బంద్: కెటిఆర్ ఆగ్రహం, తలసాని ఆసక్తికర వ్యాఖ్య, పొన్నం టార్గెట్ కవిత
హైదరాబాద్: ఈ నెల 10వ తేదీన (శనివారం) విపక్షాల తెలంగాణ బంద్ పైన తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శుక్రవారం నాడు నిప్పులు చెరిగారు. తెలంగాణ ఉద్యమంలో కలవని పార్టీలు కూడా ఇప్పుడు ఏకమవుతున్నాయని ధ్వజమెత్తారు.
ఇప్పుడు బంద్కు పిలుపునిచ్చిన విపక్షాలు ఇన్నాళ్లు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తోందన్నారు. విపక్షాలది శవ రాజకీయమన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులను సరఫరా చేస్తోందన్నారు.
ఇవాళ ఆయన మెదక్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.17 వేల కోట్ల రుణాలను మాఫీ చేశామన్నారు.
రూ.లక్షలోపు రుణాలను కూడా మాఫీ చేశామన్నారు. రైతుల రుణాలను చెల్లించే బాధ్యత ప్రభుత్వానిదేనని బ్యాంకర్లకు పత్రాలు కూడా ఇచ్చామన్నారు. ఇవాళ తమ ప్రభుత్వం చేస్తోన్న పథకాలను ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయన్నారు.
గతంలో రైతులను పోలీసులతో కొట్టించిన వాళ్లు ఇప్పుడు భరోసా యాత్రలు చేయడం విడ్డూరమన్నారు. బతికుండగానే పీక్కుతినే రాబందుల్లా ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయన్నారు. ప్రతిపక్షాలకు రైతులపై ప్రేమ ఉంటే వారిలో ఆత్మస్థైర్యం పెంచేలా వ్యవహరించాలన్నారు. 60 ఏళ్ల దరిద్రం 15 నెలల్లో పోవాలంటే ఎలా అన్నారు.
రేపటి బంద్కు ప్రజల సహకారం లేదు: పోచారం
ప్రతిపక్షాలు పిలుపునిచ్చిన రేపటి బంద్కు ప్రజల సహకారం లేదని మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రతిపక్షాలు ఇచ్చిన బంద్ను బలవంతపు బంద్గా పేర్కొన్నారు. ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రజల సహకారంలేని బంద్ ఎలా బంద్ అవుతుందన్నారు. విపక్షాలను రైతులు నమ్మడం లేదన్నారు. వంద శాతం మేం రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పారు. బలవంతపు బంద్ సరికాదన్నారు.
రైతుల కోసమే: తలసాని
ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని పరిహారం ఇస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రైతుల కుటుంబాలకు కల్యాణ లక్ష్మి పథకం వర్తింప చేస్తున్నామన్నారు. హైదరాబాదులో ఓట్ల తొలగింపు ప్రభుత్వ కార్యక్రమం కాదని, ఈశీ కార్యక్రమం అన్నారు.
ప్రతిపక్షాలకు సభలో మాట్లాడేందుకు సమస్యలే లేవన్నారు. మిషన్ కాకతీయ కార్యక్రమం రైతుల కోసమే అన్నారు. రైతు ఆత్మహత్యలు టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకే మొదలయ్యాయా అని తలసాని ఆసక్తికర వ్యాఖ్య చేశారు. దేశవ్యాప్తంగా ఆత్మహత్యలు జరుగుతున్నాయన్నారు.
ప్రభుత్వంపై విపక్షాల భగ్గు
రైతులకు ఒకే దఫా రుణమాఫీ చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. టిడిపి, కాంగ్రెస్, బిజెపి, వామపక్షాలు జిల్లాల్లో పోరాటం సాగిస్తున్నాయి. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా నర్సంపేటలో రైతులకు మద్దతుగా ఆందోళన నిర్వహించాయి.
మరోవైపు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అధికార పార్టీ పైన మండిపడ్డారు. రేపటి విపక్షాల బంద్ విఫలం చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. కెసిఆర్ ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోందన్నారు. నారాయణఖేడ్, నామినేటెడ్ పదవుల పైన ఉన్న ప్రేమ రైతుల పైన లేదన్నారు.
రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వం బతుకమ్మ సంబరాలు జరపుతానని చెప్పడం విడ్డూరమన్నారు. తమ సమస్యల కోసం ఉద్యమిస్తున్న ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులను ఖండిస్తున్నామన్నారు. కవితను ఊరేగించేందుకే బతుకమ్మ సంబరాలు అన్నారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించిన బంద్ విజయవంతం అవుతుందన్నారు.