తెలంగాణ గేమ్ కేసీఆర్ స్టార్ట్ చేస్తే నేను గోల్ చేశా, సుష్మాస్వరాజ్కు మద్దతు: జైపాల్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ గేమ్ కేసీఆర్ ప్రారంభిస్తే గోల్ చేసింది తానేనని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి మంగళవారం అన్నారు. తెలంగాణ రాకకు తానే కారణమని స్పష్టం చేశారు. ఆయన ఓ టీవీ ఛానల్తో మాట్లాడారు. కేసీఆర్ ప్రజలను కాదని, పైసలను పట్టించుకుంటారని మండిపడ్డారు.
తెలంగాణ గేమ్ కేసీఆర్ స్టార్ట్ చేస్తే గోల్ చేసింది తానే అన్నారు. నాటి తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఒప్పించి రాష్ట్రాన్ని ఇప్పించింది నేనే అని చెప్పారు. ఉద్యమంలో కేసీఆర్ ఎక్కడున్నారని తాను అనలేదని, సాగరహారంలో లేరని మాత్రమే తాను అన్నానని చెప్పారు.
ఇంతకీ కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించారు. ఇంట్లో కూర్చొని లెక్కలు రాసుకుంటే సర్వే అవుతుందా అన్నారు. కేసీఆర్ పిల్లలు అజ్ఞానం, అహంకారంతో మాట్లాడుతున్నారన్నారు. బీజేపీలో పుట్టిన వారంతా రాక్షసులను సామెతగా అన్నానని చెప్పారు.
బీజేపీ నేతలపై జైపాల్ రెడ్డి తీవ్రవ్యాఖ్యలు, కేసీఆర్ కుటుంబంలోని విభేదాలపై డీకే అరుణ
పాస్పోర్టు గొడవపై సుష్మాకు మద్దతు
యూపీలోని హిందూ-ముస్లీం దంపతుల పాస్పోర్టు విషయంలో సుష్మాస్వరాజ్ పైన దాడిని ఖండిస్తున్నామని జైపాల్ రెడ్డి చెప్పారు. సొంత పార్టీ నేతలు స్మృతి ఇరానీ, పీయూష్ గోయల్లు చెప్పరని భాషను ఉపయోగించారన్నారు. సొంత పార్టీ నేతలు సైతం టార్గెట్ చేయడం శోయనీయమన్నారు. మోడీ సామాజిక మాధ్యమ సైన్యం హిట్లర్ సేనను తలపిస్తోందన్నారు.
మోడీకి ప్రత్యామ్నాయంగా ఉన్నారనే సుష్మా స్వరాజ్ పైన సోషల్ మీడియాలో దాడులు చేయిస్తున్నారన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల నియంత్రణలో కేంద్రం చేతులెత్తేసిందన్నారు. దేశ ఆర్థిక విధానానికి బీజేపీ ముప్పు తెస్తోందన్నారు. రేపు ఎన్నికలు వచ్చినా తాము సిద్ధమన్నారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏమైందని ప్రశ్నించారు. అన్ని వర్గాల ఓట్లు కొట్టేసేందుకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారన్నారు.
కాగా, యూపీలోని పాస్ పోర్టు అధికారి తమ పాస్ పోర్టును పక్కన పడేశారని, పైగా తన భర్తను మతం మార్చుకోమని చెప్పారని ఓ హిందూ యువతి ఆరోపించిన విషయం తెలిసిందే. సదరు హిందూ యువతి ముస్లీం వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఈ విషయం తెలిసిన వెంటనే సదరు అధికారిని బదలీ చేశారు. కానీ అసలు విషయం ఆ తర్వాత వెలుగు చూసింది. సదరు మహిళ రికార్డులు సరిగా లేవు. ఓ దాంట్లో తన పాత పేరుతో ఉండగా, మరో దాంట్లో పాత పేరు, భర్త ఇంటి పేరుతో కలిపి ఉన్నట్లుగా ఉంది. ఆమె చూపించిన తన పత్రాల్లో పేర్లు వేర్వేరుగా ఉండటంతో సదరు అధికారి దానిని తిరస్కరించారని ఆ తర్వాత తేలింది. దీంతో సదరు అధికారికి శివసేన మద్దతుగా నిలిచింది. అతనికి సన్మానం చేయాలని నిర్ణయించింది.
పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు స్టే
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై మంగళవారం హైకోర్టు స్టే విధించింది. బీసీలకు ఏ ప్రాతిపదికన 34 శాతం రిజర్వేషన్లు కేటాయించారని హైకోర్టు ప్రశ్నించింది. బీసీ-ఏ, బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ తేల్చిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని ఆదేశించింది.
రెండు మూడు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్కు తాము సిద్ధమవుతున్నామని అడిషనల్ అడ్వోకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. ఇప్పటికే సర్పంచ్, వార్డు మెంబర్ల పదవీకాలం ముగిసిందని తెలిపారు. అయితే, అన్ని అంశాలను తేల్చిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని హైకోర్టు ఆదేశించింది.
జనాభా ప్రాతిపదికన బీసీల లెక్కలు లేవని, కాబట్టి పంచాయతీ ఎన్నికలపై స్టే విధించాలని కాంగ్రెస్ పార్టీ నేత దాసోజు శ్రవణ్ కుమార్ కోర్టును ఆశ్రయించారు. దీంతో పంచాయతీ ఎన్నికలకు బ్రేక్ పడింది.