కరోనా : వెయ్యి మార్క్ దాటిన తెలంగాణ.. కొత్తగా 11 పాజిటివ్ కేసులు
గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా మరో 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1001కి చేరింది. దేశంలో కరోనా కేసుల్లో వెయ్యి మార్క్ దాటిన 9వ రాష్ట్రం తెలంగాణ కావడం గమనార్హం. తాజాగా నమోదైన కొత్త కేసులన్నీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ ఆదివారం సాయంత్రం వెల్లడించింది.
కరోనా పేషెంట్లలో ఆదివారం(ఏప్రిల్ 26)న మరో 9 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది. ఇందులో ఓ 75 ఏళ్ల వృద్దుడు కూడా ఉండటం గమనార్హం. మొత్తంగా ఇప్పటివరకూ316 మంది కరోనా నుంచి కోలుకోగా.. ప్రస్తుతం 660 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి.
జిల్లాలవారీగా పరిశీలిస్తే.. ఇప్పటివరకూ హైదరాబాద్లో 540,సూర్యాపేటలో 83,నిజామాబాద్లో 61,వికారాబాద్లో 37,గద్వాల్లో 45 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ మొత్తం 25 మంది కరోనా కారణంగా మృత్యువాతపడగా.. ఇందులో హైదరాబాద్లోనే 18 మంది మృతి చెందారు.
గద్వాల్లో ఒకరు,రంగారెడ్డిలో ఇద్దరు,మహబూబాబాద్,మంచిర్యాలలో ఒక్కరు చొప్పున మృతి చెందారు. వనపర్తి, యాదాద్రి, వరంగల్ రూరల్ జిల్లాలు కరోనా ఫ్రీ ప్రాంతాలుగా ఉన్నాయి. సిద్దిపేట,మహబూబాబాద్,మంచిర్యాల,నారాయణపేట్ జిల్లాల్లో ఒక్కో పాజిటివ్ కేసు మాత్రమే నమోదైంది.
మరోవైపు లాక్ డౌన్ అమలు, జరుగుతున్న సహాయక కార్యక్రమాలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో లాక్ డౌన్ అమలు తీరుపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. మరికొద్ది రోజులు ప్రజలు లాక్ డౌన్ కు సహకరించి, కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలు పాటిస్తే పరిస్థితి మరింత మెరుగవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సోమవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశ పరిస్థితి ఏమిటన్న దానిపై ఒక అవగాహన వస్తుందన్నారు.