సీఎం "లక్కీ నెంబర్" తోనే తెలంగాణ జిల్లాలు.. ఇదే ఫైనల్
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వాస్తు, జ్యోతిష్య శాస్త్రాలు నమ్ముతుంటారు. నెంబర్ 6 ఆయనకు కలిసొచ్చే సంఖ్యగా రాష్ట్ర ప్రజలకు సుపరిచితమే. చాలా సందర్భాల్లో 6 కలిసొచ్చేలా ముహుర్తాలు చూసుకుంటారు. ఈక్రమంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణలో కూడా నెంబర్ 6 ను చేర్చేశారు. ఇప్పటివరకు 31 జిల్లాలుగా ప్రకటించిన కేసీఆర్.. తాజాగా మరో 2 జిల్లాలను ప్రకటించడం విశేషం.
కేసీఆర్ తాజా ప్రకటనతో మొత్తం జిల్లాల సంఖ్య 33 కి చేరింది. 3+3 కలిపితే 6 వస్తుంది. ఈ లెక్కన కేసీఆర్ లక్కీ నెంబర్ ఇక్కడ కూడా వర్కవుటయినట్లే. ఇదివరకు 31 జిల్లాలుగా ప్రకటించి అకస్మాత్తుగా మరో 2 జిల్లాలు చేర్చడం ప్రాధాన్యత సంతరించుకుంది.
33 జిల్లాల సరికొత్త తెలంగాణ
ఆంధ్రప్రదేశ్ నుంచి వీడిపోయాక 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణను 31 జిల్లాలుగా విభజించారు కేసీఆర్. చిన్న జిల్లాలైతే పాలన సౌలభ్యంగా ఉంటుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా మరో 2 జిల్లాలను ఏర్పాటు చేస్తూ 33 జిల్లాల సరికొత్త తెలంగాణకు నాంది పలికారు. కొత్త జిల్లాల సరసన నారాయణపేట, ములుగు చేరనున్నాయి. అయితే ములుగును ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని దీర్ఘకాలికంగా జరిగిన ఆందోళనను పరిగణనలోకి తీసుకుని కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సమ్మక్క సారలమ్మ జిల్లాగా నామకరణం చేయనున్నట్లు సమాచారం.
వీలైనంత తొందరలోనే..!
పాత జిల్లాలకు తోడు మరో 2 కొత్త జిల్లాలు ఏర్పడటంతో అవి ఎప్పటినుంచి ప్రారంభమవుతాయనేది చర్చానీయాంశంగా మారింది. అయితే సరిహద్దుల విభజన తదితర మార్పులకు నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుంది. దీనికోసం దాదాపు 15 రోజుల సమయం పట్టే ఛాన్సుంది. అంతా అనుకున్నట్లు జరిగితే పంచాయతీ ఎన్నికల లోపు కొత్త జిల్లాలు దాదాపుగా ఏర్పడినట్లే. లేదంటే ఫిబ్రవరి వరకు ఆగాల్సి ఉంటుంది. ఒకవేళ అప్పుడు కూడా పూర్తి కానట్లయితే లోక్ సభ ఎన్నికల తర్వాత అంటే మే లేదా జూన్ లో ఈ రెండు కొత్త జిల్లాలు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మౌలికవసతుల కల్పన..!
తెలంగాణ సిద్ధించిన తర్వాత 31 జిల్లాలు ప్రకటించడమే తరువాయి పనులన్నీ చకచకా జరిగిపోయాయి. జిల్లా కేంద్రాల్లో పాలనకు అవసరమైన భవనాలు తదితర మౌలిక వసతులు సిద్ధమయ్యాయి. మల్టీ జోనల్ వ్యవస్థ కింద కొత్త జోనల్ వ్యవస్థ ఏర్పాటయింది. 31 జిల్లాలకు సంబంధించి ప్రధానాంశాలైన ట్రెజరీ కోడ్, రవాణాశాఖ కోడ్ లాంటివి అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇప్పుడు కొత్తగా ప్రకటించిన 2 జిల్లాలను జోనల్ విధానంలో చేర్చాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నియామకాల్లో కొత్త జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించేలా మార్పులు చేర్పులు అవసరముంటుంది. కలెక్టరేట్లు, పోలీస్ బాస్ ల కార్యాలయాలు తదితర విభాగాలకు సంబంధించిన భవనాలను సమకూర్చాల్సి ఉంటుంది.
కొత్తగా 6 మండలాలు.. ఒక రెవెన్యూ డివిజన్
కొత్త జిల్లాలకు అనుగుణంగా అప్పట్లో 69 రెవెన్యూ డివిజన్లు ప్రకటించారు. అయితే కోరుట్లను రెవెన్యూ డివిజన్ చేయాలని అక్కడ ప్రజలు దీర్ఘకాలిక ఆందోళనకు దిగారు. అప్పటి సమీకరణాల మేరకు మెట్ పల్లిని డివిజన్ గా ఏర్పాటు చేశారు. అయినా కూడా కోరుట్ల ప్రజలు రెవెన్యూ డివిజన్ కావాలని పట్టు పట్టారు. అయితే ఎన్నికల ప్రచారానికి జగిత్యాల జిల్లాకు వెళ్లిన కేసీఆర్ అక్కడి సభలో కోరుట్లను రెవెన్యూ డివిజన్ గా ప్రకటిస్తానని హామీ ఇచ్చారు. దీంతో అక్కడి ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం కోరుట్లను రెవెన్యూ డివిజన్ గా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఇప్పటివరకు ఉన్న 438 మండలాలకు తోడుగా మరో 6 కొత్త మండలాలు ప్రకటించారు. దీంతో మండలాల సంఖ్య 444 కి చేరింది. అయితే ఇవే గాకుండా మరికొన్ని రెవెన్యూ డివిజన్లతో పాటు ఇంకొన్ని మండలాలు కూడా ఏర్పాటయ్యే ఛాన్సుందని సమాచారం.
మరో 2 జిల్లాలు పెంచుతూ కేసీఆర్ నిర్ణయం తీసుకోవడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆయన లక్కీ నెంబర్ 6 కలిసొచ్చేలా మొత్తం 33 జిల్లాలను తీర్చిదిద్దడం వెనుక పాలనాపరమైన చిక్కులు తలెత్తకుండా అంతా సవ్యంగా జరగాలనే ఉద్దేశముందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.