నియామకాల తీరు: తెలంగాణ యువత ఆగ్రహం, డొంకతిరుగుడు రిప్లైలు
హైదరాబాద్: నీళ్లు.. నిధులు.. నియామకాలు.. 2013 వరకు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమకారుల నినాదం. ఎట్టకేలకు కేంద్రంలోని గత యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయడంతో ఐదు దశాబ్దాల కల సాకారమైంది. తెలంగాణ ఆవిర్భావం సాక్షాత్కారమైంది.
2014 జూన్ రెండో తేదీన తెలంగాణ ఆవిర్భావం.. రాష్ట్ర సాధనకు ఉద్యమించిన టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు తొలి సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. అధికారంలోకి రాగానే ఉమ్మడిగా విద్యాసంస్థల్లో అడ్మిషన్ల పేరిట ఏపీ ఆధిపత్యానికి తెర దించడానికి దిగ్విజయంగా ప్రయత్నాలు ఫలించాయి. ఇష్టారాజ్యంగా నీళ్ల మళ్లింపునకు తెర దించింది.
నియామకాల ప్రక్రియ పూర్తి చేయడానికి ప్రారంభంలో రెండు రాష్ట్రాల ఉద్యోగుల విభజన అడ్డం అన్న అభిప్రాయం ఉన్నది. క్రమంగా మూడేళ్లు గడిచిపోయాయి. కానీ.. క్రమక్రమంగా వివిధ శాఖల్లో అవసరాలకు అనుగుణంగా నియామకాలు జరుగుతున్నాయి తప్ప వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. తెలంగాణ ఏర్పాటైన తర్వాత కాల క్రమంలో అప్పుడే మూడేళ్లు గడిచిపోయాయి.
ఆగమేఘాలపై 10 వేల మంది పోలీసుల నియామకానికి ఇలా ఓకే
అసెంబ్లీ సాక్షిగా సీఎం చంద్రశేఖర్ రావు లక్షా ఏడు వేల ఉద్యోగాలు కల్పిస్తామని నిరుద్యోగ యువతలో ఆశల ఆకాంక్షలు రేకెత్తించారు.. ఆచరణలో మాత్రం ఏడు నుంచి ఎనిమిది వేల మందికి మాత్రమే ఉద్యోగాలు లభించాయి. మరో ఏడెనిమిది వేల ఉద్యోగ నియామకాలకు ఇంటర్వ్యూలు పూర్తయ్యాయి గానీ నియామక ప్రక్రియ జరుగలేదు. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ నియామకాలు చేపట్టాలని తెలంగాణ రాజకీయ ఐకాస చైర్మన్ కోదండరాం ఉద్యమానికి శ్రీకారం చుట్టడంతో అంతకుముందు కేవలం మూడున్నర వేల మంది పోలీసుల నియామకానికి మాత్రమే రాత పరీక్షలు, భౌతిక దేహ దారుడ్య పరీక్షలు పూర్తి నిర్వహించిన పోలీసు శాఖ ఎకాఏకీన అర్హత సాధించిన పది వేల మందికి ఉద్యోగాలిస్తామని ఆగమేఘాల మీద ప్రకటించింది.
Recommended Video
తాజాగా మరో 18 వేల కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ పది వేల మంది పోలీసు అభ్యర్థుల శిక్షణ మాటేమిటి?
తాజాగా మరో 18,290 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయడానికి ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చిందని డీజీపీ అనురాగ్శర్మ వెల్లడించారు. కానీ ఇంతకుముందు చేపట్టిన పది వేల మంది కానిస్టేబుళ్ల ఎంపిక తీరుపై కొందరు హైకోర్టు మెట్లెక్కారు. కానిస్టేబుళ్ల శిక్షణకు అనుమతి ఇచ్చిన న్యాయస్థానం తమ తుది ఆదేశాలకు లోబడి వ్యవహరించాల్సి ఉంటుందని పేర్కొన్నది. అందునా మొత్తం 10 వేల మందిని ఎంపిక చేసినా.. ఆచరణలో కొంత మంది పేర్లు శిక్షణ పొందే వారిలో చేర్చలేదని తెలుస్తోంది. అసలు పోలీసు కానిస్టేబుల్ పోస్టులకు వారంతా ఎంపికై ఏడాది దాటినా.. ఇప్పటికీ శిక్షణ ప్రారంభం కానేలేదు. ఇక గ్రూప్ - 2 ఉద్యోగ నియామకాలకు నిర్వహించిన పరీక్షలో 15 ప్రశ్నలు రద్దు చేయాల్సి వచ్చింది.
అటువంటి పరిస్థితి తలెత్తినందుకు వాస్తవంగా మళ్లీ పరీక్ష నిర్వహించాల్సి ఉంటుంది. కానీ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్పీ) మాత్రం మీన మేషాలు లెక్కిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వాస్తవమేమిటంటే గ్రూప్ 2 కోసం మళ్లీ అభ్యర్థులంతా మెయిన్స్ రాయాల్సి ఉంటుందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మళ్లీ వారంతా ఎప్పుడు మెయిన్స్ పరీక్ష రాయాల్సి ఉంటుందో ఆ పై వాడికే తెలియాలి. మరో వైపు గ్రూప్ 1 నియామకాలకు ఇంటర్వ్యూలు జరిపేందుకు అనుమతి ఇచ్చిన హైకోర్టు.. రాష్ట్రంలో భారీ స్థాయిలో ఏర్పాటు చేసిన గురుకుల విద్యాలయాల్లో విద్యాబోధనకు ఉపాధ్యాయుల నియామకాల ప్రక్రియపై స్టే విధించింది.
ఈ ప్రక్రియ చేపట్టిందీ ఈ టీఎస్పీఎస్సీయే. అయితే ఇక్కడ ఒక క్లాజ్ పెట్టారు. మెజారిటీ సీట్లు మహిళలకు కేటాయించడంతో యువత కడుపు మండి హైకోర్టును ఆశ్రయించారు. ఈ నిబంధనను ఆసరాగా తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు గురుకులాల్లో నియామక ప్రక్రియ చేపట్టేందుకు అవసరమైన మెయిన్స్ పరీక్షలను నిలిపివేస్తూ న్యాయస్థానం స్టే జారీ చేసింది. ఇదీ అసలు వాస్తవం.
2009 తర్వాత కానరాని టీచర్ల నియామక ప్రస్తావన
2009కి ముందు ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాలకు అడపాదడపా పరీక్షలు నిర్వహించేవారు. కానీ 2009లో తెలంగాణ ఏర్పాటుకు కేంద్రం అనుకూల ప్రకటన చేసిన తర్వాత పరిస్థితి మారిపోయింది. నాటి నుంచి ఇప్పటివరకు ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియే చేపట్టలేదు. వాస్తవ పరిస్థితులు ఇలా ఉంటే కొందరికి... అధికార పార్టీకి అనుబంధంగా పని చేస్తున్న పత్రిక ‘నమస్తే తెలంగాణ'లో ఉద్యోగాల భర్తీ మీద కావాలని కొందరు కోర్టులకెక్కుతున్న తీరుపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని, అసలు ఉద్యోగాలు రానిస్తారా? లేదా? అంటూ మండిపడుతున్నారని ఒక వార్తాకథనం ప్రచురించింది. కానీ ఒక్క విషయం మరిచిపోతున్నారు. అన్ని సక్రమంగా పూర్తిచేసి ఉద్యోగ నియామకాలు చేపడితే ఎవరి మాత్రం అభ్యంతరం ఉంటుంది మరి. వాస్తవంగా నియామకాల ప్రక్రియపై న్యాయస్థానం స్టే విధించేలా ప్రభుత్వమే నిబంధనలు రూపొందించి.. తర్వాత న్యాయస్థానం కొట్టేసిందని సాకులు వెతికేందుకు సర్కార్ ప్రయత్నిస్తున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
విద్యార్థి సంఘాల ఆందోళనలపై అక్కసు ఇలా
ప్రభుత్వం ఒక చర్య తీసుకున్నప్పుడు వ్యతిరేకించే వారు ఆ చర్యలో లోపాల ఆధారంగా అడ్డుకోవడానికి ప్రయత్నించడం కూడా సహజ పరిణామమే. ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ఇవ్వడం ఆలస్యం.. ఆ వెంటనే కొందరు కోర్టుల్లో పిటిషన్లతో ప్రత్యక్షమవ్వడం.. ఉద్యోగ నియామక పరీక్ష ఫలితాలు వచ్చిన గంటల్లో సాకులు వెతికి మరీ హైకోర్టులో కొర్రీలు పెట్టడం మీద వారిలో అసహనం పెల్లుబుకుతున్నదని ‘నమస్తే తెలంగాణ' విమర్శలు గుప్పించింది. కేవలం తెలంగాణలోని ఉద్యోగాల భర్తీ మీద మాత్రమే ఇలాంటి పిటిషన్లు దాఖలవుతున్నాయని, పక్క రాష్ట్రంలో ఉద్యోగాలిచ్చినా ఇవ్వకున్నా పట్టించుకున్నవారే లేరని ఆ పత్రిక వార్తాకథనం సారాంశం. ఉద్యోగాలు కావాలని ఒక వైపు ఉస్మానియా యూనివర్శిటీలో ర్యాలీలు తీసేవారే..మరోవైపు నోటిఫికేషన్లు రాగానే కోర్టుల్లో కొర్రీలు పెడుతున్నారని దుయ్యబడుతున్నారని ‘నమస్తే తెలంగాణ' వ్యాఖ్యానించింది.
వాస్తవం ఒకటి వాదన ఇంకొకటని వ్యాఖ్యలు
తెలంగాణ సాకారమైన తర్వాత ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీని చేపట్టిందని ‘నమస్తే తెలంగాణ' కథనం సారాంశం. కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లతోపాటు కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించింది. దాదాపు 25వేల ఉద్యోగాలను భర్తీ చేసిందని పేర్కొన్న ‘నమస్తే తెలంగాణ' వాటి వివరాలు చెప్పి ఉంటే మరీ బాగుండేది. ఈ క్రమంలో కొందరు ఉద్యోగాల భర్తీని అడ్డుకోవడమే ఏకైక ఎజెండాగా పెట్టుకున్నారు. కొత్త కొలువుల నోటిఫికేషన్లు అడ్డుకోవడం.. వాటిపై చిలువలు పలువలు ప్రచారం చేయడం, క్రమబద్ధీకరణ ఉత్తర్వులపై అసత్యాలు ప్రచారం చేయడం. న్యాయస్థానాల్లో పిటిషన్లు వేయడం ప్రారంభించారని ఆ పత్రిక వార్తాకథనం ఆవేదన వ్యక్తం చేసింది.
‘రాష్ట్ర ప్రభుత్వం కేజీ టు పీజీ విద్యావిధానంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలను ప్రవేశపెట్టింది. మొత్తం 827 గురుకులాల డిగ్రీ, జూనియర్ కాలేజీలు, పాఠశాలల్లో 50 శాతం బాలికల స్కూళ్లు ఏర్పాటు చేసింది. నిబంధనల ప్రకారం మహిళా గురుకులాలలో టీచర్లు, ప్రిన్సిపాల్, వంటగాళ్లు కూడా మహిళలే ఉండాలి. భద్రత దృష్ట్యా వీటిలో పురుషులను నియమించడం సాధ్యపడదు. ప్రభుత్వం ఈ మేరకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో అన్ని శాఖల కార్యదర్శులతో కమిటీ వేసి స్టేట్ మరియు సబార్డినేట్ సర్వీస్ రూల్ 22 (ఏ)ఈ రిజర్వేషన్ రూల్ను సవరిస్తూ ప్రతిపాదనలు రూపొందించింది. మహిళలకు సంబంధించిన విద్యాలయాల్లో మహిళలనే నియమించాలని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా పరిగణనలోకి తీసుకొని రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ 1274 జీఓ ఇచ్చింది. అయినా దీనిమీద రాద్దాంతం చేస్తున్నారు' నమస్తే తెలంగాణ తెలిపింది.
పిటిషన్లు వేస్తే సంకుచితత్వమా
తెలంగాణలో ఉద్యోగ నియామకాలపై విపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయని, న్యాయస్థానాల్లో చీటికి మాటికి కేసులు వేస్తున్నాయని నమస్తే తెలంగాణ ఆందోళన వ్యక్తం చేసింది. పొరుగు రాష్ట్రం ఏపీతో విడగొట్టుకున్న తర్వాత కూడా ఆ రాష్ట్రంలో ఏపీపీఎస్సీ ద్వారా మూడేండ్లలో కొత్తగా ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని ఆరోపణలకు దిగింది. ఇబ్బందుల మాటేలా ఉన్నా నిరంతరం ఉద్యోగ నియామకాల ప్రక్రియలో భాగంగా కేవలం రెండు నోటిఫికేషన్లే విడుదల చేశారని ఆ పత్రిక అభియోగం. ఒక్క ఉద్యోగం ఇవ్వని ఏపీపీఎస్సీని ఎందుకు ప్రశ్నించరు? ఇస్తున్న టీఎస్పీఎస్సీ మీద మాత్రమే ఎందుకు కేసులు వేస్తారు? అనేది నిరుద్యోగుల ప్రశ్న, అసలు ఈ కొర్రీరాయుళ్ల లక్ష్యం ఏమిటి?, ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకం మీదా కేసులు వేస్తారు. నీటిపారుదల ప్రాజెక్టులు, రైతుల పరిహారంపై కేసులు పెడుతారు. ఒకవైపు ఉస్మానియాలో ర్యాలీలు తీయిస్తారు. ఉద్యోగాలు లేవంటూ మొసలి కన్నీళ్లు కారుస్తారు. మరోపక్క వీళ్లే న్యాయస్థానాల్లో కేసులు వేస్తున్నారు' అని నమస్తే తెలంగాణ వార్తాకథనం సారాంశం. విద్యుత్ శాఖలో 24 వేల మందిని క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకుంటున్నదే తప్ప.. ఆచరణలో పూర్తిగా క్రమబద్ధీకరణ జరుగకున్నా జరిగిందని ఎదురుదాడికి దిగిందీ నమస్తే తెలంగాణ.