టీ న్యూస్కు నోటీస్: టీ న్యాయవాదుల ఫిర్యాదు, మండిపడిన అల్లం
హైదరాబాద్: టీ న్యూస్ ఛానల్కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విశాఖపట్నం పోలీసులు నోటీసులు ఇవ్వడంపై న్యాయవాదులు హైదరాబాదు నగరంలోని బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఓటుకు నోటు వ్యవహారంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి ఆడియో టేపులను ప్రసారం చేసినందుకుగాను గడిచిన అర్థరాత్రి ఆంధ్రా పోలీసులు టీన్యూస్ ఛానల్కు నోటీసులను అందజేసిన విషయం తెలిసిందే.
తెలంగాణ రాష్ట్రంలోని పది జిల్లాలజర్నలిస్టులందరూ నిరసనలకు సిద్ధమవుతున్నారు. శనివారం మధ్యాహ్నం ఏపీ డీజీపీ ఆఫీసు ముందు జర్నలిస్టులు ఆందోళనకు దిగనున్నారు. అదేవిధంగా గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్కు వినతిపత్రంను అందజేయనున్నారు.
టీ న్యూస్ ఛానల్కు ఏపీ పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తున్నట్లు ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ చెప్పారు. పొరుగు రాష్ట్ర దౌర్జన్యాన్ని వ్యతిరేకంగా తెలంగాణ వ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టడం ద్వారా నిరసనలు తెలియజేయాలని పిలుపునిచ్చారు. నోటీసులతో భావప్రకటనను నియంత్రించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నమని ఐజేయూ సెక్రటరీ జనరల్ జి. ప్రభాకర్ పేర్కొన్నారు.
గడిచిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వెలుగులోకి వచ్చిన ఓటుకు నోటు వ్యవహారం కేసు నుంచి తప్పించుకునేందుకు చంద్రబాబు పోలీసులను వాడుకుంటున్నారని నమస్తే తెలంగాణ ఎడిటర్ కట్టా శేఖర్రెడ్డి అన్నారు. చంద్రబాబు ఆడియో టేపుల ప్రసారంపై అర్థరాత్రి టీ న్యూస్ ఛానల్కు ఏపీ పోలీసులు నోటీసులు ఇవ్వడంపై ఆయన స్పందించారు.తెలంగాణకు గుండెకాయలాంటి టీ న్యూస్ ఛానల్కు నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని, రాష్ట్రం వీడిపోయినా కూడా తెలంగాణ మీడియాపై చంద్రబాబు దాడి దుర్మార్గమని, చంద్ర బాబు ఇంకా సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రి అనుకుంటున్నారని ఆయన అన్నారు.
మీడియా సోర్స్ను బయటపెట్టాల్సిన అవసరం లేదు. నోటీసులు ఇచ్చిన ఏపీ పోలీసులపై చర్యలు తీసుకోవాలి. వ్యక్తిగత నేరాలను కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు పోలీసులను వాడుకుంటున్నడని ఆయన అన్నారు.