13వ ర్యాంక్పై టిఆర్ఎస్ అనుమానం, కెసిఆర్ని సమర్థించిన జానా!
హైదరాబాద్: పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రానికి 13వ స్థానం రావడంపై తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు మంగళవారం నాడు తమ అసంతృప్తిని, అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ... ఆ ర్యాంకులతో తమకేం పని అని చెప్పారు.
భువనగిరి పార్లమెంటు సభ్యుడు బూర నర్సయ్య గౌడ్ తెలంగాణకు వచ్చిన ర్యాంకు పైన అనుమానం వ్యక్తం చేశారు. తెలంగాణకు 13వ స్థానం రావడంపై అనుమానాలు ఉన్నాయని చెప్పారు. పెట్టుబడులు వస్తున్న రాష్ట్రాలలో తమిళనాడు, మహారాష్ట్ర ముందంజలో ఉన్నాయని బూర చెప్పారు.
అయితే, ప్రపంచ బ్యాంకు ప్రకటించిన జాబితాలో ఆ రాష్ట్రాలు ఎక్కడో ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఇందుకు కారణం ఏమిటిని ఆయన అభిప్రాయపడ్డారు.
హఠాత్తుగా గ్రూప్ 2, 3, 4 ఇంటర్వ్యూలు వద్దనడం ఏమిటని ప్రశ్నించారు. గీత కార్మికులు కల్తీ కల్లును అరికట్టేందుకు అప్రమత్తం కావాలన్నరు. రైల్వేల్లో మూడు రాష్ట్రాల వారే ఎక్కువగా ఎందుకు ఉంటారని బూర నర్సయ్య గౌడ్ ప్రశ్నించారు.
అవసరమైతే అవిశ్వాస తీర్మానం: కాంగ్రెస్
అసెంబ్లీ కమిటీ హాలులో తెలంగాణ కాంగ్రెస్ శాసన సభా పక్షం మంగళవారం సమావేశమైంది. పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో రైతాంగ సమస్యల పైన ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయించారు.
రైతు రుణాలు మొత్తం ఒకేసారి మాఫీ చేసేలా ప్రభుత్వంపై పోరాడాలని తీర్మానించారు. రైతు ఆత్మహత్యల పైన ప్రభుత్వం దిగి వచ్చే వరకు అసెంబ్లీని స్తంభింప చేయాలని, ప్రజా సమస్యలు చర్చకు రానీయకుంటే స్పీకర్, కౌన్సెల్ చైర్మన్ పైన అవసరమైతే అవిశ్వాస తీర్మానం ఇవ్వాలని నిర్ణయించారు.
విభేదించిన జానా రెడ్డి
ప్రాజెక్టుల రీడిజైనింగ్ పైన కాంగ్రెస్ పార్టీలో భిన్నాభిప్రాయాలువ్యక్తమయ్యాయి. రీడిజైనింగ్ మంచిదేనని జానారెడ్డి అభిప్రాయపడ్డట్లుగా తెలుస్తోంది. అయితే, మిగతా సభ్యులు దాంతో విభేదించారని సమాచారం. దీంతో, రీడిజైనింగ్ పైన మీరు పోరాడితే, నేను మద్దతు మాత్రమే ఇస్తానని జానా వారికి చెప్పారని తెలుస్తోంది.