ఈసీ కొత్త రూల్స్, తెలంగాణ అసెంబ్లీ ఫలితాలు ఆలస్యం: కారణాలివే, డిస్ప్లేల ఏర్పాటు
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు మూడు రోజుల క్రితం ముగిశాయి. ఓట్ల లెక్కింపు మంగళవారం (రేపు) ఉదయం ప్రారంభం కానుంది. దీనిపై తెలంగాణ ప్రధాన ఎన్నికల కమిషనర్ రజత్ కుమార్ మాట్లాడారు. రేపు ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందని చెప్పారు. రాష్ట్రంలో 43 కౌటింగ్ కేంద్రాలు ఉన్నాయని చెప్పారు.
ఒక్కో నియోజకవర్గంలో 14 టేబుల్స్ ఉన్నాయని చెప్పారు. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తామని చెప్పారు. మొత్తం 2,379 రౌండ్లు ఉంటాయని చెప్పారు. మధ్యాహ్నం ఒకటి గంటలకు ఫలితాలు వచ్చే అవకాశముందని చెప్పారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో అత్యధిక రౌండ్స్ ఉంటాయని చెప్పారు. బెల్లంపల్లిలో అత్యల్పంగా రౌండ్స్ ఉంటాయన్నారు.
కూటమి గెలిస్తే రెడ్లకు కాంగ్రెస్ షాక్ తప్పదా, ముఖ్యమంత్రి అతనేనా?: తెరపైకి భట్టి పేరు
అభ్యర్థులకు చూపించిన తర్వాతే ఫలితాలు
ప్రతి రౌండ్లోని ఆయా నియోజకవర్గంలోని అభ్యర్థులకు చూపించిన తర్వాతనే ఫలితాలు ఇస్తామని సీఈవో రజత్ కుమార్ వెల్లడించారు. అవసరమైన చోట్లే వీవీప్యాట్ల లెక్కింపు ఉంటుందని చెప్పారు. కాగా, ఎన్నికల సంఘం కొత్త రూల్స్ వలన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాస్త ఆలస్యం కానున్నాయి.
అభ్యర్థులు అభ్యంతరం చెప్పకుంటేనే
రేపు తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాల (మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం, ఛత్తీస్గఢ్) అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉంది. ఎన్నికల సంఘం కొత్త నిబంధనల ప్రకారం ప్రతి రౌండ్ ఫలితాన్ని స్టేట్మెంట్ రూపంలో అభ్యర్థులకు అధికారులు ఇస్తారు. అభ్యర్థులు ఎలాంటి అభ్యంతరం చెప్పకుంటే రిటర్నింగ్ అధికారి మీడియాకు ఫలితం వెల్లడిస్తారు.
ప్రతి రౌండ్ ఫలితం వెబ్సైట్లో
అధికారులు ప్రతి రౌండ్ ఫలితాన్ని కూడా వెబ్సైట్లో అప్ లోడ్ చేస్తారు. ప్రతి రౌండ్ను స్టేట్మెంట్ రూపంలో పెట్టిన తర్వాతనే ఫలితాలు అధికారికంగా ప్రకటిస్తారు. దీని కారణంగా గతం కంటే ఫలితాల వెల్లడి రెండు గంటలు ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
కట్టుదిట్టమైన భద్రత
ఇదిలా ఉండగా కౌంటింగ్ ప్రశాంతంగా జరిగేలా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశామని అడిషనల్ డీజీ తెలిపారు. 119 నియోజకవర్గాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. మొత్తం కౌంటింగ్ రికార్డ్ అవుతుందని తెలిపారు. స్ట్రాంగ్ రూంల వద్ద 28 కంపెనీ ఫోర్స్ ఉన్నాయని చెప్పారు. 144వ సెక్షన్ అమలులో ఉందని చెప్పారు. రేపు మధ్యాహ్నం కల్లా కౌంటింగ్ పూర్తయ్యే అవకాశముందని చెప్పారు.
ప్రజల కోసం డిస్ప్లేలు
విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని డీజీ తెలిపారు. కౌంటింగ్ హాల్స్లోకి సెల్ఫోన్స్ను అనుమతించడం లేదని చెప్పారు. కౌంటింగ్ వద్ద ప్రజలు, ఆయా పార్టీల కార్యకర్తల కోసం డిస్ప్లేలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, కౌంటింగ్ హాల్స్లో వెబ్ క్యాస్టింగ్, వైఫైకి అనుమతి లేదు.