కేసీఆర్ వెన్నులో వణుకు మొదలైంది.. బండి సంజయ్ ధ్వజం
టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ నేత బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. తెలంగాణలో స్థానిక ప్రజాప్రతినిధుల పరిస్థితి దారుణంగా మారిందన్నారు. ఎన్నికలు ఉంటేనే సీఎం కేసీఆర్కు స్థానిక ప్రజాప్రతినిధులు గుర్తుకొస్తారని తెలిపారు. స్థానిక సంస్థల అభివృద్ధికి ఒక్క పైసా కేటాయించలేదని దుయ్యబట్టారు. ఆయన శనివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.
రైతు వేదిక, శ్మశానవాటిక, ట్రాక్టర్లకు కేంద్రమే నిధులిస్తోందని బండి సంజయ్ తెలిపారు. జైలుకు పంపొద్దని కేంద్రం దగ్గర కేసీఆర్ పొర్లుదండాలు పెడుతున్నారని ఎద్దేవాచేశారు. కేసీఆర్.. ఆయన కుటుంబాన్ని విడిచిపెట్టేది లేదని బండి సంజయ్ హెచ్చరించారు. బుద్ధి ఉన్నవారెవరూ టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోరని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని బండి సంజయ్ అన్నారు.
టీఆర్ఎస్ నుంచి 30 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని బండి సంజయ్ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఒకరోజులో ఆ సంఖ్య 60కి చేరింది. ఆ స్థాయిలో ఎమ్మెల్యేలు పార్టీ మారుతారనే ప్రచారం చర్చకు దారితీసింది. దీనిపై అధికార టీఆర్ఎస్ స్పందించలేదు. కానీ బండి సంజయ్ మరోసారి నేతలు రెడీ అని సంకేతాలు ఇచ్చారు.