మరోసారి వైఎస్సార్ను స్మరించిన కేసీఆర్: నిండుసభలో: ఆరోగ్యశ్రీ ముందు ఆయుష్మాన్ దండగ
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తనకు రాజకీయ భేషజాల్లేవీ లేవని నిరూపించుకున్నారు. మరోసారి ఆయన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిని స్మరించుకున్నారు. ఆయన ప్రవేశపెట్టిన పథకాల గురించి ప్రస్తావించారు. తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. నిండుసభలో వైఎస్సార్ను ఆయన స్మరించుకోవడం ఇది రెండోసారి. ఇదివరకు 108 అంబులెన్సుల పనితీరు విషయంలో వైఎస్సార్ సేవలను స్మరించుకున్నారు. తాజాగా మరోసారి అలాంటి సన్నివేశమే అసెంబ్లీ సమావేశాల్లో కనిపించింది.
36 ఏళ్ల సర్వసంగ పరిత్యాగిణి.. అయినా వదల్లేదు: గ్యాంగ్రేప్: నిందితుల కోసం సిట్
ఆరోగ్యశ్రీ.. 108 అంబులెన్సులపై..
శాసనసభలో స్వల్పకాలిక చర్చ కింద ఆరోగ్యశ్రీ, కరోనా వైరస్ అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ప్రాణాంతక కరోనా వైరస్ వైరస్ చికిత్సను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకుని రావాలంటూ కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. తెలంగాణలో కరోనా వైరస్ రోజురోజుకూ విస్తరిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు లక్షల కొద్దీ ఫీజులను గుంజుతున్నాయని చెప్పారు. ప్రైవేటు ఆసుపత్రులను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కరోనా వల్ల ఇప్పటికే ఉపాధిని కోల్పోయి, వేలాది మంది రోడ్డున పడ్డారని, ఈ పరిస్థితుల్లో ప్రైవేటు ఆసుపత్రులు ఫీజుల భారాన్ని అదనంగా మోపుతున్నాయని అన్నారు.
ఆయుష్మాన్ భారత్ ఎందుకూ పనికిరాదు..
దీనిపై కేసీఆర్ స్పందించారు. కరోనా వైరస్ చికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకుని వచ్చే అంశాన్ని పరిశీలిస్తామని అన్నారు. దీనిపై సాధ్యాసాధ్యాలు అధ్యయనం చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఆరోగ్యశ్రీ పథకం సేవలను కేసీఆర్ ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న ఆయుష్మాన్ భారత్ కంటే ఆరోగ్యశ్రీ వల్ల మేలు కలుగుతోందని అన్నారు. ఆయుష్మాన్ భారత్ దండగ అనే విషయాన్ని తాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖం మీదే చెప్పానని కేసీఆర్ పేర్కొన్నారు. తాము ఈ విషయాన్ని చాటుగా చెప్పలేదని చెప్పుకొచ్చారు. ఆయుష్మాన్ భారత్ కంటే ఆరోగ్యశ్రీ అద్భుతంగా పనిచేస్తోందనే విషయం వారికి తెలుసో, తెలియదోనని అన్నారు.
ఆ ఘనత వైఎస్సార్దే
ఆరోగ్యశ్రీ కింద ఆయుష్మాన్ భారత్ ఎందుకూ పనికిరాదని కేసీఆర్ తేల్చి పారేశారు. ఆయుష్మాన్ భారత్ పథకం వల్ల నష్టపోవాల్సి వస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే కవరేజీ ఏ మూలకూ రాదని స్పష్టం చేశారు. ఇదివరకు తాను ఇదే అంశాన్ని ఇదే నిండు సభలో ప్రకటించానని గుర్తు చేశారు. ఆరోగ్యశ్రీ కూాడా తాము తీసుకొచ్చింది కాదని, ఈ పథకాన్ని తాము ప్రకటించలేదని కేసీఆర్ స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి తీసుకొచ్చారని అన్నారు. తమలో నిజాయితీ ఉండటం వల్లే ఒక మంచిపనిని ఎవరు చేసినా ప్రశంసిస్తామని చెప్పారు. అలా చెప్పడం తమ నైజమనీ కేసీఆర్ పేర్కొన్నారు.
పేర్లు మార్చే పిచ్చి బేషజాల్లేవ్..
ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్సుల పథకాన్ని తీసుకొచ్చింది కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డేనని అన్నారు. అది మంచి పథకం కావడం వల్లే తాము దాన్ని కొనసాగిస్తున్నామని కేసీఆర్ చెప్పారు. ఆరోగ్యశ్రీ పేరును కూడా తాము మార్చలేదని, అలాంటి పిచ్చి భేషజాలేవీ తమకు లేవని అన్నారు. గత పాలకులు చేసిన మంచిపనిని తాము అభినందించి తీరుతామని, వాటిని అమలు చేస్తామని చెప్పారు. అలాంటి నిజాయితీ, చిత్తశుద్ధి తమకు ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రతి దాన్నీ రాజకీయం చేయాలని తపన తమకు ఏ మాత్రం లేదని అన్నారు. అలాంటి ఆలోచన రాదని చెప్పారు. తాము అంత దిగజారి ఆలోచన చేయమని అన్నారు.
20 వేలకు పైగా పడకలు..
కరోనా వైరస్ను నియంత్రించే విషయంలో తాము పురోగతిని సాధిస్తున్నామని కేసీఆర్ చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 20 వేలకు పైగా పడకలను అందుబాటులోకి తీసుకొచ్చామని అన్నారు. పేషెంట్లకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని పునరుద్ఘాటించారు. కరోనా పేషెంట్లకు కల్పించాల్సిన వైద్య చికిత్సలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కరోనాను నియంత్రించే ప్రయత్నాలు ఫలిస్తున్నాయని, అందుకే కరోనా మరణాల్లో జాతీయ రేటు కంటే తెలంగాణలో తక్కువగా నమోదవుతోందని కేసీఆర్ వెల్లడించారు.