తెలంగాణ ఉద్యమకారులారా.!రండి..బీజేపీలో చేరండి.!బండి సంజయ్ అనూహ్య పిలుపు.!
ఢిల్లీ/హైదరాబాద్ : తెలంగాణ ఉద్యోగుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు, టీఎస్పీఎస్సీ మాజీ సభ్యుడు, తెలంగాణ ఉద్యమ నేత సీహెచ్.విఠల్ బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఇంఛార్జ్ తరుణ్ చుగ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ముక్తార్ అబ్బాస్ నఖ్వీ విఠల్ కు పార్టీ సభ్యత్వం అందజేసి బీజేపీలోకి స్వాగతించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన లీడర్ సీహెచ్.విఠల్ ను హ్రుదయపూర్వకంగా బీజేపీలోకి స్వాగతం పలుకుతున్నామని బండి సంజయ్ తెలిపారు.
టీఆర్ఎస్ దాశ్య శ్రుంఖలాల నుండి విముక్తి.. ఉద్యమకారులకు బీజేపి పిలుపు
నిజమైన ఉద్యమకారులకు బీజేపీ వేదికగా మారిందనేది మరోసారి స్పష్టమైందని బండి సంజయ్ కుమార్ అన్నారు. అంతే కాకుండా సీఎం చంద్రశేఖర్ రావు నిజమైన తెలంగాణ ఉద్యమకారులను తెరమరుగు చేస్తూ తెలంగాణ ద్రోహులను చేరదీస్తూ మంత్రులు, ఎమ్మెల్యేలుగా పదోన్నతులు కల్పిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అందుకే తెలంగాణ కోసం ఉద్యమించిన శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్, మాజీ మంత్రులు చంద్రశేఖర్, విజయరామారావు వంటి వారు బీజేపీలో చేరారని స్పష్టం చేసారు. మంగళవారం తీన్మార్ మల్లన్న బీజేపీలో చేరబోతున్నారని తెలిపారు. తెలంగాణ అమరవీరుల ఆశయాల సాధనే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తోందని, నిజమైన తెలంగాణ వాదులారా బీజేపీలోకి రావాలని పిలుపునిస్తున్నామన్నారు బండి సంజయ్.
విఠల్ కు స్వాగతం పలికిన తరుణ్ చుగ్ ..నియంత పాలన నుండి బయటకు వస్తున్నారన్న కేంద్ర మంత్రి
తెలంగాణ కోసం ఉద్యమించిన నేతలందరినీ బయటకు పంపుతున్న ఘనత సీఎం చంద్రశేఖర్ రావుకు దక్కుతుందని తెలంగాణ బీజేపి వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ అన్నారు. బంగారు తెలంగాణ పేరుతో చంద్రశేఖర్ రావు కుటుంబం లూటీ చేస్తోందని, చంద్రశేఖర్ రావు నియంత, కుటుంబ, అవినీతి పాలనను తరిమికొట్టేందుకు బండి సంజయ్ కుమార్ రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర చేయబోతున్నారని అన్నారు. క్షేత్ర స్థాయిలో టీఆర్ఎస్ అవినీతి, నియంత విధానాలను ఎండగట్టడంతోపాటు 2023లో బీజేపీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా బండి సంజయ్ యాత్ర కొనసాగుతోందని ప్రకటించారు.
బీజేపీలో చేరిన విఠల్.. తెలంగాణకు బీజేపితోనే న్యాయం జరుగుతుందన్న విఠల్
ఇది నా జీవితంలో చారిత్రక దినం అని, సోమవారం అంబేద్కర్ వర్దంతి కావడం, ఈరోజు కరసేవకుల బలిదాన దినంగా కూడాజరుపుకుంటారని, ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించి, 18 కోట్ల సభ్యత్వమున్న బీజేపీలో సభ్యుడిగా చేరడం సంతోషంగా ఉందని, సొంతింటికి వచ్చినట్లుందని, టీఆర్ఎస్ లో తెలంగాణ ఉద్యమకారులకు ఆత్మగౌరవం లేదని బీజేపీలో చేరిన విఠల్ తెలిపారు.తెలంగాణలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, మొత్తం పోస్టుల్లో 40 శాతం ఖాళీలున్నయని విఠల్ పేర్కొన్నారు.
600 మంది ఆత్మహత్య.. తెలంగణ అమర వీరులను పట్టించు కోని సీఎం అన్న విఠల్
తెలంగాణ కోసం 1500 మంది యువత బలిదానం చేశారని, ఏడేళ్లుగా ఒక్క నియామకం లేదని, ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారని, మిగులు రాష్ట్రంగా తెలంగాణలో ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వకపోవడంతో యువత దాదాపు 600 మంది ఆత్మహత్య చేసుకున్నారని విఠల్ తెలిపారు. బీజేపీ సిద్దాంతపరమైన, క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, ఇంతటి గొప్ప పార్టీలో చేరడం ఆనందంగా ఉందని, పార్టీలోకి ఆహ్వానించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా అందరికీ ధన్యవాదాలు తెలిపారు విఠల్. నరేంద్రమోదీ, అమిత్ షా, నడ్డా ఆధ్వర్యంలో తెలంగాణ అభివ్రుద్ది జరుగుతుందని ఆశిస్సున్నాని విఠల్ స్పష్టం చేసారు.