రాంరెడ్డి మృతికి కెసిఆర్ సంతాపం: ఆత్మీయుడని జానా, అజయ్ కీలక ప్రతిపాదన
హైదరాబాద్: ఖమ్మం జిల్లా పాలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్రెడ్డి మృతికి తెలంగాణ అసెంబ్లీ సంతాపం తెలిపింది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయిన వెంటనే ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సభలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాంరెడ్డి వెంకట్రెడ్డి మృతి తీరని లోటని అన్నారు.
కొంతకాలంగా రాంరెడ్డి వెంకట్రెడ్డి అనారోగ్యంతో బాధ పడ్డారని, ఆయన బతకాలనే ఉద్దేశంతో వైద్య ఖర్చులకు ప్రభుత్వం తరపున రూ. 84 లక్షలు ఇచ్చామని చెప్పారు. వ్యవసాయం, పశుపోషణఫై వెంకట్రెడ్డికి మక్కువ ఎక్కువని తెలిపారు. వెంకట్రెడ్డి కుటుంబసభ్యులకు కెసిఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఆత్మీయుడిని కోల్పోయా: జానా
సీఎం ప్రవేశపెట్టిన సంతాప తీర్మానాన్ని సమర్థిస్తున్నట్లు కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే జానారెడ్డి చెప్పారు. రాంరెడ్డి వెంకటరెడ్డి తనకు ఎంతో సన్నిహితుడని, ఆయన మృతి కాంగ్రెస్ పార్టీతోపాటు తనకు వ్యక్తిగతంగా కూడా లోటని అన్నారు. 1969లో జరిగిన తెలంగాణ ఉద్యమంలో కూడా రాంరెడ్డి పాల్గొన్నారని తెలిపారు.
5సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన రాంరెడ్డి.. కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఎదిగారని చెప్పారు. వ్యవసాయం అంటే ఆయనకు ఇష్టామని చెప్పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఆయన ఎద్దులే పందేల్లో గెలుపొందేవని చెప్పారు. చివరగా జరిగిన పోటీలను తానే ప్రారంభించానని గుర్తు చేసుకున్నారు. క్యాన్సర్ వచ్చిందని తెలిసినా ఆయన దాన్ని దైర్యంగా ఎదుర్కొన్నారని తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు తెలిపారు. రాంరెడ్డి నిబద్ధత, స్ఫూర్తి అన్ని పార్టీల వారందరికీ ఆదర్శమని అన్నారు.
బాధాకరం: తుమ్మల
వెంకటరెడ్డి మనమధ్య లేకపోవడం బాధాకరమైన విషయమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మొదట మూడు సార్లు ఓటమిపాలైనా.. ఉపఎన్నికల్లో తొలిసారి గెలిచి వెనక్కి చూసుకోలేదని అన్నారు. కమ్యూనిస్టుల ప్రభంజనంలో కూడా ఆయన గెలిచారని గుర్తు చేశారు. నిండైన పంచకట్టుతో రైతు రూపంతో ఉండేవారని తెలిపారు. రాంరెడ్డి వైద్య ఖర్చుల కోసం అడిగితే.. ఎంత ఖర్చయినా చెల్లించాలని సీఎం కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు.
ఖమ్మం రాజకీయాల్లో రాంరెడ్డిది విలక్షణమైన పాత్ర అని తెలిపారు. గిరిజన కుటుంబాలతో ఆయన మమేకమయ్యేవారని అన్నారు. తనతో కూడా ఆయనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
వెంకటరెడ్డి సూచనలతోనే తాను రాజకీయంగా ఎదిగానని ఎమ్మెల్యే రెడ్యా నాయక్ అన్నారు. ఎప్పుడూ అప్యాయంగా పలకరించే వారని గుర్తు చేశారు. ఆయన ఇప్పుడు లేకపోవడం బాధాకరమని అన్నారు. రాంరెడ్డి మృతి చాలా బాధాకరమని మరో ఎమ్మెల్యే జలగం వెంకట్రావు అన్నారు.
టిఆర్ఎస్కు పువ్వాడ అజయ్ కీలక ప్రతిపాదన
రాంరెడ్డికి ఖమ్మం జిల్లా ప్రజలంటే ఎంతో ఇష్టమని తెలిపారు. వ్యవసాయం, పశుపోషణ అన్నా ఆయన ఎంతో ఇష్టమని తెలిపారు. ఊపిరిత్తుల క్యాన్సర్ ఉందని తెలిసినా ఆయన ధైర్యంగా ఎదుర్కొన్నారని చెప్పారు.
రాంరెడ్డి మరణించిన కారణంగా ఆయన నియోజకవర్గంలో జరిగే ఉప ఎన్నికల్లో ఆయన కుటుంబంలోని ఎవరో ఒకరు కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తారని చెప్పారు. రాంరెడ్డి సేవలకు గుర్తింపుగా అక్కడ టిఆర్ఎస్ పార్టీతోపాటు మరే పార్టీ కూడా పోటీ పెట్టకుండా ఏకగ్రీవానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుతం టిఆర్ఎస్ పార్టీకి నెంబర్స్ పెద్ద విషయం కాదనీ, టిడిపి ఎమ్మెల్యేలను ఇప్పటికే విలీనం చేసుకున్నారని అన్నారు. అంతేగాక, విజయపరంపర కొనసాగిస్తున్నారని అన్నారు. రాంరెడ్డి సేవలకు గుర్తింపుగా ఏ పార్టీ కూడా పోటీ పెట్టకూడదని కోరారు.