తొలితరం తెలంగాణ ఉద్యమకారుడికి ప్రభుత్వ సాయం... మంత్రి కేటీఆర్ చొరవతో...
అనారోగ్యంతో బాధపడుతున్న తొలితరం తెలంగాణ ఉద్యమకారుడు డా.కొల్లూరి చిరంజీవికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించింది. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆయన వైద్యానికి రూ.10లక్షలు మంజూరు చేసింది. మంత్రి కేటీఆర్ చొరవ తీసుకుని చిరంజీవి అనారోగ్యం విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో తక్షణం స్పందించిన సీఎంవో కార్యాలయం ఆర్థిక సాయం అందించింది.
డా.చిరంజీవి ప్రస్తుతం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక సాయం అందేలా చొరవ తీసుకున్న మంత్రి కేటీఆర్కు చిరంజీవి కుమార్తె అజిత,ఇతర కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. యాధృచ్చికంగా ఇదే రోజు చిరంజీవి పుట్టినరోజు కావడాన్ని ఆయన కుటుంబ సభ్యులు గుర్తుచేశారు. కేటీఆర్ చేసిన సాయాన్ని ఎప్పటికీ మరిచిపోలేమని చెప్పారు. చిరంజీవి అనారోగ్య పరిస్థితి గురించి తెలిసి మంత్రి ఈటల రాజేందర్ కూడా ఆయన్ను పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
కష్టకాలంలో తెలంగాణ ఉద్యమకారుడికి అండగా నిలిచిన ప్రభుత్వం పట్ల పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా,1969 తెలంగాణ ఉద్యమంలో డా.కొల్లూరి చిరంజీవి కీలక పాత్ర పోషించారు. కాకతీయ వైద్య విద్యార్థులను ఉద్యమంలోకి తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. గతంలోనూ తెలంగాణ ప్రభుత్వం పలువురు ఉద్యమకారులను కష్టకాలంలో ఆదుకున్న సంగతి తెలిసిందే. ప్రముఖ వాగ్గేయకారుడు గూడ అంజయ్యకు ఆయన చివరి రోజుల్లో ప్రభుత్వం ఆర్థిక సాయం చేసింది.