అసెంబ్లీకి గులాబీ కండువాతో టిడిపి సభ్యులు, ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం: గవర్నర్
హైదరాబాద్: తెలంగాణ శాసన సభ సమావేశాలు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఎర్రబెల్లి దయాకర రావు తదితర టిడిపి సభ్యులు గులాబీ కండువాతో అసెంబ్లీకి వచ్చారు. కొందరు టిడిపి నేతలు ఇటీవలే అధికార టిఆర్ఎస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.
గవర్నర్ ప్రసంగం
గవర్నర్ నరసింహన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ... ఎన్నో ఆశలు, ఆశయాలతో తెలంగాణ ఆవిర్భవించింది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా బడ్జెట్ ఉండబోతుది. గోదావరి జల వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకున్నాం.
మహారాష్ట్ర ప్రభుత్వంతో చారిత్రక ఒప్పందం కుదుర్చుకున్నాం. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోంది. అంతర్రాష్ట్ర సమస్యలను ప్రభుత్వం పరిష్కరించింది.. పరిష్కరిస్తోంది. 2016-17 బడ్జెట్ రాష్ట్ర భవిష్యత్తుకు రోడ్ మ్యాప్ లాంటింది. 11.7 శాతం వృద్ధి రేటును లక్ష్యంగా పెట్టుకున్నాం.
మిషన్ భగీరథకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. డబుల్ బెడ్ రూం, కళ్యాణ లక్ష్మి వంటి పథకాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ దేశానికే ఆదర్శం. ప్రభుత్వ పథకాలు జాతీయ దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజ్. 20 నెలల కాలంలో ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. సంక్షేమ పథకాలు 35 లక్షల మందికి చేరుతున్నాయి. బలహీనవర్గాలన్నింటికీ కళ్యాణ లక్ష్మి వర్తింపు. 1.15 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్.
నిరుపేదలకు పింఛన్లు, డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తున్నాం. స్వచ్ఛ హైదరాబాద్, స్వచ్ఛ భారత్ చేపడుతున్నాం. శిశుమరణాల రేటు గణనీయంగా తగ్గించాం. మైనార్టీల కోసం 17 రెసిడెన్షియల్ స్కూల్స్. అందరికీ వైద్య సేవలు అందేలా విప్లవాత్మక మార్పులు తీసుకు రాబోతున్నాం.
ప్రజల ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తున్నాం. హైవేలపై 108 సేవలు పటిష్టపరుస్తున్నాం. గ్రామజ్యోతి పథకంతో గ్రామాల్లోకి వెలుగు. సేవా రంగంలో 14.9 శాతం అభివృద్ధి సాధిస్తాం. సంక్షేమ హాస్టళ్లలో సన్న బియ్యం భోజనం పెడుతున్నాం. స్వచ్ఛ తెలంగాణ దిశగా అన్ని చర్యలు చేపట్టాం. రాజధానిలో చెత్త బుట్టాలను పంపిణీ చేశాం.
స్వచ్ఛ భారత్ కోసం రూ.200 కోట్లు. అంగన్వాడీలకు జీతాలు పెంచాం. సాగునీటి ప్రాజెక్టుల రీడిజైనింగ్ చేపట్టాం. ములుగులో కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టీ కల్చర్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశాం. హైదరాబాదులో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులకు అన్యాయం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టులను రీడిజైనింగ్ చేస్తున్నాం. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటిక నల్లా నీరు. డిసెంబర్ నాటికి 16 మున్సిపాలిటీల్లో మిషన్ భగీరథ కింద తాగునీరు ఇస్తాం. విద్యుత్, ఇరిగేషన్ ప్రాజెక్టులకు ప్రాధాన్యత.
వరంగల్లో అతిపెద్ద టైక్స్టైల్ పార్క్. ప్రభుత్వ రంగంలో ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేస్తాం. మిషన్ ఇంద్రధనుస్సులో రాష్ట్రానికి జాతీయస్థాయిలో గుర్తింపు. వ్యవసాయ రంగంలో పలు సంస్కరణలు తీసుకు వచ్చాం. రుణమాఫీ అమలు చేశాం. కూరల సాగుకు 75 శాతం ప్రోత్సహకాలు ఇస్తున్నాం.
అటవీ, పర్యావరణం, అంతర్రాష్ట్ర సమస్యలపై కృషి. 45 వేల చెరువులను పునరుద్ధరిస్తున్నాం. రేషన్ కింద ప్రతి వ్యక్తికి ఆరు కిలోల బియ్యం ఇస్తున్నాం. 60వేల పై చిలుకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తున్నాం. నేరాల నియంత్రణకు షీ టీమ్స్ ఏర్పాటు చేశాం. రూ.68వేల కోట్లకు పైగా ఐటి ఎగుమతులు చేశాం.
రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ వన్ చేస్తాం. పంచాయతీస్థాయిలో పాలనలో సంస్కరణలు తెస్తున్నాం. విత్తన భాండాగారంగా తెలంగాణను చేస్తాం. పబ్లిక్ సెక్టారులో ప్రయివేటు భాగస్వామ్యంపై అధ్యయనం కోసం శ్రీలంకకు బృందాన్ని పంపించాం.
హైదరాబాదులో అతిపెద్ద ఇంక్యుబేటర్ అందుబాటులోకి తీసుకు వచ్చాం. హైదరాబాదులో ఎందరో పరిశ్రమలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. గవర్నర్ ప్రసంగం అనంతరం సభ రేపటికి వాయిదా పడింది.
కాంగ్రెస్ విమర్శలు
గవర్నర్ ప్రసంగంలో ముస్లీం రిజర్వేషన్ల ఊసే లేదని కాంగ్రెస్ సభ్యులు చిన్నారెడ్డి అన్నారు. 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమయిందన్నారు. ఎన్నికల హామీ ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. కరవు, పశుగ్రాసంపై ఏం మాట్లాడారని ప్రశ్నించారు. ఏం చేస్తారనే దానిపై ప్రభుత్వానికి స్పష్టత లేదన్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణవ్యాప్తంగా కరువు తాండవిస్తోందన్నారు. కరువు నివారణకు ఏం చర్యలు తీసుకుంటుందో చెప్పలేదన్నారు.
గన్పార్కు వద్ద నివాళి
బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్బంగా మంత్రులు, ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఎదుట ఉన్న గన్పార్క్ వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. మంత్రులు హరీష్ రావు, కడియం శ్రీహరి తదితరులు అమరవీరుల స్థూపానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ అమరవీరులకు జోహర్ అంటూ నినాదలతో నివాళులర్పించారు.