Telangana Budget 2o2o: కేటాయింపులపై మంత్రుల హర్షం, కేసీఆర్, హరీశ్కు థ్యాంక్స్ అంటూ..
హైదరాబాద్: అసెంబ్లీ అదివారం ఆర్థికమంత్రి హరీశ్ రావు ప్రవేశపెట్టిన బడ్జెట్పై రాష్ట్ర మంత్రులు ప్రశంసలు కురిపించారు. ఈ బడ్జెట్ సీఎం కేసీఆర్ ఆశయం, ఆకాంక్షలకు అద్దం పడుతోందని వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. బడ్జెట్ కేటాయింపులపై ఆయన మాట్లాడారు.
కోటి ఎకరాల మాగాణ తెలంగాణ లక్ష్యంగా ముందుకు సాగుతున్న సీఎం కేసీఆర్ లక్ష్యానికి అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులున్నాయని మంత్రి వ్యాఖ్యానించారు. గత ఆరేళ్లలో సీఎం కేసీఆర్ నిర్ణయాల మూలంగా తెలంగాణ అంతా పచ్చబడుతున్నదని తెలిపారు. తమది రైతు ప్రభుత్వమని, ఇది రైతు బడ్జెట్ అని మరోసారి నిరూపితమైందని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.
రైతుబంధు పథకం కింద లబ్దిదారులు పెరిగిన నేపథ్యంలో గతంలో కేటాయించిన రూ.12 వేల కోట్లకు అదనంగా మరో రూ. 2 వేల కోట్లు పెంచి రూ.14 వేల కోట్లు కేటాయించడం హర్షణీయమన్నారు. రైతులకు ప్రభుత్వమే బీమా చెల్లించి రైతు కుటుంబాలలో ధీమాను పెంచే రైతు భీమా పథకానికి రూ.1141 కోట్లు కేటాయించిందన్నారు. గత ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు రూ.లక్ష లోపు రైతుల రుణాల మాఫీకోసం బడ్జెట్ లో రూ. 6,225 కోట్లు ప్రభుత్వం కేటాయించినట్లు తెలిపారు.
ప్రతి 5 వేల ఎకరాలకు ఒక రైతువేదిక నిర్మాణం.. ప్రతి రైతు వేదికకు రూ.12 లక్షలు కేటాయిస్తూ రూ.350 కోట్లు కేటాయించినట్లు, రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు పంటల కొనుగోళ్లకోసం రూ.1000 కోట్లు కేటాయించడం సాహసోపైతమయిన చర్య అని తెలిపారు. విత్తనాల సబ్సిడీకి రూ.142 కోట్లు..పాడి రైతుల ప్రోత్సాహం కోసం రూ.100 కోట్లు, బిందు, తుంపర సేద్యానికి రూ. 600 కోట్లు, వ్యవసాయానికి ఉచితంగా 24 గంటల కరంటు సరఫరా భారం రూ.5 వేల కోట్లు, సాగునీటి రంగానికి రూ. 11,054 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్థికమంత్రి హరీష్ రావుకు రైతాంగం పక్షాన ధన్యవాదాలు తెలిపారు మంత్రి నిరంజన్ రెడ్డి.
హైదరాబాద్ మహా నగర అభివృద్ధికి రూ. 10వేల కోట్లు కేటాయించడం పట్ల మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్.. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావుకు ధన్యవాదాలు తెలిపారు. కాగా,రూ. 1,82,914 కోట్ల బడ్జెట్లో.. ఎస్సీల ప్రత్యేక ప్రగతి నిధి కోసం రూ. 16,534.97కోట్లు కేటాయించడంపై మంత్రి కొప్పుల ఈశ్వర్.. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, రవిశంకర్, సీఎంను కలిసిన వారిలో మంత్రితో పాటు మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, రవి శంకర్, కోరుకంటి చందర్ లతో కలిసి మంత్రి సీఎంను కలిశారు.