ఎలాన్ మస్క్ చుట్టూ తెలంగాణ రాజకీయాలు: టెస్లా చీఫ్కు తీన్మార్ మల్లన్న ట్వీట్: గరంగరం
హైదరాబాద్: ఎలాన్ మస్క్.. కార్పొరేట్ సెక్టార్కు పరిచయం అక్కర్లేని పేరు. అపర కుబేరుడు. అంతరిక్ష పరిశోధనల కోసం స్పేస్ ఎక్స్ పేరుతో ప్రైవేట్ కంపెనీని ఏర్పాటు చేశారంటే ఆయన స్థాయి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. విశ్వంలోకి రాకెట్లను పంపించే ఏకైక ప్రైవేట్ సంస్థ ఇదొక్కటే. విద్యుత్ ఆధారంగా నడిచే కార్లను తయారు చేస్తోన్న టెస్లా మోటార్స్ అధినేత. అమెరికా టెక్సాస్లోని ఆస్టిన్ ప్రధాన కేంద్రంగా టెస్లా కార్లు రూపుదిద్దుకుంటోన్నాయి.
ఎలాన్ మస్క్ చుట్టూ తెలంగాణ రాజకీయాలు..
తెలంగాణతో.. ఆ మాటకొస్తే భారత్తో ఏ మాత్రం సంబంధం లేని ఎలాన్ మస్క్- ఇక్కడి రాజకీయాలకు కేంద్రబిందువు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్-భారతీయ జనతా పార్టీ నాయకులు పరస్పరం విమర్శలు చేసుకోవడానికి, ఆరోపణలు- ప్రత్యారోపణలను సంధించుకోవడానికి ఎలాన్ మస్క్ సెంటర్ ఆఫ్ ద పాయింట్గా మారారు. టీఆర్ఎస్ ఓ విఫల ప్రభుత్వం అంటూ ఎలాన్ మస్క్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోన్నారు బీజేపీ నాయకులు.
కేటీఆర్ చేసిన ట్వీట్తో..
టెస్లా కార్ల షోరూమ్ను తెలంగాణలో ఏర్పాటు చేయాలని, పెట్టుబడులు పెట్టాలంటూ ఎలాన్ మస్క్ను ఆహ్వానిస్తూ కేటీఆర్ చేసిన ట్వీట్ను ఈ వివాదానికి ఆధారమైంది. తాను తెలంగాణ పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రినని కేటీఆర్ పరిచయం చేసుకున్నారు. టెస్లా కారు టెస్టింగ్ డ్రైవ్ చేసిన ఫొటోలను జత చేస్తూ మరో ట్వీట్ చేశారు. తెలంగాణలో షోరూమ్ను నెలకొల్పాలని కేటీఆర్.. ఎలాన్ మస్క్కు విజ్ఞప్తి చేశారు. కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.
అన్ని రకాలుగా సహకరిస్తాం..
ఎలాన్ మస్క్ ఆసక్తి చూపితే.. ప్రభుత్వం తరఫున ఆయనకు అన్ని రకాలుగా సహకరిస్తాని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. పెట్టుబడులు పెట్టడానికి, పరిశ్రమలను నెలకొల్పడానికి తెలంగాణలో అనుకూల వాతావరణం, ప్రభుత్వం ఉందని చెప్పారు. పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడులు, సుస్థిరతలో తమ రాష్ట్రం ఛాంపియన్గా నిలిచిందని కేటీఆర్ ఈ ట్వీట్లో స్పష్టం చేశారు. కేటీఆర్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు రాజకీయ రంగు పులుముకొంది.
కేటీఆర్ ట్వీట్కు కౌంటర్..
ఈ ట్వీట్ మీద తీన్మార్ మల్లన్న ఓ పోల్ నిర్వహించారు. పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడులు, సుస్థిరత విషయాల్లో తెలంగాణ ఛాంపియన్ అంటున్న కేటీఆర్ మాటలు నిజమేనా..? అని ప్రశ్నిస్తూ ఈ పోల్ను పెట్టారు. దీనికి నిజమే, పచ్చి అబద్ధం అనే రెండు సమాధానాలను ఆప్షన్లను ఇచ్చారు. ఈ పోల్ ఫలితాలను తీన్మార్ మల్లన్న ప్రకటించారు. నిజమే అంటూ 19 శాతం మంది సమాధానం ఇచ్చారు. పచ్చి అబద్ధం అంటూ 81 మంది ఓటు వేశారు.
ఎలాన్ మస్క్కు పోల్ రిజల్ట్
ఈ పోల్ రిజల్ట్ను తీన్మార్ మల్లన్న.. ఎలాన్ మస్క్కు ట్విట్టర్ ద్వారా పంపించారు. మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ వెనుక వాస్తవాన్ని గ్రహించండి.. అని విజ్ఞప్తి చేశారు. 33 వేల మంది పాల్గొన్న ఈ ఒపీనియన్ పోల్ ఫలితాలు ఇవీ అంటూ ఆయనకు వివరించారు. #KTRFailedMinister అనే హ్యాష్ట్యాగ్ను దానికి జత చేశారు. మంత్రి కేటీఆర్ ఫెయిల్యూర్ అంటూ విమర్శించారు. తెలంగాణ పెట్టుబడులకు అనుకూలం కాదనే సందేశాన్ని తీన్మార్ మల్లన్న పరోక్షంగా ఎలాన్ మస్క్కు తెలియజేసినట్టయింది.
నెటిజన్లు ఫైర్..
ఎలాన్ మస్క్ను ట్యాగ్ చేస్తూ తీన్మార్ మల్లన్న చేసిన ఈ ట్వీట్ పట్ల నెటిజన్లు మండిపడుతున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి, రాజకీయాలకు సంబంధం లేదని స్పష్టం చేస్తోన్నారు. కేటీఆర్ మీద కోపం ఉంటే.. ఆయనతో తేల్చుకోవాలే గానీ తెలంగాణను కించపరచడం సరికాదంటూ హితవు పలుకుతున్నారు. తెలంగాణను బాగు చేయడానికి ప్రయత్నం చేయాలని ఇలాంటివి పోల్స్ పెట్టడం వల్ల ప్రజల్లో చులకన అవుతున్నారని విమర్శిస్తున్నారు.