Telangana Budget 2020 : సాగునీటికి నిధులెన్ని.. పెండింగ్ ప్రాజెక్టులపై హరీష్ ఏమన్నారు..
తెలంగాణ ఆర్థికమంత్రి హరీష్ రావు రాష్ట్ర బడ్జెట్ 2020-21ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక ప్రవేశపెట్టిన పూర్తి స్థాయి బడ్జెట్ ఇదే కావడం గమనార్హం. మొత్తం 1,82,914.42కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్లో సంక్షేమ పథకాల కేటాయింపులకు పెద్ద పీట వేశారు. రెవెన్యూ వ్యయం 1,38,669కోట్లుగా పేర్కొన్నారు. రాష్ట్ర జీఎస్డీపీ 12.6శాతానికి పడిపోయిందని చెప్పారు. ఇదే బడ్జెట్లో సాగునీటి పారుదల రంగానికి రూ. 11,054 కోట్లు ప్రతిపాదించినట్లు మంత్రి హరీష్రావు తెలిపారు.
ఆ ప్రాజెక్టులు త్వరలో పూర్తి చేస్తామన్న హరీష్
కాళేశ్వరం తెలంగాణ కలల పంట అన్నారు హరీష్ రావు. మూడేళ్ల రికార్డు సమయంలోనే కాళేశ్వరాన్ని పూర్తి చేసి సీఎం కేసీఆర్ జాతికి అంకితం ఇచ్చారని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద బహుళ దశల ఎత్తిపోతల పథకంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రఖ్యాతి గాంచిందన్నారు. మేడిగడ్డ వద్ద సముద్ర మట్టానికి 100మీ. ఎత్తులో ప్రవహించే గోదారి నీటిని 618మీ. ఎత్తుకు లిఫ్ట్ చేసి సాగునీరు అందించే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ అద్భుతంగా చరిత్రలో నిలిచిపోతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మాణమైన వరుస బ్యారేజీలతో నేడు గోదావరి నది 150కి.మీ జీవధారగా రూపు దాల్చిందన్నారు. త్వరలోనే రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ల నిర్మాణం పూర్తవుతుందన్నారు మంత్రి.
కాళేశ్వరం స్ఫూర్తితో పాలమూరు-రంగారెడ్డి
కాళేశ్వరం స్పూర్తితో పాలమూరు-రంగారెడ్డి,సీతారామ ప్రాజెక్టుల నిర్మాణాన్ని ప్రభుత్వం వేగవంతం చేసిందని హరీష్ రావు పేర్కొన్నారు. కరువు పీడిత ప్రాంతమైన పాలమూరు, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల రూపు రేఖలను ఈ ప్రాజెక్టుతో మార్చబోతున్నామని చెప్పారు. అభివృద్ది నిరోధక శక్తులు ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డుపడుతున్నప్పటికీ.. ప్రభుత్వం పట్టదలతో పనులు పూర్తి చేస్తోందన్నారు. కాళేశ్వరం మాదిరిగానే ఈ ప్రాజెక్టును కూడా అనతి కాలంలో పూర్తి చేసే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టుత తెలిపారు.
ఉమ్మడి పాలమూరులో 8లక్షల ఎకరాలకు సాగునీరు..
తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి నడుం బిగించిందన్నారు హరీష్ రావు. సమైక్య రాష్ట్రంలో నత్త నడకన సాగిన పెండింగ్ ప్రాజెక్టులను తెలంగాణ ప్రభుత్వం వేగంగా పూర్తి చేస్తోందన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇప్పటికే 8లక్షల ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు వెయ్యికి పైగా చెరువులను నీటితో నింపామన్నారు. తద్వారా వలసలు ఆగిపోయి వ్యవసాయ ఉత్పత్తి కూడా గణనీయంగా పెరిగిందన్నారు. మెదక్ జిల్లాలో సింగూరు కాల్వల నిర్మాణం పూర్తి చేసి 40 వేల ఎకరాలకు సాగునీరు అందించామని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలోని భక్త రామదాసు ప్రాజెక్టును 11 నెలల రికార్డు సమయంలో, పాలమూరు జిల్లాలోని తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని 8 నెలల కాలంలో పూర్తి చేసి ప్రభుత్వం రికార్డు సృష్టించిందన్నారు.