బీసీలకు టీఆర్ఎస్ వెన్నుపోటు..! లోకల్ బాడీ ఎన్నికలు ఆపండి.. గవర్నర్కు బీజేపీ నేతల వినతి
హైదరాబాద్ : స్థానిక సంస్థల సమరానికి సై అంటోంది అధికార టీఆర్ఎస్ పార్టీ. ఆ మేరకు షెడ్యూల్ కూడా విడుదల చేసింది ఎన్నికల సంఘం. అయితే బీజేపీ నేతలు ఎన్నికలు నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ కలవడం హాట్ టాపికయింది. బీసీల ఓట్లతో గద్దెనెక్కిన టీఆర్ఎస్.. అదే బీసీలకు వెన్నుపోటు పొడవాలని చూడటం దారుణమంటున్నారు కమలనాథులు. బీసీ రిజర్వేషన్లపై ఎలాంటి అధ్యయనం చేయకుండా.. లోకల్ బాడీ ఎలక్షన్లకు రిజర్వేషన్లు ప్రకటించిందని మండిపడ్డారు.
స్థానిక సంస్థల ఎన్నికలు ఆపండి..!
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి టీఆర్ఎస్ ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తోందని ఫైరయ్యారు రాష్ట్ర బీజేపీ నేతలు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు తగ్గించిందని మండిపడ్డారు. ఆ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తో పాటు సీనియర్ నేతలు బండారు దత్తాత్రేయ, కిషన్ రెడ్డి తదితరులు.. గవర్నర్ నరసింహన్ తో భేటీ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలను నిలిపివేయాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బీసీలకు సీఎం కేసీఆర్ అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.
బీసీలకు అన్యాయం.. టీఆర్ఎస్ తీరిదేనా?
కొత్త పంచాయతీ రాజ్ చట్టంలో పేర్కొన్నవిధంగా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు బీజేపీ నేతలు. ఆ మేరకు బీసీ రిజర్వేషన్లపై టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, లీడర్లు నోరు విప్పాలని కోరారు. ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తామంటూ ఎక్కడా లేని ప్రేమ ఒలకబోస్తున్న కేసీఆర్.. బీసీలకేమో అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు.
కేసీఆర్ తుగ్లక్ లా వ్యవహరిస్తూ.. బీసీల రిజర్వేషన్లకు గండికొడుతున్నారని ఫైరయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు కుదించడం అన్యాయమని అన్నారు. రాష్ట్రమంతటా 32 జడ్పీ ఛైర్మన్లకు గాను బీసీలకు కేవలం 6 మాత్రమే కేటాయించడమేంటని ప్రశ్నించారు. 13 స్థానాలు కేటాయించాలని డిమాండ్ చేశారు.
వివాదంలో ఎమ్మెల్యే 'రాజాసింగ్' పాట.. ''హిందుస్తాన్ జిందాబాద్'' ట్యూన్ మాదంటున్న పాక్
ఎంపీటీసీ స్థానాల్లోనూ బీసీలకు కోతే
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణను టీఆర్ఎస్ ప్రభుత్వం తొందరపాటు చర్యగా అభివర్ణించారు బీజేపీ నేతలు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించినట్లే.. ఎలాంటి మార్పులు లేకుండా కంటిన్యూ చేయడమేంటని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా 1,070 ఎంపీటీసీ స్థానాలు బీసీలకు రిజర్వ్ చేయాల్సి ఉండగా.. కేవలం 200 స్థానాలు కేటాయించి చేతులు దులుపుకుంటారా అని ప్రశ్నించారు.
జడ్పీ ఛైర్మన్ పదవికి ప్రత్యక్ష ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు. రాజకీయ దురుద్దేశంతో స్థానిక సంస్థలను హడావిడిగా నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వం తొందరపడుతోందని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్ల లెక్క తేల్చకుండా ముందుకెళ్లడం దారుణమని వ్యాఖ్యానించారు. గవర్నర్ జోక్యం చేసుకుని స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు బ్రేక్ వేసేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు.