కేసీఆర్ అంటున్నారు, కుమారస్వామి సీఎం అయ్యారు మనం కాలేమా: అక్బరుద్దీన్ సంచలనం
హైదరాబాద్: మజ్లిస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో హంగ్ రావాలని కోరుకున్నారు. అప్పుడు తెలంగాణలో మజ్లిస్ పార్టీ కర్నాటకల వలే మరో జేడీఎస్ కావాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. మల్లేపల్లిలో శుక్రవారం జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆసక్తికరంగా మాట్లాడారు.
ఆ కమిటీలో రేవంత్ రెడ్డికి చోటు: చంద్రబాబు-రాహుల్ గాంధీ దోస్తీ ఖాయం!
కర్ణాటకలో కుమారస్వామి సీఎం అయ్యారు
కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మెజార్టీ లేకపోయినప్పటికీ జేడీఎస్ నేత కుమారస్వామి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారని గుర్తు చేశారు. అలాంటప్పుడు మనం ఎందుకు కాలేమని ప్రశ్నించారు. నవంబర్ నెలలో ఎన్నికలు వస్తున్నాయని, డిసెంబర్ నెలలో మళ్లీ ముఖ్యమంత్రినవుతానని తెరాస అధినేత కేసీఆర్ చెప్పారని తెలిపారు.
మనం కూడా ఇక్కడ ముఖ్యమంత్రి అవుతామేమో
నవంబర్ నెలలో జరిగే ఎన్నికల్లో మనం గెలుద్దామని, డిసెంబరులో కేసీఆర్ను అడుగుదామని, మన రక్షణ ఎవరు చూస్తారని, డిసెంబర్ నెలలో ఫలితాలు వచ్చాక ఎవరి అవసరాలు ఎలా వస్తాయో అప్పటికి తెలుస్తుందని వ్యాఖ్యానించారు. కుమారస్వామి సీఎం అయినట్లే అల్లా దయవల్ల ఇక్కడ మనం కూడా ముఖ్యమంత్రి అవుతామేమో చూద్దామన్నారు.
మజ్లిస్ సత్తా చాటుదాం, జెండా ఎగురేద్దాం
రాజకీయం అంటే మన ఇంటి పనిమనిషి అని తన తండ్రి సలావుద్దీన్ ఒవైసీ చెప్పేవారని అక్బరుద్దీన్ గుర్తు చేసుకున్నారు. ప్రతి ఇంటికీ ఒక కమాండర్ ఉన్నప్పటికీ, అమీర్ ఒక్కడే ఉంటాడని చెప్పారు. డిసెంబర్ నెలలో మజ్లిస్ జెండాను ఎగురవేసి, సత్తా చాటుదామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తెలంగాణలో మజ్లిస్ నేత సీఎం ఎందుకు కాలేరని ప్రశ్నించారు. ఎన్నికల తర్వాత సీఎం అవుతారో చూద్దామన్నారు.
తెలంగాణలో రాజకీయ వేడి
కాగా, తెలంగాణలో రాజకీయ వేడి రాజుకున్న విషయం తెలిసిందే. టీఆర్ఎస్, మజ్లిస్, కాంగ్రెస్, టీడీపీ, ఇతర పక్షాలు అన్నీ అప్పుడే ప్రచార రంగంలోకి దిగాయి. తెరాస 105 మంది అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకు వెళ్తోంది. మరోవైపు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మధ్య పొత్తు కోసం చంద్రబాబు నాయుడు శనివారం మధ్యాహ్నం కాంగ్రెస్ తెలంగాణ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో భేటీ కానున్నారని తెలుస్తోంది.