షాకింగ్!: 'గజ్వెల్లో 50వేల ఓట్లతో ఓడిపోనున్న కేసీఆర్, డిపాజిట్ రాని పరిస్థితి'
హైదరాబాద్/గజ్వెల్: తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గజ్వెల్ నియోజకవర్గంలో ఓడిపోతున్నారని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంటేరు ప్రతాప్ రెడ్డి శనివారం వెల్లడించారు. ఆయనకు డిపాజిట్ రాని పరిస్థితులు వచ్చినా ఆశ్చర్యం లేదని అన్నారు. ఏదో విధంగా గెలవాలని కేసీఆర్ చూస్తున్నారన్నారు.
గత అసెంబ్లీ (2014) ఎన్నికల్లో కుట్రలు చేసి తనను ఓడించారని చెప్పారు. ఇప్పుడు మాత్రం ఆయన ఓటమి ఖాయమని చెప్పారు. ఏదో విధంగా గెలవాలని కేసీఆర్ ఇప్పటికీ చూస్తున్నారని, దానిని తాము ఎట్టి పరిస్థితుల్లోను సహించేది లేదని తేల్చి చెప్పారు. గత ఎన్నికల్లో కుట్రలు చేసినట్లు, ఇప్పుడు కూడా కుట్రలు చేయాలని చూస్తోందన్నారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయాలని చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
చంద్రబాబు-రాహుల్లకు 'ఎగ్జిట్' షాక్: కేసీఆర్దే గెలుపు, ఏ సర్వే ఏం చెప్పిందంటే? 90 సీట్లన్న ఓ సర్వే
తెలంగాణలో భయానక వాతావరణం
తాను ఆస్తులు అమ్ముకొని ప్రజల కోసం పోరాటం చేస్తున్నానని వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. ఈ నెల 11న నిజమైన తెలంగాణ వస్తుందని చెప్పారు. గజ్వేల్లో నలభై నుంచి నుంచి యాభై వేల మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. నాలుగున్నరేళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో అధికార దుర్వినియోగం బాగా జరిగిందన్నారు. ధర్నా చౌక్ల ఎత్తివేత, 30 యాక్ట్ అమలు అందుకు నిదర్శనమన్నారు. భయానక వాతావరణం నెలకొందని, ప్రజాసంఘాలు, నేతలకు మాట్లాడే హక్కు కరువైందని చెప్పారు.
ఆ నాలుగు స్తంభాలను ప్రజలు నిలబెడతారు
రాజకీయ, విద్యావ్యస్థ, ఇతర వ్యవస్థలు విచ్ఛిన్నమయ్యాయని వంటేరు మండిపడ్డారు. ప్రజాస్వామ్యానికి మూలమైన నాలుగు స్తంభాలను కూల్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఆ నాలుగు స్తంభాల్ని ప్రజలు నిలబెడతారని చెప్పారు. 11వ తేదీన ఉపశమనం లభిస్తుందన్నారు. అప్పుడే సామాజిక, బంగారు తెలంగాణ సాకారమవుతుందన్నారు. తాను గెలిచాక అవినీతిపరుల గుండెల్లో నిద్రిస్తానని, ఎవరినీ వదిలేది లేదన్నారు.
ప్రాణాలు వదిలి పెట్టేందుకైనా సిద్ధం, వెనుకాడేది లేదు
ప్రజల కోసం ప్రాణాలు వదిలి పెట్టేందుకు వెనుకాడేది లేదని వంటేరు చెప్పారు. ప్రాజెక్టులు, పథకాలలో కేసీఆర్, కేటీ రామారావు, హరీష్ రావులే కనిపిస్తారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఎవరినీ దగ్గరికి రానీయలేదని చెప్పారు. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఫోన్లు మాట్లాడాలంటే సామాన్యుడు మొదలు ఉన్నతాధికారి వరకు అంతా భయపడే పరిస్థితి నెలకొందని చెప్పారు. సిద్దిపేటలో గడీల పాలన ఉందని ఆరోపించారు. హరీష్ రావు ఆస్తుల చిట్టా చెప్పాలని డిమాండ్ చేశారు. సచివాలయానికి వెళ్లకుండా పాలన చేశారన్నారు.
ఎస్సైని సస్పెండ్ చేయాలి
రాజేంద్ర ప్రసాద్ అనే ఎస్సై తనపై చేయి చేసుకున్నారని, అతను తెరాసకు మద్దతు ఇచ్చాడని వంటేరు వేరుగా ఆరోపించారు. గజ్వేల్లో సివిల్ డ్రెస్లో ఉన్న కొంతమంది ఎస్సైలు డబ్బు, లిక్కర్ సరఫరా చేశారన్నారు. ఆ వ్యక్తులను తక్షణం సస్పెండ్ చేయాలన్నారు. ఈ మేరకు ఈసీకి ఫిర్యాదు చేశానని చెప్పారు. అయ్యప్పమాల వేసుకున్న తమ వ్యక్తిని పోలీసులు లాఠీతో కొడితే తీవ్రంగా గాయమైందన్నారు. ఎస్సై రాజేంద్రప్రసాద్ను సస్పెండ్ చేయమని తాను డిమాండ్ చేసినా స్పందించడం లేదన్నారు.
మంచి తీర్పు ఇచ్చి ఉంటారు
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మంచి తీర్పు ఇచ్చినట్లుగా తాము భావిస్తున్నామని తెలంగాణ టీడీపీ నేత రావుల చంద్రశేఖర రెడ్డి వేరుగా చెప్పారు. హామీలు నెరవేర్చకుండా ప్రజలను కేసీఆర్ ప్రభుత్వం మోసం చేసిందని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఓట్లు పడ్డాయని చెప్పారు. తమకు వందకు పైగా సీట్లు వస్తాయని తెరాస నేతలు చెబుతున్నారని, సీట్లేమో కానీ తెరాసకు 108 సేవలు మాత్రం అవసరమవుతాయని ఎద్దేవా చేశారు. ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూసి తాము కుంగిపోవడం లేదా పొంగిపోవడం లేదని చెప్పారు.