Telangana Budget: రైతుబంధుకు పెరిగిన కేటాయింపులు, బీమాతో రైతులకు ధీమా: హరీశ్రావు
పంట పెట్టుబడి సాయంతో రైతులుకు ఆర్థికంగా అండగా నిలుస్తున్నామని ఆర్థికమంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. 2020-2021 బడ్జెట్లో రూ.14 వేల కోట్లు కేటాయించామని బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. రైతుబంధు పథకం ఇతర రాష్ట్రాలకే గాక కేంద్ర ప్రభుత్వానికి కూడా ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా కిసాన్ సన్మాన్ నిధిని కూడా ప్రవేశపెట్టారని గుర్తుచేశారు.
Recommended Video
రూ.4 నుంచి రూ.5 వేలు..
తొలుత ఎకరానికి రూ.4 వేల చొప్పున రెండు పంటలకు రూ.8 వేలు అందజేశామని హరీశ్ రావు వివరించారు. కానీ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పంట పెట్టుబడి సాయం రూ.4 వేల నుంచి రూ.5 వేలకు పెంచామన్నారు. 2018-2019 వానాకాలంలో 5,235 కోట్లు, యాసంగిలో 5,244 కోట్లు వ్యయం చేశామని మంత్రి హరీశ్ రావు వివరించారు.
2019-20లో ఎకరానికి రూ.10 వేలు ఇవ్వడంతో కేటాయింపులు కూడా పెరిగాయని వివరించారు. రూ.12 వేల కోట్లు కేటాయించి.. రైతులకు పంపిణీ చేశామని చెప్పారు. కొత్తగా పాస్ పుస్తకాలు మంజూరు చేయడం వల్ల రైతుబంధు లబ్ధిదారుల సంఖ్య వచ్చే ఏడాది మరింత పెరుగుతోందన్నారు. లబ్ధిదారుల సంఖ్య పెరగడంతో బడ్జెట్లో రూ.2 వేల కోట్లు పెంచామని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.
రూ.5 లక్షల బీమా
రైతుల కోసం రైతు బీమా పథకం అమల్లోకి తీసుకొచ్చామని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ఏ కారణంతోనైతే కుటుంబంలో ఒక్కరు చనిపోతే.. రూ.5 లక్షల బీమా అందజేస్తామని పేర్కొన్నారు. 18 ఏళ్ల వయసు పైబడి 60 ఏళ్ల వయసు ఉన్న ప్రతీ రైతుకు బీమా సదుపాయం వర్తింపజేస్తామని పేర్కొన్నారు.
ప్రతీ రైతు పేరుతో ప్రభుత్వమే రూ.2271.50 ప్రీమియం ఎల్ఐసీ సంస్థకు చెల్లిస్తున్నదని పేర్కొన్నారు. రైతు చనిపోయిన పది రోజుల్లోపే వారి కుటుంబసభ్యులకు బీమా మొత్తం అందేలా చర్యలు తీసుకుంటున్నది అని వివరించారు. రైతు బీమా కోసం బడ్జెట్లో 1141 కోట్లను కేటాయించారు. గోడౌన్ల నిల్వ కోసం రైతు వేదికలను నిర్మించబోతున్నామని మంత్రి హరీశ్ రావు స్పష్టంచేశారు. ఇందుకోసం రూ.350 కోట్లు కేటాయించామని వివరించారు.
రూ.35 కోట్ల లాభాల్లో
ఉమ్మడి రాష్ట్రంలో విజయ డైరీ 30 కోట్ల నష్టంతో మూతపడే పరిస్థితిలో నడిచేదని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం ప్రత్యేక చర్యలు తీసుకుందని వివరించారు. ప్రత్యేక శ్రద్ధ తీసుకొని, వినియోగదారుల్లో విశ్వాసం నింపిందని వివరించారు. 2017-18లో రూ.35 కోట్ల లాభాలను ఆర్జించిందని వివరించారు. మిగిలిన రూ.16 కోట్లను వివిధ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేశామని గుర్తుచేశారు. ఇదీ విజయ డైరీ సిబ్బంది సాధించిన విజయం అని హరీశ్ రావు గుర్తుచేశారు.