోక్యం తగదన్నారు. ఇది దర్యాఫ్తు ప్రక్రియకు ఇబ్బంది కలిగించేలా ఉందన్నారు. దర్యాఫ్తును చట్టపరిధిలో కొనసాగిస్తున్నామని చెప్పారు. అనంతరం విచారణను హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది.
కాగా, ఓ క్రిమినల్ కేసు విచారణలో కేసుతో సంబంధం లేని మూడో వ్యక్తి ప్రమేయం ఉండటానికి ఎంతమాత్రం వీల్లేదని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తరఫు లాయర్ సిద్ధార్థ లూత్రా రెండు వారాల క్రితం సోమవారం హైకోర్టులో వాదనలు వినిపించారు.
ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్రపై దర్యాఫ్తు జరపాలని కోర్టును ఆశ్రయించే అర్హత లేదన్నారు. ఆయనకు ఏసీబీ న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాసం లేదని చెప్పారు. అందుకు చట్ట నిబంధనలు అనుమతించవని చెప్పారు.
ఓటుకు నోటులో ఏసీబీ దర్యాఫ్తు పైన తమకు అభ్యంతరం లేదని, దాని నుంచి తప్పుకోవాలనే ఉద్దేశ్యం లేదని, కానీ నిబంధనలకు విరుద్ధంగా దాఖలు చేసిన పిటిషన్ పైన విచారణకు ఆదేశించడం పైనే తమ అభ్యంతరమని ఈ సందర్భంగా తెలిపారు.
ఓటుకు నోటు కేసుతో ఎలాంటి సంబంధం లేని, ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఇచ్చిన ప్రయివేటు ఫిర్యాదు పైన ఏసీబీ కోర్టు విచారణకు ఆదేశించడం సరికాదన్నారు. అదేవిధంగా కేసుతో ఎలాంటి సంబంధం లేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేయడాన్ని కూడా వ్యతిరేకించారు.
ఈ కేసులో ప్రధాన ఫిర్యాదుదారు స్టీఫెన్ సన్ అని, ఘటన తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉందని చెప్పారు. కేసులో విచారణ కొనసాగుతుందని ఏసీబీ అధికారులే చెబుతున్నారని, అలాంటప్పుడు ఉండవల్లి ఎందుకు వచ్చి పడ్డారని ప్రశ్నించారు. ఉండవల్లికి లోకల్ స్టాండీ లేదని, ఈ కేసుతో సంబంధం లేదని రెండు వారాల క్రితం చంద్రబాబు తరఫు న్యాయవాది అన్నారు.