మహిళా దినోత్సవం నాడే బడ్జెట్.. ఆడపడుచులకు కేసీఆర్ ఏమిచ్చాడంటే..
ప్రపంచమంతా మహిళా దినోత్సవ సంబురాల్లో ముగినిపోయినవేళ తెలంగాణ బడ్జెట్ లో మహిళా రంగానికి కేటాయింపులపై ఆసక్తినెలకొంది. 2020-21 ఏడాదికిగాను ఆర్థిక మంత్రి హరీశ్ రావు ఆదివారం అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. మహిళా దినోత్సవం, మహిళాసాధికారతపై అంబేద్కర్ మాటలను కోట్ చేస్తూ.. రాష్ట్రంలో మహిళల కోసం కేసీఆర్ సర్కారు ఏం చేస్తున్నదో హరీశ్ వివరించారు. ఇతర శాఖలతో ముడిపడిఉన్న అంశాలను పక్కనపెడితే, పదవులు, ఉద్యోగాల్లో మహిళలకు రిజర్వేషన్ల కల్పనతో తెలంగాన దేశానికి ఆదర్శంగా నిలిచింది. అయితే ప్రత్యేకంగా మహిళల కోసమంటూ అతికొద్ది మొత్తాన్ని మాత్రమే కేటాయించడం గమనార్హం. బడ్జెట్ ప్రసంగంలో మహిళా శిశు సంక్షేమానికి కేటాయింపులపై మంత్రి ఏం చెప్పారంటే..
అంబేద్కర్ బాటలో..
‘‘నేడు మహిళా దినోత్సవం. ఒక సమాజ వికాసానికి నిజమైన కొలమానం.. ఆ సమాజంలోని మహిళాభివృద్ధి స్థాయి మాత్రమేనని అంబేద్కర్ మహాశయుడు చెప్పారు. ఆయన మాటలు మననం చేసుకుంటూ మహిళా లోకానికి ప్రభుత్వం తరఫున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళల వికాసానికి, భద్రతతకు, వారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు కేసీఆర్ సర్కారు అనేక ఆదర్శనీయ నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తున్నది. ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా గర్భిణులకు, బాలింతలకు, శిశువులులకు ప్రతి రోజు పాలు, గుడ్లతో కూడిన పోషకాహారాన్ని ప్రభుత్వం అందిస్తున్నది. గర్భిణి స్త్రీలు ఆస్పత్రులకు వచ్చిపోడానికి అమ్మఒడి వాహనాల ద్వారా ఉచిత రవాణా సదుపాయాన్ని కల్పించాం. కేసీఆర్ కిట్స్ తో గర్భిణులకు ఆర్థికంగా సాయం అందిస్తున్నాం.
దేశంలోనే రికార్డు..
ప్రస్తుతం దేశంలో ఎక్కడాలేని విధంగా వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు, పోలీస్ ఉద్యోగ నియామకాల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తోన్న ఏకైక రాష్ట్రం తెలంగాణే. అలాగే, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు నెలనెలా రూ.2,016 పెన్షన్ అందజేస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థినుల కోసం 53 డిగ్రీ గురుకుల కాలేజీలను ప్రారంభించాం. ఆడపిల్లలకు హెల్త్, హైజీన్ కిట్స్ లను ప్రభుత్వం అందిస్తున్నది''అని మంత్రి చెప్పారు.
కఠినాతికఠినం..
రాష్ట్రంలో మహిళలపై జరిగే అత్యాచారాలను, అఘాయిత్యాలను, ఈవ్ టీజింగ్ ను అరికట్టడానికి విమెన్ ప్రొటెక్షన్ సెల్, షీ టీమ్స్ అప్రమత్తంగా పనిచేస్తున్నాయన్న హరీశ్ రావు.. మహిళలను వేధించేవారిపట్ల ప్రభుత్వం కఠినాతికఠినంగా వ్యవహరిస్తుందని తెలిపారు. మహిళల భద్రత కోసం పెద్ద ఎత్తున చర్యలు చేపట్టిన రాష్ట్రంగానూ తెలంగాణ గుర్తింపు పొందిందని గుర్తుచేశారు.
కేటాయింపులు ఎంతంటే..
వివిధ శాఖల ద్వారా అమలయ్యే సంక్షేమ పథకాల్లో మహిళా లబ్ధిదారులు కూడా ఉన్నారు. అయితే ప్రత్యేకంగా మహిళల కోసమే కేటాయించిన నిధుల విషయంలో మాత్రం కేసీఆర్ సర్కారు ఉదారంగా వ్యవహరిచినట్లు లేదు. స్వయం సహాయక బృందాలు(డ్వాక్రా గ్రూపులకు) వడ్డీలేని రుణాల కింద రూ.1200 కోట్లు ప్రతిపాదిస్తున్నట్లు మంత్రి హరీశ్ తెలిపారు. కొంతకాలంగా రాష్ట్రమంతటా స్వయం సహాయక బృందాల కార్యకలాపాలు నిదానిచడం, ఆర్థిక క్రమ శిక్షణ పేరుతో బ్యాంకులు.. మహిళా గ్రూపులకు రుణాలు ఇచ్చేందుకు వెనుకాడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం మరోసారి వడ్డీలేని రుణాల్ని బడ్జెట్ లో ప్రతిపాదించడం శుభపరిణామం.