టీఎస్పీఎస్సీ, మీసేవకు ‘స్కాచ్’ పురస్కారాలు: తెలంగాణ డిస్కంకు కూడా(ఫొటో)
న్యూఢిల్లీ/హైదరాబాద్:: స్మార్ట్ టెక్నాలజీ వినియోగంలో తెలంగాణకు నాలుగు అవార్డులు లభించాయి. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ), తెలంగాణ మీ-సేవ లకు ‘స్కాచ్' పురస్కారం లభించింది. ఆన్లైన్ ద్వారా రాత పరీక్ష నిర్వహించి లక్షలాదిమంది యువతకు అవకాశం కల్పించిన టీఎస్ పీఎస్సీకి ఈ పురస్కారం ఇచ్చారు.
గురువారం ఢిల్లీలో ఇండియన్ హేబిటేట్ సెంటర్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో టీఎస్ పీఎస్పీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి ఈ పురష్కారాన్ని అందుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలోనే తొలిసారిగా పరీక్ష కేంద్రాల్లో అభ్యర్థులకు బయోమెట్రిక్ విధానం ప్రవేశపెట్టిన టీఎస్ పీఎస్సీకి ఈ పురస్కారం దక్కడం సంతోషంగా ఉందన్నారు.
మరో వైపు రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఐదు కోట్ల మందికి సేవలు అందించిన తెలంగాణ మీ-సేవ కూడా ఈ పురస్కారాన్ని అందుకుంది. ఈ సేవ శాఖ కమిషనర్, ఉప సంచాలకులు, సాంకేతిక బృందసభ్యులు ఈ పురస్కారాన్ని అందుకున్నారు. 1997లో గుర్గావ్లో ప్రారంభమైన స్కాస్ సంస్థ సామాజిక ఆర్థికాంశాలపై అధ్యయనం చేస్తుంటుంది. స్కాచ్ సంస్థ చైర్మన్ సమీర్ కొచ్చార్ మాట్లాడుతూ.. స్మార్ట్ టెక్నాలజీ వినియోగంలో తెలంగాణ కృషిని అభినందించారు.
ఇది ఇలా ఉండగా, ఐటీ పరిజ్ఞానం వినియోగంతో విద్యుత్ సరఫరాలో సాంకేతిక లోపాల నివారణ, బిల్లుల వసూళ్లకు ఐటీ వినియోగంతో కొత్త వ్యవస్థ రూపకల్పన తదితర అంశాలతో తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్)కు స్కాచ్ నుంచి రెండు ఆర్డర్ ఆఫ్ మెరిట్ అవార్డులు లభించాయి.
ఈ పురస్కారాలను స్కాచ్ గ్రూపు సంస్థ ప్రతినిధి సమీర్ కొచ్చార్ చేతుల మీదుగా టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండి రఘుమారెడ్డి అందుకున్నారు. వినియోగదారులకు అధిక నాణ్యతతో కూడిన విద్యుత్ సరఫరా చేస్తూ టెక్నాలజీ సాయంతో ఆటోమేటిక్ స్పాట్ బిల్లింగ్, స్మార్ట్ మీటరింగ్పై స్కాచ్ నిర్వహించిన సర్వేలో టీఎస్ఎస్పీడీసీఎల్ మొదటి స్థానంలో నిలిచింది.