Telangana Budget: బడ్జెట్ ప్రజలను భ్రమల్లోకి నెట్టింది, అంకెలతో హరీశ్రావు గారడీ: భట్టి విక్రమార్క
తెలంగాణ బడ్జెట్ ప్రజలను భ్రమల్లోకి నెట్టిందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. బడ్జెట్ వాస్తవానికి దగ్గర లేదని విమర్శించారు. హరీశ్ రావు అంకెల గారడీతో ప్రజలను మోసం చేశారన్నారు. ప్రతీసారి అంకెలతో మాయ చేస్తున్నారని మండిపడ్డారు. బడ్జెట్ వృద్ధి అంచనాలు కూడా తప్పుగా చూపించారని ధ్వజమెత్తారు. బడ్జెట్ గ్రోత్ కేవలం 15 శాతం అని.. కానీ 2019లో 24 శాతం చూపించారని గుర్తుచేశారు. లేని విషయాన్ని ఉన్నట్టు ఎలా చూపిస్తారు అని ప్రశ్నించారు. 2020-2021 బడ్జెట్ మైనస్ 24 శాతం అని భట్టి విక్రమార్క విరుచుకుపడ్డారు.
దేశంలో ఆర్థిక సంక్షోభం ఉందని ఆర్థికమంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. అలాంటప్పుడు గ్రోత్ 26 శాతం ఎలా చూపిస్తారు అని ప్రశ్నించారు. ఆర్థిక మాంద్యం ఉంటే గ్రోత్ లేనట్టే.. మరీ వృద్ధి ఎలా సాధ్యం అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆర్థికమాంద్యం ఉందా..? గ్రోత్ ఉందో క్లారిటీ ఇవ్వాలని నిలదీశారు. పనిలోపనిగా మంత్రి జగదీశ్ రెడ్డిపై కూడా విరుచుకుపడ్డారు. మునుగోడు ఎమ్మెల్యే సీటు ఖాళీ అవుతోందని అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రి స్థానంలో ఉండి జగదీశ్ రెడ్డి కుట్రదారునిగా వ్యవహరించడం సరికాదని హితవు పలికారు.
తెలంగాణ ఆర్థికమంత్రి హరీష్ రావు రాష్ట్ర బడ్జెట్ 2020-21ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక ప్రవేశపెట్టిన పూర్తి స్థాయి బడ్జెట్ ఇదే కావడం గమనార్హం. మార్చి 9న హోలీ పండుగ కావడంతో ఒకరోజు ముందుగానే బడ్జెట్ను ప్రవేశపెట్టారు. మొత్తం 1,82,914.42కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్లో సంక్షేమ పథకాల కేటాయింపులకు పెద్ద పీట వేశారు. రెవెన్యూ వ్యయం 1,38,669కోట్లుగా పేర్కొన్నారు. రాష్ట్ర జీఎస్డీపీ 12.6శాతానికి పడిపోయిందని చెప్పారు.