ఎన్నికలు ముగిసాయి.. ఇక మిగిలిన టార్గెట్ అదే.. మంత్రి హరీష్రావు కీలక వ్యాఖ్యలు
తెలంగాణ ప్రభుత్వం 2020-21 సంవత్సరానికి ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ సందర్భంగా ఆర్థిక మంత్రి హరీష్రావు భావోద్వేగంతో ప్రసంగం చేశారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ లాంటి వ్యాఖ్యలతోపాటు పేద ప్రజలు, రైతులు గురించి ప్రస్తావిస్తూ తనదైన శైలిలో బడ్జెట్ ప్రసంగాన్ని ముగించి ఆకట్టుకొన్నారు. మంత్రి హారీష్ రావు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా బడ్జెట్ ప్రసంగం ముగింపు సందర్భంగా..
ప్రభుత్వంపై సంపూర్ణ విశ్వాసం
గ్రామ స్థాయి నుంచి పార్లమెంట్ వరకు అన్ని రకాల ఎన్నికలు పూర్తయ్యాయి. ప్రతీ ఎన్నిక సందర్భంలో ప్రజలు ప్రభుత్వం మీద సంపూర్ణ విశ్వాసాన్ని కనబరిచారు. సంక్షేమం విషయంలో తాము ఎంచుకొన్న బాట పరైందని, అమలు చేస్తున్న వ్యూహాలు సఫలమవుతున్నాయని ప్రజా తీర్పు స్పష్టం చేసింది అని హరీష్ రావు అన్నారు.
నాలుగేళ్ల భవిష్యత్ను దృష్టిలో
2020-21 బడ్జెట్ కేవలం వార్షిక బడ్జెట్ అనే దృక్ఫథంతో కాకుండా, వచ్చే నాలుగేళ్ల భవిష్యత్ను కూడా దృష్టిలో పెట్టుకొని అభివృద్ది ప్రణాళికా రచన జరిగింది. ప్రజల అవసరాలు, ప్రాధాన్యతలపై స్పష్టమైన అవగాహన ఈ బడ్జెట్లో రూపొందించబడింది అని హరీష్ ప్రసంగంలో పేర్కొన్నారు.
ఆర్థిక మాంద్యం వెంటాడుతున్నా..
ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఆర్థిక మాంద్యం వెంటాడుతున్నా నిధులలో ఎక్కడా కోత విధించలేదు. అంతేకాకుండా సంక్షేమ పథకాల లబ్దిదారుల సంఖ్యను పెంచే నిర్ణయాలను ప్రభుత్వం ప్రస్తుత బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నది. దీంతో తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల అభ్యున్నతి కోసం ఎంతటి నిబద్ధతతో ఉందో ఈ బడ్జెట్ చాటి చెప్పింది అని హరీష్ తెలిపారు.
సభ ఆమోదం కోసం
ప్రస్తుత బడ్జెట్ పూర్తిగా ప్రజలే ఆశయాలు, ఆకాంక్షలు దృష్టిలో పెట్టుకొని రూపొందించిన బడ్జెట్ ప్రతిపాదనలను సభ ఆమోదం కోసం ప్రవేశపెడుతున్నాను అని హరీష్ రావు ప్రసంగాన్ని ముగించారు. దాంతో అధికార సభ్యులు భారీగా బడ్జెట్కు మద్దతు తెలిపారు. బడ్జెట్ ప్రసంగం అనంతరం అసెంబ్లీని వాయిదా వేశారు.