TS Budget 2020-21 : బడ్జెట్లో హైదరాబాద్ అభివృద్దికి ఎన్ని నిధులు కేటాయించారంటే..
అంతర్జాతీయ నగరంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ నగర అభివృద్ది కోసం రాష్ట్ర ప్రభుత్వం కోరిన నిధులకు కేంద్రం మొండిచెయ్యి చూపిందన్నారు ఆర్థికమంత్రి హరీష్ రావు. దేశంలోని మొత్తం 6 మెట్రో నగరాలకు నిధుల కోసం కేంద్రం వద్దకు ప్రతిపాదనలు వెళ్లగా.. ఏ ఒక్క నగరానికి కేటాయింపులు జరగలేదన్నారు. వచ్చే ఐదేళ్లలో హైదరాబాద్ను అంతర్జాతీయ నగంగా తీర్చిదిద్దేందుకు రూ.50వేల కోట్లు అవసరమని అంచనా వేసినట్టు తెలిపారు. తాజా బడ్జెట్లో హైదరాబాద్,దాని పరిసర ప్రాంతాల అభివృద్ది,మూసీ ప్రక్షాళన,మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ కోసం రూ.10వేల కోట్లు కేటాయిస్తున్నట్టు చెప్పారు.
Telangana Budget 2020: బడ్జెట్ అంటే గణాంకాలు కావు.. గట్టిగా కోత పడింది.. ప్రసంగంలో హరీష్రావు
ప్రపంచంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరాల్లో హైదరాబాద్ అగ్ర స్థానంలో ఉందని హరీష్ రావు తెలిపారు. సమైక్య పాలకుల అస్తవ్యస్థ విధానాలతో జనాభా పెరుగుదలకు తగ్గ మౌలిక వసతుల కల్పన జరగలేదన్నారు. హైదరాబాద్లో చేపట్టిన పోలీస్ కమాండ్ కంట్రోల్ నిర్మాణం త్వరలోనే పూర్తవుతుందని చెప్పారు.
కొత్తగా రాయదుర్గం-శంషాబాద్,బీహెచ్ఈఎల్-లక్డీకపూల్ మెట్రో నిర్మాణానికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్టు చెప్పారు. ఇక నగరంలో ప్రస్తుతం ఉన్న 118 బస్తీ దవాఖానాల సంఖ్యను 354కి పెంచుతున్నట్టు చెప్పారు. కొత్తగా 232 బస్తీ దవాఖాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ప్రతీ డివిజన్కు రెండు బస్తీ దవాఖానాలు ఉండేలా చర్యలు చేపట్టనున్నామని.. ఎస్సీ,ఎస్టీ,పేదలు ఎక్కువగా ఉండే బస్తీల్లో మూడు బస్తీ దవాఖానాల ఏర్పాటును కూడా పరిశీలిస్తున్నామని చెప్పారు.
తడి,పొడి చెత్త కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని పట్టణాలు,నగరాల్లో వైకుంఠ ధామాలు,ఆట స్థలాలు,ఓపెన్ జిమ్స్,ఆటో స్టాండ్స్ ఏర్పాటు కోసం భూసేకరణ చేస్తున్నట్టు చెప్పారు. ఇందుకోసం మున్సిపల్ శాఖకు రూ.14809కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు.