Telangana Budget: తెలంగాణ రూ.2 లక్షల 26 వేలు, కేంద్రం లక్షా 35 వేలు, తలసరి ఆదాయంలో భారీ తేడా
అహింస, శాంతియుత మార్గంలో స్వరాష్ట్రం సాధించుకున్నామని తెలంగాణ ఆర్థికమంత్రి హరీశ్ రావు బడ్జెట్ ప్రసంగం ప్రారంభించారు. దార్శనికుడు కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ప్రగతిశీల రాష్ట్రంగా ముందుకెళ్తుందని చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా కేటాయింపులు చేశామని పేర్కొన్నారు. దేశంలో ఏడాదిన్నర నుంచి ఆర్థిక మాంద్యం ఉందని.. దీంతో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం రావడం లేదన్నారు. శాసనసభలో తొలిసారి ఆర్థికమంత్రి హరీశ్ రావు బడ్జెట్ ప్రవేశపెట్టారు. మండలిలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపట్టారు.
Recommended Video
కేసీఆర్ సర్కార్ వరం: 57 ఏళ్లకే ఇకపై పెన్షన్లు.. ఈ ఆర్థిక సంవత్సరం నుంచే అమలు
తెలంగాణ భేష్...
దేశంలో ఆర్థికమాంద్యం ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో తెలంగాణ వృద్ధి కొనసాగుతోందని చెప్పారు. జీఎస్టీ, పన్నులు వసూల్ చేస్తున్న కేంద్ర పన్నుల వాటా మాత్రం ఇవ్వడం లేదని హరీశ్ రావు పేర్కొన్నారు. 2019-2020 ఆర్థిక సంవత్సరంలో 3 వేల 730 కోట్ల రెవెన్యూ ఇవ్వలేదని గుర్తుచేశారు. జీఎస్టీ, ఐజీఎస్టీ రాబడి కూడా ఇవ్వలేదని సభలో వివరించారు. దీంతో రెవెన్యూ వృద్ధి 16.1 శాతం నుంచి 6.3 శాతానికి పడిపోయిందని చెప్పారు.
ఇదీ కారణం...
సెప్టెంబర్లో ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను 1.36 లక్షల కోట్ల బడ్జెట్ను మార్చి 31వ తేదీ వరకు వ్యయం చేస్తామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. లోటును స్వీయ ఆదాయంతో భర్తీ చేసుకున్నామని వివరించారు. దేశవ్యాప్తంగా ఆర్థికమాంద్యం కొనసాగుతోన్న.. తెలంగాణ ప్రభుత్వం అవలంభించిన విధానాలతో ఆర్థికవృద్ధి కొనసాగుతోందని పేర్కొన్నారు.
రూ. 93 వేల తేడా...
సంప్రదాయ పంటలు, వ్యవసాయం, చేపల పెంపకానికి పెద్దపీట వేశామని చెప్పారు. దీంతో ఆయా రంగాల్లో సమ్మిళిత వృద్ధి కొనసాగుతోందని హరీశ్ రావు పేర్కొన్నారు. ఆర్థికమాంద్యంతో దేశ తలసరి ఆదాయం లక్షా 35 వేలకు చేరిందని తెలిపారు. కానీ తెలంగాణ తలసరి ఆదాయం రూ. 2 లక్షల 26 వేలు అని సగర్వంగా సభలో హరీశ్ రావు ప్రకటించారు. తలసరి ఆదాయంలో కేంద్రానికి రాష్ట్రానికి మధ్య రూ. 93 వేల 166 తేడా ఉందని మంత్రి హరీశ్ రావు పేర్కొనగా.. సభ్యులు బల్లచరిచి అభినందనలు తెలిపారు.