తెలంగాణకు ఇప్పటి వరకు తోడ్పాటు లేదు: కేసీఆర్ ఏం అడిగారు, ఏం ఇచ్చారు?
హైదరాబాద్: 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎన్డీయే ప్రవేశపెడుతున్న పూర్తిస్థాయి బడ్జెట్ పైన ఏపీతో పాటు తెలంగాణ కూడా ఆసక్తిగా ఉంది. ఈ బడ్జెట్లో అయినా తమకు న్యాయం జరుగుతుందని భావిస్తోంది. ఇప్పటి వరకు కేంద్రం నుంచి సరైన సాయం లేదని చెబుతున్నారు.
బడ్జెట్పై ఏపీ 'ప్రత్యేక' ఆసక్తి: అందుకే బాబు ఆశ, ఆ మనస్తత్వం ఉంటే.. యనమల చురక
ఇప్పటి వరకు కేంద్రం తోడ్పాడు లేదని, ఈ ఏడాదైనా సహకరిస్తుందని ఆశిస్తున్నామని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. ఈ ఏడాది కూడా తెలంగాణ బడ్జెట్లో గతంలోని పరుగు, వేగాన్ని కొనసాగిస్తామన్నారు. వివిధ కేంద్ర పథకాలు, ఇతర కార్యక్రమాల ద్వారా కేంద్రం నుంచి ఇప్పటి దాకా సహాయం అందలేదన్నారు.
ఇప్పటికైనా తోడ్పాటు అందించాలి
ఈ సంవత్సరమైనా తోడ్పాటును అందిస్తుందని భావిస్తున్నామని ఈటెల చెప్పారు. అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణకు తోడ్పాటు అందించాలని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీని కోరామని చెప్పారు. ఇంటింటికీ రక్షిత మంచినీటిని అందించేందుకు ఉద్దేశించిన మిషన్ భగీరథకు రూ. 19,000 కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ కేంద్రానికి సిఫారసు చేసిందని ఆ నిధులు ఇవ్వాలని అడిగామన్నారు.
వీటి కోసం అడిగాం
మిషన్ కాకతీయకు రూ. 5,000 కోట్లు, కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ. 10,000 కోట్లు కోరామన్నారు. విభజన సమయంలో చెప్పిన మేరకు గిరిజన విశ్వవిద్యాలయం, ఉద్యాన విశ్వవిద్యాలయం, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ, ఎయిమ్స్ను మంజూరు చేయాలని అడిగినట్లు ఈటెల చెప్పారు.
తెలంగాణ అడిగేవి, ఇచ్చినవి
విభజన సమయంలో ఇచ్చిన హామీలు లేదా తెలంగాణ కోరుతున్న వాటిలో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి, మిషన్ కాకతీ., మిషన్ భగీరథలకు సహకారం, శంకర్ పల్లి పవర్ ప్రాజెక్టుకు నేచరల్ గ్యాస్, కరీంనగర్కు గ్యాస్, వరంగల్ కళాకేంద్రం, హైదరాబాదులో కళాభారతి కోరుతున్నారు.
వెనుకబడిన 9 జిల్లాలకు రూ.450 కోట్లు, డబుల్ బెడ్ రూం ఇళ్లకు రూ.1596 కోట్లు, జాతీయ అకాడమీ, ఎకో టూరిజం, ఎనిమిది డ్రై పోర్టులు, హైదరాబాద్ ఫార్మా సిటీ తదితర హామీలు నెరవేరాయి.
ఏపీకి అడిగేవి, ఇచ్చినవి
ఆంధ్రప్రదేశ్ కూడా ఈ బడ్జెట్ పైన ఆశలు పెట్టుకుంది. ఫైనాన్షియల్ ప్యాకేజీ, పోలవరం ప్రాజెక్టుకు రూ.3,217 కోట్ల నిధులు, విశాఖ రైల్వే జోన్, అనంతపురంలో సెంట్రల్ వర్సిటీ, విజయనగరంలో గిరిజన విశ్వవిద్యాలయం, దుగ్గరాజుపట్నం విమానాశ్రయం, కాకినాడలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్, రాజధాని అమరావతికి నిధులు, కడపలో స్టీల్ ప్లాంటు వంటివి ఏపీ కోరుకుంటోంది.
తిరుపతి ఐఐటీ, తాడేపల్లిగూడెంలో ఎన్ఐటీ, విశాఖపట్నంలో ఐఐఎం, మంగళగిరిలో ఎయిమ్స్, గుంటూరులో వ్యవసాయ విశ్వవిద్యాలయం, రాజధానికి రూ.1500 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, వెనుకబడిన ఏడు జిల్లాలకు రూ.350 కోట్లు వంటి హామీలు నెరవేర్చారు.