ఆ పాపం వూరికే పోదు... అడ్రస్ లేకుండా పోతారు... కేసీఆర్కు బండి సంజయ్ శాపనార్థాలు...
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు అనేక సమస్యలతో సతమవుతున్నారని రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆ సమస్యలను పరిష్కరించే ఉద్దేశం లేదని... ఏదో టైమ్ పాస్ చేస్తూ గడిపేస్తున్నారని విమర్శించారు. 2023లో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రాబోతుందని... తాము అధికారంలోకి వచ్చాక మొదట ఉద్యోగుల ప్రమోషన్ల పైనే దృష్టి సారిస్తామని అన్నారు. ఉద్యోగుల ఫించన్,ఐఆర్ తదితర సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆదివారం(జనవరి 3) నిర్మల్ జిల్లాలో స్థానిక నేతలు బీజేపీలో చేరిన సందర్భంగా సంజయ్ మీడియాతో మాట్లాడారు.
వెంటనే ప్రమోషన్ల ప్రక్రియ ప్రారంభించాలి : బండి సంజయ్
రాష్ట్రంలో ఏ శాఖలోనూ ఉద్యోగులకు ప్రమోషన్స్ లేవని బండి సంజయ్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 1990 నుంచి ఇప్పటివరకూ సివిల్ కానిస్టేబుళ్లకు ప్రమోషన్లు లేవన్నారు.దీంతో కానిస్టేబుళ్లు కానిస్టేబుళ్లు గానే పదవీ విరమణ పొందుతున్నారని చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రభుత్వ ఉద్యోగులను వాడుకుని అధికారంలోకి వచ్చాక మాత్రం వారి ప్రమోషన్ల సంగతిని విస్మరించారని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ప్రమోషన్ల పక్రియను ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
స్కాలర్షిప్స్ వెంటనే విడుదల చేయాలి...
దేశవ్యాప్తంగా ఎస్సీ విద్యార్థులను ఆదుకోవాలన్న ఉద్దేశంతో ప్రధాని మోదీ పోస్టు మెట్రిక్ స్కాలర్షిప్స్ను 60శాతానికి పెంచారని సంజయ్ పేర్కొన్నారు. గత ప్రభుత్వాల హయాంలో కేవలం 11శాతంగా ఉన్న దీన్ని బీజేపీ ప్రభుత్వం 60శాతానికి పెంచిందన్నారు. ఐదేళ్ల కాలానికి మొత్తం రూ.30,584కోట్లు ఎస్సీ విద్యార్థులకు ఉన్నత చదువుల నిమిత్తం స్కాలర్షిప్ రూపంలో అందిస్తోందన్నారు. కేంద్రం తన వాటా కింద 60శాతం నిధులను నేరుగా డీటీబీ(డైరెక్ట్ ట్రాన్స్ఫర్ బెనిఫిట్) ద్వారా విద్యార్థుల ఖాతాల్లో జమ చేస్తోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ వాటా కింద విద్యార్థులకు ఇవ్వాల్సిన 40శాతం నిధులు రూ.24,466 కోట్లు వెంటనే డీటీబీ ద్వారా విద్యార్థుల ఖాతాల్లో జమ చేయాలని సంజయ్ డిమాండ్ చేశారు.
ఆ పాపం వూరికే పోదు... : సంజయ్
గతంలో కేంద్రం ఎస్సీ విద్యార్థుల కోసం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిందని ఆరోపించారు. అందుకే ఈసారి నేరుగా విద్యార్థుల ఖాతాల్లో డబ్బులు చేస్తోందని చెప్పారు. కేంద్రం ఇస్తున్న పోస్టు మెట్రిక్ స్కాలర్షిప్స్ ద్వారా దేశవ్యాప్తంగా 4 కోట్ల మంది విద్యార్థులకు లబ్ది చేకూరుతోందన్నారు. చాలావరకు ఎస్సీ కుటుంబాల్లో కుటుంబ పోషణే భారంగా ఉందని... ఫీజులు చెల్లించే స్తోమత లేక విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమవుతున్నారని చెప్పారు. అలాంటివారికి తగిన ప్రోత్సాహం అందించి వారికి ఉన్నత విద్యను అందించేందుకు ఈ స్కీమ్ను అమలుచేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించాల్సిన రీయింబర్స్మెంట్,స్కాలర్షిప్స్ చెల్లించకపోతే విద్యార్థులు తిరగబడుతారని,బీజేపీ కూడా ఉద్యమిస్తుందని హెచ్చరించారు. పేద విద్యార్థుల పాపం వూరికే పోదని... అడ్రస్ లేకుండా పోతారని ముఖ్యమంత్రి కేసీఆర్కు శాపనార్థాలు పెట్టారు. వరంగల్ కాకతీయ వర్సిటీలో వీసీని నియమించాలని...విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ఉద్యమిస్తున్న ఏబీవీపీ విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జీ చేయడం దారుణమన్నారు సంజయ్. లాఠీ దెబ్బలు,జైళ్లు ఏబీవీపీకి కొత్త కాదన్నారు.