కేసీఆర్ ఖబడ్దార్... చెప్పా పెట్టకుండా ముట్టడిస్తాం... జనగామ లాఠీచార్జి ఘటనపై బండి సంజయ్ కౌంటర్...
జనగామ జిల్లా కేంద్రంలో బీజేపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీచార్జిని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. పోలీసులు ముఖ్యమంత్రి కేసీఆర్ డైరెక్షన్లో పనిచేస్తూ బీజేపీ కార్యకర్తల రక్తం కళ్లజూస్తున్నారని విమర్శించారు. ఇష్టానుసారం కేసులు పెడుతూ బీజేపీ కార్యకర్తలను వేధిస్తున్నారని... రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారని విమర్శించారు. బీజేపీ కార్యకర్తలపై లాఠీచార్జి చేసిన పోలీసులను 24గంటల్లోగా సస్పెండ్ చేయాలని... లేనిపక్షంలో డీజీపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని సంజయ్ హెచ్చరించారు.
కేసీఆర్ డైరెక్షన్లోనే లాఠీచార్జి...
మహనీయుల జయంతి,వర్దంతి కార్యక్రమాలకు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి బయటకు రాకపోవడమేంటని బండి సంజయ్ ప్రశ్నించారు.తెలంగాణ రాష్ట్రంలో స్వామి వివేకానంద ఉత్సవాలు కూడా జరుపుకోనివ్వరా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏడాది కాలంగా పోలీసులు బీజేపీ కార్యకర్తల రక్తం కళ్లజూస్తున్నారని ఆరోపించారు. పోలీస్ వ్యవస్థకు బీజేపీ వ్యతిరేకం కాదని... కానీ కొంతమంది పోలీసులు కేసీఆర్ తొత్తుల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ డైరెక్షన్లో ఆయన సూచనల మేరకే బీజేపీ కార్యకర్తలపై లాఠీచార్జి జరిగిందన్నారు.
ఖబడ్దార్ కేసీఆర్... సంజయ్ వార్నింగ్...
జనగామ బీజేపీ కార్యకర్తలు పవన్ శర్మ,క్రాంతి కుమార్,వినోద్ కుమార్,క్రాంతి పట్టణంలో స్వామి వివేకానంద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని...వాటిని తొలగించాల్సిన అవసరం ఏమొచ్చిందని సంజయ్ ప్రశ్నించారు. ఫ్లెక్సీల్లో కేసీఆర్ ఫోటో లేదని తొలగించారా అని విమర్శించారు. ఈ రాక్షస ఘటనపై డీజీపీ స్పందిస్తారా లేదా అని నిలదీశారు. ఎంతమంది కార్యకర్తలను కొడుతారు... ఏం తప్పు చేశారని కొడుతారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ను ఖబడ్దార్ అంటూ హెచ్చరించిన సంజయ్... చెప్పా పెట్టకుండా డీజీపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. తమ కార్యకర్తలను చితకబాదితే చూస్తూ వూరుకోవడానికి తమది టీఆర్ఎస్ పార్టీ కాదన్నారు. 24గంటల్లో లాఠీచార్జికి బాధ్యులైన పోలీసులను సస్పెండ్ చేయకపోతే తమ సత్తా ఏంటో చూపిస్తామన్నారు.
రేపు జనగామకు సంజయ్...
బుధవారం(జనవరి 13) ఉదయం జనగామకు వెళ్తున్నామని బండి సంజయ్ తెలిపారు. పోలీసుల తీరుపై నిరసన తెలియజేస్తామని చెప్పారు. స్వామి వివేకానంద జయంతి రోజు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాంహౌస్ నుంచి బయటకు రాకపోవడమేంటని ప్రశ్నించారు. ఫాంహౌస్లో ఉండేందుకో... లేక 80వేల పుస్తకాలు చదివేందుకో ప్రజలు కేసీఆర్కు అధికారం ఇవ్వలేదన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కొల్లు మాధవి ఈ ఘటనపై మాట్లాడుతూ... రాష్ట్రంలో రజాకార్ల పాలన నడుస్తోందన్నారు.టీఆర్ఎస్ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవచ్చు గానీ బీజేపీ కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోరాదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అన్ని అధికారిక వ్యవస్థలు కేసీఆర్కు తొత్తుల్లా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు.
జనగామలో అసలేం జరిగింది..
ఈ నెల 5న బండి సంజయ్ పర్యటన సందర్భంగా జనగామలో బీజేపీ కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా మున్సిపల్ సిబ్బంది వాటిని తొలగించారు. మంగళవారం స్వామి వివేకానంద జయంతి సందర్భంగా బీజేపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా మున్సిపల్ సిబ్బంది తొలగించారు. మున్సిపల్ సిబ్బంది తీరును నిరసిస్తూ మున్సిపల్ కార్యాలయంలోని కమిషన్ ఛాంబర్ ఎదుట బీజేపీ కార్యకర్తలు పవన్ శర్మ,క్రాంతి,వినోద్ కుమార్ తదితర కార్యకర్తలు ధర్నాకు దిగారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అక్కడినుంచి తరలించేందుకు ప్రయత్నించగా ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో పోలీసులు లాఠీచార్జి జరిపి వారిని బలవంతంగా పోలీస్ స్టేషన్కు తరలించారు.