తెలంగాణలో బీజేపీ జోరు ... త్వరలో భారీ చేరికలు ఉంటాయంటున్న లక్ష్మణ్
తెలంగాణా రాష్ట్రంలో బీజేపీ పుంజుకుంటుందా ? అధికార టీఆర్ఎస్ పార్టీ కి బీజేపీ ప్రత్యామ్నాయంగా మారుతుందా ? త్వరలో బీజేపీలో భారీగా చేరికలు ఉంటాయా ? అందుకోసం బీజేపీ అధిష్టానం కసరత్తు ప్రారంభించిందా? అంటే అవును అనే సమాధానమే వినిపిస్తుంది. తెలంగాణా బీజేపీ నాయకులు తెలంగాణలో ఆపరేషన్ కమల ప్రారంభించారు. అందుకోసం రాం మాధవ్ ను రంగంలోకి దింపారు . లోక్ సభ ఎన్నికల్లో నాలుగు స్థానాలు గెలిచిన ఊపు మీద ఉన్న బీజేపీ పార్టీ తెలంగాణా రాష్ట్రంలోని కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ ముఖ్యనేతలను ఆకర్షించే పనిలో పడ్డారు.
లోక్ సభ ఎన్నికల ఫలితాల ప్రభావం .. తెలంగాణలో పాగా వేసే ప్రయత్నంలో బీజేపీ
కేంద్రంలో బీజేపీ తిరుగులేని పార్టీగా అవతరిచింది . మరోమారు అధికారం దక్కించుకుంది. ఇక తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటలేకపోయిన బీజేపీ లోక్ సభ ఎన్నికల్లో మాత్రం నాలుగు స్థానాలు గెలిచి సత్తా చాటింది. ఇక దీంతో బీజేపీలో కొత్త ఉత్సాహం నెలకొంది . పార్టీని బలోపేతం చేస్తే భవిష్యత్ లో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతామనే ఆశలు చిగురించాయి. ఇక ఈ నేపధ్యంలోనే బీజేపీ అధిష్టానం తెలంగాణా రాష్ట్రంపై దృష్టి సారించనుంది అని బీజేపీ శ్రేణులు చెప్తున్నారు. అంతే కాక ఈ సారి లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించిన కిషన్ రెడ్డి కి కేంద్ర మంత్రిగా అవకాశం ఇవ్వటం కూడా పార్టీకి తెలంగాణా రాష్ట్రంలో కలిసి వచ్చే అంశం . తద్వారా తెలంగాణా పట్ల బీజేపీ తన సానుకూల దృక్పధాన్ని చాటుకున్నారు . ఇప్పటికే కేంద్రంలో తిరుగులేని శక్తిగా ఉన్న బీజేపీ ఇప్పుడు రాష్ట్రాలపైన దృష్టి పెట్టింది .
త్వరలో బీజేపీలోకి భారీగా వలసలు అంటున్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్
ఒకపక్క కాంగ్రెస్ నుండి ముఖ్య నేతలైన కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డి వంటి నేతలు బీజేపీపై దృష్టి సారించారు. మరో పక్క టీడీపీ ముఖ్య నేతల్లో సైతం బీజేపీ లో చేరితే రాజకీయ భవిష్యత్ బాగుంటుంది అనే భావన ఉంది. ఇక అధికార టీఆర్ ఎస్ నుండి కూడా కొందరు నేతలు తమతో టచ్ లో ఉన్నారని ధీమాలో ఉన్నారు బీజేపీ నేతలు . ఇక ఈ నేపధ్యంలోనే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలో బీజేపీలో భారీగా చేరికలు జరగనున్నట్టు పేర్కొన్నారు. టీఆర్ఎస్ సహా పలువురు నేతలు తమతో టచ్ లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, ఆయా పార్టీల నేతలు తమ పార్టీలో చేరికలకు ముందు వారు రాజీనామాలు చేస్తారా అన్న విలేకరుల ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, అధిష్ఠానానిదే తుది నిర్ణయమని స్పష్టం చేశారు.
భవిష్యత్ లో తెలంగాణలో ప్రత్యామ్నాయం తామే అంటున్న బీజేపీ
ఇక బీజేపీ తెలంగాణలో బలమైన రాజకీయ పార్టీగా మారటానికి కసరత్తులు ప్రారంభించింది. లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ శ్రేణుల్లో ప్రత్యామ్నాయం అవుతామనే కాన్ఫిడెన్స్ వచ్చింది. అటు అధిష్టానం దృష్టి కూడా నాలుగు లోక్ సభ స్థానాలు సాధించటంతో తెలంగాణా మీద పడింది. అందుకే భవిష్యత్ లో తెలంగాణలో బీజేపీనే ప్రత్యామ్నాయం అనే భావన మొదలైంది.