హైదరాబాద్లో భారీగా పెరిగిన చికెన్ ధరలు: మటన్, ఫిష్ షాపులు ఇక ప్రభుత్వ ఆధ్వర్యంలో!
హైదరాబాద్: ఇప్పటికే పెరిగిన పెట్రోల్, గ్యాస్, కూరగాయల ధరలకు తోడు సామాన్యులకు అందుబాటులో ఉండే చికెన్ ధరలు కూడా అమాంతం పెరిగిపోయాయి. దీంతో మధ్యతరగతి ప్రజలు చికెన్ కొనాలంటే ఆలోచనలో పడిపోతున్నారు. హైదరాబాద్లో కిలో స్కిన్ లెస్ చికెన్ ధర రూ.250కి పెరగడమే ఇందుకు కారణం. ఇతర ప్రాంతాల్లోనూ దాదాపు అటుఇటుగా ఇదే ధర కొనసాగుతోంది.
3 నెలలుగా పెరుగుతున్న చికెన్ ధరలు
బర్డ్ఫ్లూ ప్రచారంతో కొంతకాలంగా పడిపోయిన చికెన్ ధరలు మళ్లీ ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో వారానికి ఒకసారి తెచ్చుకునేందుకు కూడా సామాన్యులు ఆందోళను చెందుతున్నారు. గత మూడు నెలలుగా చికెన్ ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. ఇప్పటికే పెరుగుతున్న పెట్రో ధరలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సామాన్యులకు చికెన్ ధరలు పెరుగుదల రూపంలో మరో షాక్ తగిలింది.
హైదరాబాద్లో భారీగా పెరిగిన చికెన్ ధరలు
గతంలో స్కిన్లెస్ చికెన్ ధర రూ.200 ఉంటే ఇప్పుడు రూ. 250కిపైగా పెరిగింది. బోన్లెస్ చికెన్ ధరలలో కూడా ఇదే ధోరణి గమనించవచ్చు. జూబ్లీ హిల్స్, హైటెక్ సిటీ మొదలైన నగరాల్లో ధరలు మరింత ఎక్కువగా ఉన్నాయి. హైదరాబాద్లో చికెన్ ధరలు పెరగడానికి ముఖ్యంగా రెండు కారణాలు చెప్పవచ్చు.
అందులో ఒకటి డిమాండ్ పెరగడం రెండోది పెట్రోల్ ధర పెరగడం. కరోనా వల్ల రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి ప్రస్తుతం ఎక్కువ మంది చికెన్పై ఆధారపడుతున్నారు. మరో విషయం ఏంటంటే.. తెలంగాణలో డిమాండ్ కు తగినట్లుగా చికెన్ లభించడం లేదు. ఇది కూడా చికెన్ ధరల పెరుగుదలకు కారణంగా మారింది.
ఇక ప్రభుత్వ ఆధ్వర్యంలో మటన్ షాపులు
ఇది ఇలావుండగా, తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. వినియోగదారునికి సరసమైన ధరల్లో.. పరిశుద్ధమైన మాంసం అందించడం లక్ష్యంగా తెలంగాణ పశుసంవర్ధకశాఖ కసరత్తులు ప్రారంభించింది. రాష్ట్రంలో అన్ని మాంసం దుకాణాలను ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావాలని పశుసంవర్ధక శాఖ యోచిస్తోంది. ఇందులో భాగంగానే మొదటగా రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా కబేళాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో ప్రతిజోన్ పరిధిలో ఒక కబేళా, జిల్లాల్లో ఒకటి లేదా రెండు ఏర్పాటుచేయాలని భావిస్తోంది.
వీటిని స్థానికంగా ఉండే మటన్ దుకాణాలకు లింక్ చేసి.. అక్కడి నుంచే మాంసం సరఫరా చేయనున్నారు. దుకాణదారులు ప్రభుత్వం అందించిన మాంసాన్నే విక్రయించాల్సి ఉంటుంది. అలాగే ప్రభుత్వ నిర్ణయించిన ధరలకు అమ్మాల్సి ఉంటుంది. దీనిద్వారా వినియోగదారులకు శుద్ధమైన మాంసం అందడంతోపాటు, తక్కువ ధరకు లభించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
వినియోగదారులకు సరసమైన ధర, శుద్ధ మాంసం
కాగా, ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో సుమారు 10 వేల మటన్ షాపులు నడుస్తున్నాయి. ఇందులో రెండువేల దుకాణాలను మాత్రమే ప్రభుత్వ అనుమతితో నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ షాపులన్నింటినీ ప్రభుత్వ ఆధీనంలోకి తేవాలని యోచిస్తున్నారు. కేవలం మాంసం దుకాణాలే కాకుండా చేపలను కూడా కొని విక్రయించేందుకు చర్యలు తీసుకోనున్నారు.
తెలంగాణలో మత్స్యసంపద భారీగా పెరిగినప్పటికీ.. మత్స్యకారులకు మాత్రం అనుకున్న స్థాయిలో ఆదాయం రావడం లేదనే అభిప్రాయం ఉంది. దుకాణాల ఆధునికీకరణకు అవసరమైతే బ్యాంకుల నుంచి రుణం కూడా ఇప్పించేందుకు చర్యలు తీసుకోనున్నారు. ప్రతీ మాంసం దుకాణాల్లో రిఫ్రిజిరేటర్ ను అందుబాటులో ఉంచనున్నారు.
దాని వల్ల ఉపయోగం ఏంటంటే.. మాంసం శుద్ధిగా ఉండేందుకు ఉపయోగపడుతుంది. ఇక, పట్టణం, నగరం అనే తేడా లేకుండా.. హోటళ్లు, రెస్టారెంట్లకు కూడా ప్రభుత్వం నుంచే సరఫరా అయ్యే విధంగా చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.