ఎన్నికల నిర్వహణపై కస్సుమన్న కాషాయపార్టీ..! సీఈసీ కి ఫిర్యాదు చేసిన తెలంగాణ బీజేపీ..!!
ఢిల్లీ/ హైదరాబాద్ : తెలంగాణ ముందప్తు ఎన్నికల నిర్వహణపై రోజుకో అసంత్రుప్త గళం వినిపిస్తోంది. ఇటీవల ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితాలో అనేక అవకతవకలు జరిగాయని తెలంగాణ బిజెపి నేతలు గురువారం కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు లక్షలాది ఓట్లను ఎన్నికల కమీషన్ తొలిగించిందని ఈ తొలగింపు అధికార పార్టీకి అనుకూలంగా ఉండే విధంగా జరిగిందని తెలంగాణ బీజేపీ నేతలు ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు, తెలంగాణ అధ్యక్షుడు కే.లక్ష్మణ్ లు మీడియాతో మాట్లాడుతూ ముందస్తు ఎన్నికల్లో ఎన్నో పొరపాట్లు జరిగాయని ఆగ్రహం వ్యక్తం చేసారు.
ఎంఐఎం ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో ఓట్లు పెరిగి... బిజెపి ప్రాబల్యం ఉన్న చోట్ల ఓట్లు తగ్గడం అనుమానాలకు తావిస్తోందన్నారు లక్ష్మణ్. ఓట్ల తొలగింపు విషయంలో పొరపాట్లు దొర్లాయని, అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయారని అంగీకరిస్తూ, రాష్ట్ర ఎన్నికల అధికారి క్షమాపణలు కోరడమే అందుకు నిదర్శనమన్నారు. తాము లేవనెత్తిన అంశాలపై పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని ఎన్నికల కమిషన్ హామీ ఇచ్చిందని తెలిపారు. సాంకేతికత విషయంలో ఎదురయ్యే లోపాలను సరి చేయాలన్నదే బిజెపి ప్రధాన లక్ష్యమని వివరించారు. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల లాగా ఈవీఎంలపై తమకు అనుకూలమైన సందర్భంలో ఒకలాగా, ప్రతికూల సందర్భంలో మరొకలాగా తాము ఎప్పుడూ వ్యాఖ్యానించమని బీజేపీ నేతలు స్పష్టం చేయడం విషేశం..!!