మూస పద్ధతి వద్దు, దుబారా తగ్గించండి: బడ్జెట్ రూపకల్పనపై కేసీఆర్ సూచన
హైదరాబాద్: రానున్న రోజుల్లో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ను సరఫరా చేస్తామని తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ గురించి మాట్లాడారు. అంతకముందు సీఎం కేసీఆర్తో మంత్రి ఈటెల బడ్జెట్ కసరత్తుపై సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో బడ్జెట్ రూపకల్పనలో గతంలో అనుసరించిన మూస పద్ధతి కాకుండా ప్రణాళికావ్యయం ఎక్కువగా ఉండేలా బడ్జెట్ను రూపొందించాలని సీఎం కేసీఆర్ రాష్ట్ర ఆర్థికశాఖ అధికారులకు ఆదేశించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా నిధుల కేటాయింపులు జరపాలని ఆయన సూచించారు.
పెండింగ్ పనులపై జిల్లాల వారీగా అన్ని శాఖలు ఆర్థిక శాఖకు నివేదికలు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని, గత బడ్జెట్లో ఖర్చయిన నిధులు, వచ్చే ఆర్థిక సంవత్సరంలో కావాల్సిన నిధులపై అంచనాలు రూపొందించాలని కేసీఆర్ పేర్కొన్నారు. పన్నుల వసూళ్లు 100 శాతం జరగాలని, అదేవిధంగా దుబారా తగ్గించాలని అధికారులకు సూచించారు.
రాష్ట్రంలోని పరిస్థితులను వెంటనే న్యూఢిల్లీ వెళ్లి కేంద్రానికి వివరించాలని కేసీఆర్ ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డిని ఆదేశించారు. వచ్చే ఏడాది 60 మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు.
రెసిడెన్షియల్ స్కూళ్లల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన జరగాలని ఉన్నతాధికారులను సూచించారు. తొలి ఏడాది 5, 6, 7 తరగతుల్లో ప్రవేశాలు కల్పించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత ఒక్కో తరగతి పెంచుకుంటూ పోవాలని అధికారులకు కేసీఆర్ సూచించారు.
చంచల్ గూడ జైలును చర్లపల్లికి తరలించాలని, అదే విధంగా మలక్ పేటలోని రేస్కోర్స్ను నగర శివారుకు తరలించాలని ఉన్నతాధికారులకు కేసీఆర్ ఆదేశించారు. సదరు రెండు స్థలాలు రెసిడెన్షియల్ పాఠశాలలకు ఉపయోగించాలని ఉన్నతాధికారులకు ఆయన సూచించారు.
ప్రణాళికావ్యయంలో 25వేల కోట్లు ఇరిగేషన్కు కేటాయిస్తున్నందున, మిగతా నిధులను వ్యూహాత్మకంగా వినియోగించుకోవాలని ఆర్థికశాఖ అధికారులను ఆదేశించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి ఈటెల తమ ప్రభుత్వం ప్రవేశబొట్టబోయే తదుపరి బడ్జెట్ మానవీయ కోణంలో ఉంటుందని అన్నారు.
బడ్జెట్పై మాట్లాడుతూ సంక్షేమ రంగానికి రూ. 35 వేల కోట్లు ఖర్చుచేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కడుపు నిండి అన్నం తినాలనే ఉద్దేశ్యంతో సన్నబియ్యం పథకాన్ని ప్రవేశపెట్టామన్నారు. మిషన్ కాకతీయలో 46 వేల చెరువులను పునరుద్ధరించామని చెప్పిన ఈటెల చెరువు పునరుద్ధరణకు రూ. 12 వేల నుంచి రూ. 15వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు.
దేశంలో రైతుల ఆత్మహత్యలు ఎందుకు ఆగడం లేదో ఆర్ధికవేత్తలు ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన 18 నెలల కాలంలోనే కోతలు లేని విద్యుత్ని అందిస్తున్నామన్నారు. రైతుల ఆత్మహత్యలను అరికట్టేందుకు గాను రైతులకు మద్దతు ధర కల్పించాలని కేంద్రాన్ని ఇప్పటికే కోరామన్నారు. సీడ్బౌల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణను తీర్చిదిద్దుతమని మంత్రి ఈటెల పేర్కొన్నారు.
కొండా లక్ష్మణ్ బాపూజీ పేరుతో తెలంగాణలో విశ్వవిద్యాలయం
తెలంగాణ పోరాట యోధుడు, దివంగత కొండా లక్ష్మణ్ బాపూజీ పేరిట ఉద్యాన, అటవీ విశ్వవిద్యాలయం ఏర్పాటు కానుంది. ఈ వర్శిటీకి జనవరి 7న మెదక్ జిల్లా ములుగులో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ పాల్గొననున్నారు.