తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అరెస్ట్... కేసీఆర్కు చుక్కలు చూపిస్తామని హెచ్చరిక
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. కరీంనగర్ నుంచి సిద్దిపేటకు వెళ్తున్న సంజయ్ను పోలీసులు మార్గమధ్యలోనే అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఇంట్లో పోలీసుల ఆకస్మిక దాడుల నేపథ్యంలో ఆయన సిద్దిపేటకు బయలుదేరారు. అయితే పోలీసులు మార్గమధ్యలోనే అడ్డుకోవడంతో బీజేపీ కార్యకర్తలు వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అనంతరం కరీంనగర్లో ప్రెస్ మీట్ నిర్వహించిన బండి సంజయ్ టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మరో రెండేళ్లు మాత్రమే టీఆర్ఎస్ ఆటలు సాగుతాయని... ఆ తర్వాత మీ సంగతేంటో తేలుస్తామని హెచ్చరించారు.
దుబ్బాక ఉపఎన్నిక హీట్ .. బస్టాండ్కు రమ్మన్న బండి సంజయ్ పత్తాలేడన్న హరీష్ రావు
కేసీఆర్ అధికారులను బెదిరించారు...
దుబ్బాకలో గెలుపు కోసం అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ కార్యకర్తల్లా వాడుకుంటున్నారని ఆరోపించారు. దుబ్బాకలో టీఆర్ఎస్ గెలవకపోతే వారిని సస్పెండ్ చేస్తామని కేసీఆర్ బెదిరించారని... అందుకే అధికారులంతా టీఆర్ఎస్ కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావును అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రఘునందన్ ఇంట్లో నిద్రపోతున్న పసిపాపను సైతం పక్కకు జరిపి సోదాలు నిర్వహించారని ఆరోపించారు. దుబ్బాకలో ఎన్నికలు జరుగుతుంటే సిద్దిపేటలో సోదాలు నిర్వహించే హక్కు పోలీసులకు ఎవరిచ్చారిని ప్రశ్నించారు. దుబ్బాక ఎన్నికలకు సిద్దిపేటకు సంబంధమేంటని నిలదీశారు.
టీఆర్ఎస్ పతనానికి నాంది...
దుబ్బాకలో బీజేపీ గెలుపే టీఆర్ఎస్ పతనానికి నాంది అన్నారు బండి సంజయ్. రాష్ట్రంలో టీఆర్ఎస్ అరాచక పాలనకు సమాధి కడుతామన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలని తాము కోరుకుంటున్నామని... కానీ శాంతి భద్రతల సమస్య సృష్టించి ఎన్నికలు జరగకుండా చేయాలని టీఆర్ఎస్ భావిస్తోందన్నారు. అందుకే సీపీతో తనపై దాడి చేయించారని ఆరోపించారు. తానొక ఎంపీ అన్న గౌరవం కూడా లేకుండా సీపీ తనను గొంతు పట్టి నెట్టేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రి డైరెక్షన్లోనే తనపై దాడి జరిగిందని... దాడి చేసిన సీపీ మీద క్రిమినల్ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.
ఓటమి భయంతోనే...
దుబ్బాకలో ఓడిపోతామన్న భయంతోనే ప్రభుత్వం సోదాలు,తమపై దాడులు చేయిస్తోందని బండి సంజయ్ ఆరోపించారు. ఓటమి భయంతోనే కేసీఆర్,కేటీఆర్ అక్కడ ప్రచారానికి రావట్లేదన్నారు. తాను దాడులకు భయపడే వ్యక్తిని కాదని... దుబ్బాకలో గెలిచి తీరుతామని సవాల్ విసిరారు. దుబ్బాక ఫలితాలే 2024 ఎన్నికల ఫలితాల్లోనూ కనిపిస్తాయన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక కేసీఆర్కు చుక్కలు చూపిస్తామని హెచ్చరించారు.
Recommended Video
రఘునందన్ ఇంట్లో సోదాలు..
దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు నివాసంతో పాటు ఆయన బంధువుల ఇళ్లల్లో సోమవారం(అక్టోబర్ 26) ఏక కాలంలో పోలీసులు,రెవెన్యూ అధికారులు సోదాలు నిర్వహించారు. సిద్దిపేటలో నిర్వహించిన ఈ సోదాల్లో రఘునందన్ రావు బంధువుల ఇంట్లో రూ.18.67లక్షలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోదాల విషయం తెలిసిన వెంటనే రఘునందన్ రావు ఎన్నికల ప్రచారాన్ని పక్కనపెట్టి సిద్దిపేటలోని తన నివాసానికి చేరుకున్నారు. అయితే అప్పటికీ సోదాలు కొనసాగుతుండటంతో పోలీసులు ఆయన్ను లోపలికి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు,రఘునందన్ రావుకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో తోపులాట జరగడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.సెర్చ్ వారెంట్ లేకుండా ఏ సెక్షన్ ప్రకారం తన ఇంట్లో సోదాలు నిర్వహించారో చెప్పాలంటూ పోలీసులను రఘునందన్ రావు ప్రశ్నించారు