అసెంబ్లీలో రాజాసింగ్ బీభత్సం.. తెలంగాణ నుంచి వెళ్లిపోతానంటూ.. కేంద్రానికి కేసీఆర్ షాక్..
కేంద్రంలోని బీజేపీ సర్కారుకు గట్టి షాకిస్తూ తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంది. వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర పట్టిక(ఎన్ఆర్సీ), జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్)లకు వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానాలను ఆమోదించింది. సీఎం కేసీఆర్ స్వయంగా ఈ తీర్మానాలను సభలో ప్రవేశపెట్టగా, ప్రతిపక్ష కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు సమర్థించాయి. ఏకైక బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మాత్రం సభలో కాసేపు బీభత్సం సృష్టించారు. తీర్మానం కాపీలను చించిపారేసి, స్పీకర్ పోడియంవైపు దూసుకెళ్లి రభస చేశారు. మొత్తం వివరాలిలా ఉన్నాయి..
బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సోమవారం సభ ప్రారంభమైన వెంటనే సీఎం కేసీఆర్ సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ లపై తీర్మానాలు ప్రవేశపెట్టి, చర్చను ప్రారంభించారు. దేశంలో ఎన్నో సమస్యలుండగా, అత్యధికుల్ని ఇబ్బంది పెట్టే చట్టాలను బీజేపీ సర్కారు రుద్దాలనుకోవడం దుర్మార్గమని, కులమతాలకు అతీతంగా ఉండాలని రాజ్యాంగం చెబుతోంటే.. కేంద్రం మాత్రం సీఏఏలో ముస్లింలను మినహాయించడమేంటని కేసీఆర్ ప్రశ్నించారు. దేశ ప్రతిష్ట దెబ్బతిసే సీఏఏ లాంటి చట్టాల విషయంలో కేంద్రం పున:సమీక్ష చేసుకోవాలని, కొత్త ప్రతిపాదనతో ముందుకు వస్తే మద్దతు ఇస్తామని, స్పష్టమైన అవగాహనతోనే సీఏఏ, ఎన్ఆర్సీని వ్యతిరేకిస్తున్నామని సీఎం క్లారిటీ ఇచ్చారు. కాగా..
ఈ మూడు అంశాల విషయంలో సీఎం అభిప్రాయంతో ఏకీభవిస్తున్నామన్న కాంగ్రెస్ సభ్యులు.. బీజేపీ చేపట్టిన ఇతరత్రా చట్టవ్యతిరేక కార్యక్రమాలకు టీఆర్ఎస్ మద్దతుగా నిలబడిందని ఆరోపించారు. ఎంఐఎం కూడా తీర్మానాన్ని సమర్థించింది. ఏకైక బీజేపీ సభ్యుడు రాజాసింగ్ మాత్రం తీర్మానాన్ని వ్యతిరేకించారు. సీఏఏ వల్ల ఏ ఒక్కరికైనా అన్యాయం జరుగుతుందని నిరూపిస్తే.. తక్షణమే రాజీనామా చేసి, తెలంగాణ నుంచి వెళ్లిపోతానని సంచలన ప్రకటన చేశారు.
''సీఎం కేసీఆర్ ప్రజల్ని దారుణంగా మోసం చేస్తున్నారు. సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ గురించి అన్నీ అబద్ధాలు, అవాస్తవాలు చెబుతున్నారు. అసలు దీని వల్ల ఎవరికి అన్యాయం జరుగుతుందో వివరంగా చెప్పండి. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతోపాటు యంత్రాంగం మొత్తం భరోసా ఇచ్చినా ఆ చట్టాలపై విమర్శలు చేయడం తగదు''అని రాజా సింగ్ అన్నారు. ఆయన మాట్లాడుతుండగా, మధ్యలో స్పీకర్ మైక్ కట్ చేయడంతో.. తీర్మానం కాపీలను చించిపారేసి, పోడియం వైపునకు వస్తూ గట్టిగా నినాదాలు చేశారు. రాజాసింగ్ నిరసన నేపథ్యంలో ఓటింగ్ చేపట్టాలంటూ సీఎం కేసీఆర్.. స్పీకర్ పోరాచారం శ్రీనివాసరెడ్డిని కోరడంతో ఓటింగ్ నిర్వహించిన స్పీకర్.. తీర్మానం ఆమోదం పొందినట్లు ప్రకటించారు.