కరోనాపై కేసీఆర్: రాష్ట్రంలో ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాలే, వైరస్ రాదని శాస్త్రవేత్త చెప్పాడు..
తెలంగాణ రాష్ట్రంలో ఒక్క కరోనా వైరస్ నమోదు కాలేదని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై కేసీఆర్ మాట్లాడారు. రాష్ట్రంపై కరోనా వైరస్ ప్రభావం లేదని స్పష్టంచేశారు. చైనాలో పుట్టిన వ్యాధి.. క్రమంగా ఇతర దేశాలకు వ్యాపిస్తోందని పేర్కొన్నారు. 135 కోట్ల మంది ఉన్న దేశంలో 33 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని చెప్పారు. దుబాయ్ నుంచి వచ్చిన ఒకరి వల్ల తెలంగాణ రాష్ట్రంలో పాజిటివ్ కేసు నమోదైందని పేర్కొన్నారు.
Recommended Video
ఇలా సోకింది..
విదేశం నుంచి వచ్చిన వ్యక్తికి వైరస్ సోకిందే తప్ప.. తెలంగాణ రాష్ట్రంలో ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాలేదని చెప్పారు. సింగిల్ మనిషికి వ్యాధి సోకలేదని.. ఒకవేళ ఎవరికైనా సోకితే వెయ్యి కోట్లు ఖర్చుపెట్టి తరిమికోడతామని చెప్పారు. అవసరమైతే అసెంబ్లీ సమావేశాలను కూడా రద్దుచేసి.. నియోజకవర్గాలకు పరిమితం అవుతామని పేర్కొన్నారు.
సైంటిస్ట్ ఏం చెప్పాడంటే..
కరోనా వైరస్ గురించి తనకో శాస్త్రవేత్త ఫోన్ చేశారని కేసీఆర్ చెప్పారు. జ్వరానికి వాడే పారాసెటమల్ వేసుకుంటే వైరస్ తగ్గిపోతుందని పేర్కొన్నారు. తెలంగాణలో వైరస్ ప్రబలే అవకాశం లేదని చెప్పారు. కరోనా వైరస్ చల్లని వాతావరణంలో డెవలప్ అవుతోందని.. 22 డిగ్రీల టెంపరేచర్ ఉంటే చనిపోతుందని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పుడు 30 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోందని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో కరోనా వైరస్ రాదని తేల్చిచెప్పారు.
అపోహలు వద్దు
వైరస్పై అపోహలు వద్దు అని సీఎం కేసీఆర్ సూచించారు. తప్పుడు ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. ఎవరూ మాస్క్ పెట్టుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. వైద్యారోగ్యశాఖా మంత్రి కూడా మాస్క్ పెట్టుకోలేదని చెప్పారు. రాష్ట్రంలో వైరస్ రాలేదని.. ఒకవేళ వచ్చిన తరిమికొట్టేందుకు పోరాడుతామని చెప్పారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి కూడా కోలుకుంటున్నాడని కేసీఆర్ వివరించారు.
అసత్య ప్రచారం వద్దు..
కొందరు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వైరాలో వచ్చిందని కొందరు, మిగతాచోట్ల వచ్చిందని.. సోషల్ మీడియాలో ప్రచారం చేసి ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని చెప్పారు. వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని సభకు సీఎం కేసీఆర్ తెలియజేశారు.