ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ..! రెండు రోజుల పాటు ప్రత్యేక సమావేశాలు..!!
Recommended Video
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు శాసనసభను స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి ప్రారంభించారు. సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్, మంత్రి జగదీశ్ రెడ్డి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత మాజీ శాసనసభ సభ్యులు బొమ్మా వెంకటేశ్వర్, డెల్లా గాడ్ ఫ్రే, కనకారెడ్డి, బండారి శారారాణి, గట్టు భీముడు, కృష్ణమూర్తులకు శాసనసభ సంతాపం ప్రకటించింది.
అనంతరం తెలంగాణ పురపాలక చట్టం - 2019 బిల్లును ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లుపై రేపు చర్చ జరగనుంది. చర్చకు ప్రభుత్వం తరపున సీఎం చంద్రశేఖర్ రావు సమాధానం ఇవ్వనున్నారు.తెలంగాణలో రెండు రోజుల పాటు జరిగే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. గురు మరియు శుక్రవారం రెండు రోజుల పాటు ఈ సమవేశాలు జరగనున్నాయి. కొత్త మున్సిపల్ చట్టానికి సంబంధించిన బిల్లుకు ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ గురువారం ఉదయం 11 గంటలకు, శాసన మండలి శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం కానున్నాయి.
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే సభలో సీఎం చంద్రశేఖర్ రావు కొత్త మున్సిపల్ బిల్లును ప్రవేశపెడుతారు. అనంతరం దానిపై సభ్యుల అధ్యయనానికి ఒక్కరోజు సమయమిస్తూ స్పీకర్ సభను శుక్రవారం ఉదయం 11 గంటలకు వాయిదా వేస్తారు. శుక్రవారం మున్సిపల్ చట్టంపై చర్చిస్తారు. ఆ తర్వాత సీఎం సమాధానం చెప్తారు. అదేరోజు బిల్లుకు ఆమోదం లభించగానే స్పీకర్ నిరవధికంగా అసెంబ్లీ సమావేశాలను వాయిదా వేస్తారు.
అసెంబ్లీలో ఆమోదించిన మున్సిపల్ బిల్లును శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు సీఎం చంద్రశేఖర్ రావు శాసనసభ మండలిలో ప్రవేశపెడుతారు. ఆ వెంటనే చర్చించి మండలి ఆమోదం తీసుకుంటారు. మున్సిపల్ బిల్లుకు ఆమోదముద్ర పడిన అనంతరం డిప్యూటీ చైర్మన్ మండలి సమావేశాలను నిరవధికంగా వాయిదా వేస్తారు. అసెంబ్లీ, మండలి సమావేశాల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.