ఏపీ-తెలంగాణలు వెనుకబడ్డాయి: బాబు-కేసీఆర్లకు ఎన్సీఏఈఆర్ షాక్
హైదరాబాద్/అమరావతి: తెలుగు రాష్ట్రాలకు షాక్! పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లు వెనుకబడ్డాయి. నేషనల్ కౌన్సెల్ ఫర్ అప్లైడ్ అండ్ ఎకనామిక్ రీసెర్చ్ 2018 (ఎన్సీఏఈఆర్) ప్రకారం ఈ రెండు రాష్ట్రాలు ర్యాంకులు ఏడు, ఎనిమిదో స్థానాల్లో ఉన్నాయి. ఎన్సీఏఈఆర్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ 7వ స్థానంలో ఉంటే, తెలంగాణ 8వ స్థానంలో ఉంది.
ఆంధ్రప్రదేశ్ 2017లో మూడో ర్యాంకులో ఉండగా, ఇప్పుడు నాలుగు స్థానాలు తగ్గి ఏడో స్థానానికి పరిమితమైంది. తెలంగాణ కూడా బాగా కిందకుపోయింది. సమాచారం మేరకు.. లా ఆండ్ ఆర్డర్ కారణంగానే పెట్టుబడుల జాబితాలో తెలుగు రాష్ట్రాలు కిందకు జారాయని అంటున్నారు. నాలుగు కేటగిరీల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లు ఒక్కో కేటగిరీలో ముందుండటం గమనార్హం.
వీటి ఆధారంగా జాబితా విడుదల
వివిధ అంశాల ఆధారంగా దేశంలో పెట్టుబడులకు అనువైన రాష్ట్రాలను గుర్తించి ఈ ర్యాంకింగ్స్ ఇచ్చారు. ఈవోడీబీ ర్యాంకింగ్స్ విషయంలో ఒకటి, రెండు స్థానాల్లో ఉన్న ఏపీ, తెలంగాణలు ఎన్సీఏఈఆర్ జాబితాలో మాత్రం ఏడు, ఎనిమిదవ స్థానాల్లో ఉన్నాయి. రాష్ట్ర పెట్టుబడి పొటెన్షియల్ ఇండెక్స్ (ఎన్-ఎస్ఐపిఐ) పేరుతో తాజాగా ఎన్ సీఏఈఆర్ ఈ జాబితాను విడుదల చేసింది. భూమి, కార్మికులు, మౌలికసదుపాయాలు, ఆర్థిక వాతావరణం, రాజకీయ స్థిరత్వం, పరిపాలన వంటి కీలక అంశాల ఆధారంగా ఈ నివేదిక రూపొందించారు.
మొదటి స్థానంలో ఢిల్లీ
ఈ సర్వే ప్రభావం పారిశ్రామిక రంగంపై ఖచ్చితంగా ఉంటుందనే అభిప్రాయం పారిశ్రామిక వర్గాల్లో వ్యక్తం అవుతోంది. ఈ జాబితాలో ఢిల్లీ మొదటి స్థానంలో ఉంది. తమిళనాడు రెండో స్థానానికి ఎగబాకింది. జాబితాలో గుజరాత్ మూడవ స్థానంలో ఉంది. హర్యానా నాలుగు, మహారాష్ట్ర అయిదు, కేరళ ఆరు, ఏపీ ఏడు, తెలంగాణ ఎనిమిదో స్థానంలో ఉన్నాయి. కర్ణాటక తొమ్మిది, పశ్చిమ బెంగాల్ పదో స్థానంతో సరిపెట్టుకున్నాయి.
ఎంతమంది నుంచి అభిప్రాయ సేకరణ అంటే
పారిశ్రామికవేత్తల అభిప్రాయాల పరంగా చూస్తే ఏపీ, తెలంగాణల పరిస్థితి గణనీయంగా తగ్గుముఖం పట్టింది. భూమి పొందే/అందుబాటు జాబితాలో తెలంగాణలో పరిస్థితి అనుకూలంగానే ఉందని ఈ నివేదిక చెబుతోంది. మానుఫ్యాక్చరింగ్, సెర్వీస్ సెక్టార్లలో ఉన్న వివిధ 1049 బిజినెస్ ఎంటర్ప్రైజెస్ల నుంచి సేకరించారు. చాలా రాష్ట్రాలు వెనుకబడటానికి లా అండ్ ఆర్డర్ కారణమని చెబుతున్నారు.
అంశాల వారీగా చూస్తే
ఒక్కో అంశం పరంగా చూస్తే భూమి ల్యాండ్ పిల్లర్ విషయంలో తెలంగాణ ముందుంది. లేబర్ పిల్లర్ విషయంలో ఆంధ్రప్రదేశ్ అందరికంటే ముందుంది. ఎకనామిక్ క్లైమేట్ పరంగా చూస్తే ఢిల్లీ ముందంజలో ఉంది. కాగా, తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ ఒకింత ముందుండటం ఇది రెండోసారి. ఎన్సీఏఈఆర్ సర్వే చంద్రబాబు, కేసీఆర్ ప్రభుత్వాలకు షాక్ అని చెప్పవచ్చు.