జగన్-కేసీఆర్ తోడుదొంగలు.. పవన్తో కలిసి ఇద్దరు సీఎంల పని పడతామన్న బండి
''రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగువాళ్లంతా ఒక్కటే అనే స్ఫూర్తి అందరిలోనూ కొనసాగుతున్నది. విడిపోయి కలిసుందామన్న నినాదానికి ప్రజలందరూ కట్టుబడి ఉన్నారు. దానికి అనుగుణంగానే ఇవాళ నేను పవన్ కల్యాణ్ను కలిసి, రెండు రాష్ట్రాల సిద్ధిగతులపై సుదీర్ఘ చర్చలు చేశాను. పవన్ ఎన్నో మంచి విషయాలను, అద్భుతమైన ఆలోచనలను నాతో పంచుకున్నారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అవలంభిస్తోన్న దగాకోరు విధానాలపైనా మాట్లాడుకున్నాం. ఇకపై తెలంగాణ బీజేపీ అవసరాల మేరకు పవన్ కూడా సేవలు అందిస్తారు.. '' అంటూ ఉత్సాహవంతంగా ప్రకటించారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్.
ఊహించని కలయిక..
పోతిరెడ్డిపాడు వివాదం తర్వాత ఏపీ, తెలంగాణ మధ్య ఒకింత టెన్షన్ వాతావరణం నెలకొన్నవేళ.. రెండు రాష్ట్రాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న పార్టీలు ఒకే చోట చేరడం చర్చనీయాంశమైంది. పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ ఇప్పటికే ఏపీలో బీజేపీతో పొత్తు కొనసాగిస్తున్నప్పటికీ ఆయన తెలంగాణ వ్యవహారాలకు దూరం పాటిస్తున్నారు. అలాంటిది సడెన్ గా.. ఏకంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడే జనసేనాని ఇంటికి వెళ్లడం, అవసరమైతే పవన్ ఇక్కడా రంగంలోకి దిగుతాడని ప్రకటించడం గమనార్హం. కాగా, ఇది గౌరవప్రదమైన భేటీ అంటూనే బండి సంజయ్ పలు రాజకీయ అంశాలను ప్రస్తావించడం విశేషం.
తెర వెనుక పవన్..
తెలంగాణ బీజేపీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన సందర్భంలో పవన్ అభినందనలు చెప్పినప్పటి నుంచే ఆయనను కలవాలనుకున్నానని, లాక్ డౌన్ కారణంగా అది సాధ్యపడలేదని, ఇప్పటికిగానీ కలిసి మాట్లాడటం సాధ్యపడలేదని సంజయ్ తెలిపారు. జూబ్లి హిల్స్ లోని పవన్ నివాసంలో ఇద్దరు నేతలు సుమారు గంటసేపు మాట్లాడుకున్నారు. అనంతరం సంజయ్ ఒక్కరే మీడియాతో మాట్లాడగా.. పవన్ మాత్రం తెరవెనుకే ఉండిపోయారు. పవన్ తో ఏం మాట్లాడానో బండి వెల్లడించారు.
దేశభక్తుల్ని తయారు చేసేపనిలో..
‘‘దేశాభివృద్ధి, దేశాన్ని కాపాడుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తానని పవన్ కల్యాణ్ నాతో చెప్పారు. అందుకోసం దేశభక్తి కలిగిన యువతను తయారు చేసే పని చాలా ముఖ్యమైందన్నారు. కరోనా విషయంలోగానీ, దేశాభివృద్ధిలోగానీ మోదీ అద్భుతంగా పనిచేస్తున్నారని, ఆయన ఆలోచనా విధానాలు నచ్చినందుకే ఏపీలో బీజేపీతో పొత్తు పెట్టుకున్నానని, ఇప్పుడు తెలంగాణ నేతనూ కలవడం సంతోషంగా ఉందని పవన్ నాతో చెప్పారు''అని సంజయ్ వివరించారు. అదే సమయంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వ్యవహరిస్తున్న తీరును పవన్ కు వివరించానని ఆయన తెలిపారు.
జగన్-కేసీఆర్ తోడు దొంగలు..
ఏపీ-తెలంగాణ ముఖ్యమంత్రులు కలిసి నాటకాలాడుతూ రెండు రాష్ట్రాల ప్రజల్ని మోసపుచ్చుతున్నారని, తమ స్వలాభం కోసం వాళ్లిద్దరూ ప్రజల మధ్య ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి కూడా వెనుకాడబోరని, ఏమాత్రం అవకాశం చిక్కినా దొంగదారుల్లో ప్రజాధనాన్ని దోచుకుతింటారని, అందులో భాగంగానే పోతిరెడ్డిపాడు అంశాన్ని తెరపైకి తెచ్చారని బండి సంజయ్ ఆరోపించారు. పోతిరెడ్డిపాడు విషయంలో తెలంగాణ బీజేపీ పోరాడేది ఇద్దరు సీఎంలపైనేగానీ, ఏపీ ప్రజలపై కాదని ఆయన స్పష్టం చేశారు. ఇద్దరు సీఎంలు ఎలాంటి దుష్టపన్నాగాలు పన్నుతారో పవన్ కు వివరించానన్నారు.
పవన్ హర్ట్ అయ్యారు..
దేశభక్తికి ప్రాధాన్యం ఇచ్చే తాను, ఏ మతానికి వ్యతిరేకం కాదని పవన్ తెలిపారని, అయితే, హిందూ ధర్మాన్ని టార్గెట్ చేసుకుని జరుగుతోన్న పరిణామాలకు మాత్రం ఆయన హర్ట్ అయ్యారని, ప్రజలకు నిజానిజాలు చెప్పడానికే టీటీడీ వ్యవహారంపై ప్రకటనలు చేశారని సంజయ్ తెలిపారు. టీటీడీ భూముల అమ్మకాలను బీజేపీతోపాటు జనసేన కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. బీజేపీతో జనసేన పొత్తుపై ఏపీ ప్రజల్లో సానుకూల స్పందన వచ్చిందని పవన్ అన్నట్లు తెలిపారు.
సంజయ్ సంచలనం..
పవన్ తో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన సంజయ్... తన సొంత అభిప్రాయంగా పలు సంచలన కామెంట్లు చేశారు. ‘‘హిందూ దేవాలయాల ఆస్తులంటే అన్ని పార్టీలకూ లోకువైపోయాయి. ఎవరైనా ఆస్తుల్ని కాపాడుకోడానికి కమిటీలు వేస్తారుగానీ, అమ్ముకోడానికి కాదు. ఎంఐఎం చేతులో కీలుబొమ్మగా మారిన కేసీఆర్.. తెలంగాణను ఇస్లాం రాజ్యాం చేయాలనుకుంటుంటే.. ఏపీని క్రైస్తవ రాజ్యంగా మార్చడానికి జగన్ శతవిధాలుగా ప్రయత్నిస్తున్నాడు. రాబోయే రోజుల్లో పవన్ కల్యాణ్ తో కలిసి వీళ్లిద్దరి ఆట కట్టిస్తాం. ఒకప్పుడు అయోధ్య ఆలయం కోసం లక్షలాది యువకులు తరలివెళ్లారు. తిరుపతి పరిరక్షణ కోసం అలాంటి పరిస్థితి ఉత్పన్నం కాకుండా ప్రభుత్వాలు మేల్కొంటే మంచిది''అని తెలంగాణ బీజేపీ చీఫ్ హెచ్చరించారు.