మళ్లీ వార్తల్లోకి ఎక్కిన సజ్జనార్: ఆయన పర్యవేక్షణలో: కువైట్ నుంచి హైదరాబాద్కు చేరుకున్న తొలి విమానం
హైదరాబాద్: జీవనోపాధిని వెదుక్కుంటూ గల్ఫ్ దేశాలకు వెళ్లిన తెలంగాణ వలస కార్మికులు తిరుగుముఖం పట్టారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నివారించడానికి ప్రపంచవ్యాప్తంగా అమలు చేస్తోన్న లాక్డౌన్.. వలస కార్మికుల పొట్ట కొట్టింది. రోడ్డున పడేసింది. అటు స్వదేశానికి చేరుకోలేక.. ఇటు ఉన్న చోట తలదాచుకోవడానికీ కనీస వసతులు లేక ప్రత్యక్షంగా నరకాన్ని చవి చూసిన తెలంగాణ వలస కార్మికులు నిరాశ, నిస్పృహల మధ్య స్వస్థలాలకు చేరుకుంటున్నారు.
ఇది కాటేసే 'కరోనా' కాలమా: మనదేశం ఏ రాశికి చెందినది.. శని ప్రభావం ఎంత మేరకుంది..?
కువైట్ నుంచి హైదరాబాద్కు..
విదేశాల్లో చిక్కుకుపోయిన ప్రవాస భారతీయులను స్వదేశానికి తరలించడానికి కేంద్ర ప్రభుత్వం వారంరోజుల పాటు పలు దేశాలకు ప్రత్యేక విమానాలు, నౌకలను నడిపిస్తోన్న విషయం తెలిసిందే. ఈ కార్యాచరణ ప్రణాళికకు వందేభారత్ మిషన్ అని పేరు పెట్టింది. ఇందులో భాగంగా కువైట్ నుంచి 163 మందితో కూడిన ఎయిరిండియా విమానం కువైట్ నుంచి బయలుదేరింది. శనివారం రాత్రి శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. లాక్డౌన్ కొనసాగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో విదేశాల నుంచి హైదరాబాద్కు చేరుకున్న తొలి విమానం ఇదే.
వైద్య పరీక్షల తరువాతే..
వందేభారత్ మిషన్ కింద స్వదేశానికి వస్తోన్న వారి ఆరోగ్యాన్ని పరీక్షించడానికి విమానాశ్రయాల్లో ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ 163 మందికీ థర్మల్ స్క్రీనింగ్ టెస్టులు, ఇతర వైద్య పరీక్షలను నిర్వహించారు. అక్కడి నుంచి నేరుగా క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. 14 రోజుల క్వారంటైన్ తరువాతే వారిని స్వస్థలాలకు పంపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా విమానాశ్రయాన్ని శానిటైజ్ చేశారు.
సజ్జనార్ పర్యవేక్షణలో..
విదేశాల నుంచి వచ్చిన తొలి విమానం కావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ స్వయంగా విమానాశ్రయానికి వెళ్లారు. అక్కడి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఒకేసారి అందర్నీ కాకుండా.. 20 నుంచి 25 మంది చొప్పున ఒక్కో గ్రూపుగా విమానం నుంచి కిందికి దించారు. వారికి గ్లాస్ షీల్డ్లను అందించారు. సోషల్ డిస్టెన్సింగ్ పాటించేలా చర్యలు తీసుకున్నారు. ఆహారాన్ని అందించారు. అనంతరం వారిని నేరుగా క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు.
కరోనా లక్షణాలు ఉంటే ఆసుప్రతులకు..
ఈ సందర్భంగా సజ్జనార్ విలేకరులతో మాట్లాడారు. 163 మంది ప్రయాణికులు కువైట్ నుంచి చేరుకున్నారని, వారిని క్వారంటైన్ కేంద్రాలకు తరలించినట్లు తెలిపారరు. వారిలో కరోనా వైరస్ లక్షణాలు కనిపిస్తే నేరుగా కోవిడ్ ఆసుపత్రులకు తరలించి, వైద్య పరీక్షలను నిర్వహిస్తామని అన్నారు. నెగెటివ్ రిపోర్ట్ వచ్చిన తరువాతే స్వస్థలాలకు పంపించేలా ఏర్పాట్లు చేస్తామని అన్నారు. వచ్చినవారందరి దగ్గరి నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ ఫాంలను తీసుకున్నామని, వారి వివరాలన్నింటినీ సేకరించామని చెప్పారు.