కేటీఆర్కు షాకిచ్చిన ఫలితాలు, ప్రజలు తేల్చేశారు: బేరసారాలంటూ బీజేపీ లక్ష్మణ్ విమర్శలు
హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి భవిష్యత్ ఉందని రాష్ట్ర ప్రజలు చెప్పారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో లక్ష్మణ్ మీడియాతో శనివారం సాయంత్రం మాట్లాడారు. బీజేపీ అభ్యర్థులు డబ్బులు ఖర్చు పెట్టకుండా పోటీ చేశారని చెప్పారు.
టీఆర్ఎస్ అధికార దుర్వినియోగం..
టీఆర్ఎస్ సర్కారు అధికారాన్ని దుర్వినియోగం చేశారని లక్ష్మణ్ ఆరోపించారు. ఓటర్ లిస్టు నమోదు నుంచి మొదలుకుంటే ఎన్నికల వరకు అధికార దుర్వినియోగానికి పాల్పడిందని బీజేపీ నేత లక్ష్మణ్ మండిపడ్డారు. ఈ విషయంలో ఎన్నికల కమిషన్ కూడా నిస్సహాయతను వ్యక్తం చేసిందన్నారు. ఇంత ఖరీదైన ఎన్నికలు ఎక్కడా చూడలేదని లక్ష్మణ్ అన్నారు.
బీజేపీకి మంచి ఫలితాలు
మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలు సాధించిందని లక్ష్మణ్ తెలిపారు. సొంతంగా 3 మున్సిపాలిటీల్లో గెలిచామని చెప్పారు. కొన్ని మున్సిపాలిటీల్లో అత్యధిక స్థానాలు సాధించామన్నారు. ఆమంగల్, తుక్కుగూడ, మక్తల్, నారాయణపేట్, మీర్ పేట్ర, నిజాంపేట్, నిజామాబాద్లో అధిక సీట్లు సాధించామన్నారు. రామంగుండంలో కీలకంగా ఉన్నట్లు లక్ష్మణ్ తెలిపారు.
టీఆర్ఎస్ బేరసారాలు..
అధికార టీఆర్ఎస్ పార్టీ గెలిచామనుకుంటున్నారు.. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్సీల ఓట్లతో గెలిచే పరిస్థితి ఉందన్నారు. కొల్లాపూర్, ఐజ, బడంగ్ పేట్.. 30చోట్ల కావాల్సిన సంఖ్యను టీఆర్ఎస్ సాధించలేకపోయిందన్నారు. ఇప్పుడు ఆ చోట్లలో టీఆర్ఎస్ బేరసారాలు సాగిస్తోందన్నారు. కేసీఆర్, కేటీఆర్ తమ పనితీరుకు ఫలితాలు అద్దంపడతాయన్నారు.. స్వీప్ చేస్తుందననారు.. కానీ అలా ఏం జరగలేదని లక్ష్మణ్ అన్నారు.
మంత్రి కేటీఆర్ ఇలాకాలోనే షాక్..
మంత్రి కేటీఆర్ ఇలాకా సిరిసిల్లోనే బీజేపీ 4 సీట్లు గెల్చుకుందని లక్ష్మణ్ తెలిపారు. అంతేగాక, 10స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు గెలిచారని చెప్పారు. ఇక మీరు ఎక్కడ స్వీప్ చేశారని కేటీఆర్ను ప్రశ్నించారు. సిరిసిల్లలో సగం సీట్లు కూడా గెలవలేకపోయారన్నారు. సిరిసిల్లలోనే టీఆర్ఎస్ రెబల్స్ గెలవడం సిగ్గుచేటన్నారు. ఇంత డబ్బు ఖర్చు పెట్టి.. ఓట్లు కొనుగోలు చేసినా ఇంత దారుణంగా టీఆర్ఎస్ పరిస్థితి ఉందన్నారు లక్ష్మణ్. కాగా, శనివారం మున్సిపల్ ఎన్నికలు ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. అధికార టీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది.