తెలంగాణ ముస్లిం రాష్ట్రంగా..ఏపీ క్రైస్తవ రాజ్యంగా: కేసీఆర్, జగన్పై బీజేపీ ఫైర్బ్రాండ్
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిలపై భారతీయ జనతా పార్టీ నిప్పులు కురిపిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన నిరర్థక ఆస్తుల విక్రయాల వ్యవహారంలో జగన్ సర్కార్పై కత్తులు నూరుతోన్న బీజేపీ ఏపీ నాయకులకు తెలంగాణ రాష్ట్రశాఖ నాయకులు కూడా తోడయ్యారు. టీటీడీ ఆస్తుల విక్రయాన్ని అడ్డుగా పెట్టుకుని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై ఘాటు విమర్శలతో విరుచుకుపడుతున్నారు.
భార్య ఒంటి నిండా ఆభరణాలు: సొంతం చేసుకోవడానికి భారీ స్కెచ్: పాములతో కాటు: యూట్యూబ్లో
ఒకరు ముస్లిం రాష్ట్రంగా.. ఇంకొకరు క్రైస్తవ రాజ్యంగా..
ఇద్దరు ముఖ్యమంత్రులు తమ తమ రాష్ట్రాల నుంచి హిందువులను తరిమికొట్టాలనే కృతనిశ్చయంతో పని చేస్తున్నట్లు కనిపిస్తోందని తెలంగాణ బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు, కరీంనగర్ లోక్సభ సభ్యుడు బండి సంజయ్ విమర్శించారు. హిందువులు లేని రాష్ట్రాలుగా మార్చడానికి కేసీఆర్, వైఎస్ జగన్ కష్టపడుతున్నారని ఆరోపించారు. తెలంగాణను ముస్లిం రాష్ట్రంగా మార్చడానికి కేసీఆర్ శతవిధాలా ప్రయత్నిస్తున్నారని, అదే సమయంలో ఏపీని క్రైస్తవుల రాజ్యంగా తీర్చిదిద్దాడానికి వైఎస్ జగన్ కంకణం కట్టుకున్నారని మండిపడ్డారు.
రాజకీయ కీచకుల్లా..
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాజకీయ కీచకుల్లా తయారయ్యారని బండి సంజయ్ విమర్శించారు. వారి నుంచి హిందూ ఆలయాలను పరిరక్షించుకుంటామని అన్నారు. హిందువుల శక్తి సామర్థ్యాలు ఏమిటో తెలియజేస్తామని హెచ్చరించారు. ఇద్దరు ముఖ్యమంత్రులకు హిందుత్వ సత్తాను చూపిస్తామని అన్నారు. తెలంగాణలో కేసీఆర్ను ఏపీలో వైఎస్ జగన్ను రాజకీయంగా సమాధి చేస్తామని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.
పోరుబాట కొనసాగిస్తాం..
రెండు తెలుగు రాష్ట్రాల్లో హిందూ ధర్మాన్ని, హైందవ ఆలయాలను పరిరక్షించుకోవడానికి నిరంతర పోరాటాన్ని కొనసాగిస్తామని అన్నారు. దీనికోసం ఏపీ బీజేపీ నాయకులకు తమవంతు సహకారాన్ని అందిస్తామని చెప్పారు. కోట్లాది మంది హిందువుల మనోభావాలు కించపరిచేలా వ్యవహరిస్తోన్న కేసీఆర్, వైఎస్ జగన్ వంటి హిందూ వ్యతిరేక రాజకీయ శక్తులను తరిమి కొట్టే రోజులు ఎంతో దూరం లేవని అన్నారు. మతోన్మాదుల కుట్రలను ఎదుర్కొనడానికి హిందువులంతా ఐక్యంగా ఉద్యమించాలని, వారికి తాము అండగా ఉంటామని చెప్పారు.
టీటీడీ ఆస్తులను అమ్మి.. పాస్టర్లకు జీతాలు..
కోట్లాదిమంది హిందువుల మనోభావాలతో ముడిపడి ఉన్న తిరుమల వేంకటేశ్వర స్వామివారి ఆస్తులను విక్రయించడానికి టీటీడీ చేస్తోన్న ప్రయత్నాలను బండి సంజయ్ తప్పు పట్టారు. టీటీడీ ఆస్తుల ఆమ్మకంతో వచ్చిన ఆదాయాన్ని చర్చిల నిర్మాణానికి ఖర్చు చేయాలనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. ఆ ఆదాయంతో పాస్టర్ల జీతాలు ఇవ్వాలనుకుంటున్నారా అని ఆయన ఏపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆస్తులను అమ్మాలనుకునే జగన్ సర్కారు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. శ్రీవారి భక్తులతో పాటు హిందూ బంధువులతో కలిసి సంఘటితంగా ఉద్యమిస్తామని అన్నారు.